‘దశాబ్దాల తరబడి మునుగోడు నియోజకవర్గం ఫ్లోరైడ్ మహమ్మారితో అవస్థలు పడ్డా అప్పుడు రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలో ఉన్న ఏ ప్రభుత్వమైనా పట్టించుకున్నదా? కేసీఆర్ సచ్చుడో, తెలంగాణ వచ్చుడో అని నినదించి తెలంగాణ రాష్ట్రం సాధించిన ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే స్వరాష్ట్రంలో మునుగోడుపై ప్రత్యేక దృష్టి పెట్టి మిషన్ భగీరథతోఫ్లోరోసిస్ను తరిమికొట్టారు. ఆయన కృషితోనే నేడు మునుగోడు ఎటుచూసినా పచ్చగా సస్యశ్యామలై కనిపిస్తున్నది’అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. మునుగోడులో శుక్రవారం ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనం, వన భోజనాలకు మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఎనిమిదేండ్లలోనే ఎనలేని ప్రగతి, అనేక సంక్షేమ పథకాలతో సీఎం కేసీఆర్ దేశానికి మార్గదర్శిగా నిలిచారని, మన పథకాలవైపు ఇతర రాష్ర్టాల ప్రజలు ఆశగా చూస్తున్నారని తెలిపారు. అటువంటి పథకాలు ఎందుకు అమలు చేయరని సొంత రాష్ట్రమైన
గుజరాత్లో మోదీని అక్కడి ప్రజలు నిలదీస్తున్నారని, దేశంలో తలెత్తుకుని తిరిగే పరిస్థితులు లేకనే మోదీ, అమిత్షా తెలంగాణపై విషం చిమ్ముతున్నారని పేర్కొన్నారు. రాజగోపాల్రెడ్డి అనే దొంగను అడ్డం పెట్టుకొని కుట్రలకు తెరలేపారని మండిపడ్డారు. మునుగోడు నియోజకవర్గంలో బీజేపీని తుక్కుతుక్కుగా ఓడించాలని పిలుపునిచ్చారు. అంతకుముందు టీఆర్ఎస్ జిల్లా ఇన్చార్జి తక్కెళ్లపల్లి రవీందర్రావు, ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్రెడ్డి, చిరుమర్తి లింగయ్య, పైళ్ల శేఖర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్రెడ్డి టీఆర్ఎస్ కుటుంబ సభ్యులతో కలిసి బోనాలు, బతుకమ్మలు, కోలాటాలు,
ఒగ్గు కళాకారుల ప్రదర్శనతో మునుగోడు చౌరస్తా నుంచి సమ్మేళనం ప్రాంగణానికి భారీ ర్యాలీగా చేరుకున్నారు.
మునుగోడు ఆత్మీయ సమ్మేళనం ప్రాంగణంలో కోలాటం ఆడుతున్న టీఆర్ఎస్ కుటుంబ సభ్యులు
ఆత్మీయ సమ్మేళనం, వన భోజనాలు ఇంటి పండుగలా సంబురంగా సాగాయి.
మునుగోడు, సెప్టెంబర్ 23 : ‘కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో’ అని నినాదమిచ్చి ఆమరణ నిరాహార దీక్షతో చావునోట్లో తల పెట్టి ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించిన సీఎం కేసీఆర్ ఎనిమిదేండ్లలోనే రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా మార్చి దేశా నికే ఆదర్శంగా నిలిపారని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. మునుగోడులో శుక్రవారం ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనం, వన భోజనాల కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. నాటి టీడీపీ ప్రభుత్వం విద్యుత్ చార్జీలు పెంచి తెలంగాణ రైతులపై పెనుభారం మోపిందని, దీనికి అంగీకరించని కేసీఆర్ ఆ పార్టీకి, పదవికి రాజీనామా చేసి రాష్ట్ర సాధన కోసం జలదృశ్యంలో గులాబీ జెండా ఎగురవేశారని గుర్తుచేశారు.
రాష్ట్రం సాధించాక తన అవసరం లేదని కేసీఆర్ అంటే తెలంగాణ ప్రజలు ఒప్పుకోలేదని, మళ్లీ తెలంగాణను ఆరునెలల్లో ఆంధ్రాకు అమ్ముకుంటారని ఈనగాచి నక్కల పాలు చేయొద్దని ప్రజలు కోరారని తెలిపారు. తెలంగాణ ప్రజల బాధలు తెలిసిన నాయకుడిగా రాష్ర్టాన్ని ముందుకు నడిపించాలని ప్రజలు ముక్తకంఠంతో కోరితే కేసీఆర్ టీఆర్ఎస్ను కొనసాగించారని చెప్పారు. ప్రజల ఆశీర్వాదంతో ఐదేండ్లలోనే భారతదేశంలో నంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దారని కొనియాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల కన్నా ఎక్కువ పథకాలు తీసుకొచ్చి తెలంగాణను సంక్షేమ రంగంలో ప్రథమ స్థానంలో నిలిపారని అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే కరెంటు, నీళ్లు రావని చెప్పిన ఆంధ్రోళ్ల నోళ్లు మూయించి అత్యధిక పంటలు పండించే రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దారని చెప్పారు. 47లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండిస్తూ నల్లగొండ జిల్లా దేశంలోనే రికార్డు సాధించిందని తెలిపారు. నల్లగొండ జిల్లాలో నాటి ప్రభుత్వాలు 60ఏండ్లు పెంచి పోషించిన ఫ్లోరోసిస్ను సీఎం కేసీఆర్ ఆరేండ్లలోనే మిషన్ భగీరథ ద్వారా తరిమికొట్టారని చెప్పారు. టీఆర్ఎస్ సర్కారు అమలు చేస్తున్న పథకాలు దేశానికి ఆదర్శంగా మారాయని, గులాబీ కార్యకర్తలుగా మనమంతా ఇందుకు గర్వపడాలని అన్నారు.
ప్రజల్లోకి వెళ్లే ధైర్యం టీఆర్ఎస్ కార్యకర్తలకు మాత్రమే ఉందని, ఏ ఇతర పార్టీల వారికీ లేదని మంత్రి తెలిపారు. గుజరాత్లో 22 ఏండ్లుగా బీజేపీ ప్రభుత్వం ఉందని, అక్కడ ఆరు గంటలకు మించి కరెంటు ఇవ్వడం లేదని అన్నారు. అక్కడ మోటర్లకు మీటర్లు పెట్టారని, 1వ తేదీన కరెంటు బిల్లు కట్టకుంటే రైతు కాళ్లు పట్టుకున్నా కనికరించకుండా కనెక్షన్ కట్ చేస్తారని చెప్పారు. కేసీఆర్ను తెచ్చుకుంటే తమకూ రైతుబంధు, నెలకు రూ.2వేల పింఛన్, 24 గంటల ఉచిత విద్యుత్ వస్తాయని పొరుగు రాష్ర్టాల ప్రజలు మాట్లాడుకుంటున్నారని తెలిపారు. అద్భుతమైన పాలన అందిస్తున్న సీఎం కేసీఆర్ను చూసి మోదీ, అమిత్షా భయపడుతున్నారని, మనం చేయలేని పనిని కేసీఆర్ చేస్తున్నాడనే ఈర్ష్యతో తెలంగాణపై విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ను ఢిల్లీకి రానివ్వకుండా కుట్ర చేస్తున్న బీజేపీ.. ఒక దొంగను కొనుగోలు చేసి మునుగోడు ఉప ఎన్నిక తీసుకొచ్చిందని దుయ్యబట్టారు. స్వాతంత్య్ర ఉద్యమంలో బ్రిటీష్ వాళ్లకు కొందరు అమ్ముడుపోయినట్లుగా మాజీ ఎమ్మెల్యే బీజేపీకి అమ్ముడుపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల పట్ల మోదీ, అమిత్షాకు సోయి ఉంటే కేసీఆర్ ఎలా అభివృద్ధి చేస్తున్నారో వచ్చి చూడాలని హితవు పలికారు. మునుగోడు నియోజకవర్గంలో టీఆర్ఎస్ కుటుంబ సభ్యులే 75వేల పైచిలుకు ఉన్నారని, బీజేపీ మూడో స్థానానికి పరిమితం అవుతుందని అన్నారు. కేసీఆర్ కుటుంబం అంటే నలుగురు మాత్రమే కాదని, 75లక్షల గులాబీ కార్యకర్తలు, 3.5కోట్ల ప్రజలు ఆయన వెంట ఉన్నారని తెలిపారు. శత్రువు ఎంతటివాడైనా కేసీఆర్ ముందు నిలువలేడని, మనమంతా కేసీఆర్ అడుగుజాడల్లో నడిస్తే మోదీని, బీజేపీని ఢీకొట్టడం పెద్ద సమస్య కాదని చెప్పారు.
టీఆర్ఎస్తోనే మునుగోడు అభివృద్ధి
మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి టీఆర్ఎస్తోనే సాధ్యమని, రానున్న ఉప ఎన్నికలో టీఆర్ఎస్ను భారీ మెజార్టీతో గెలిపించుకుందామని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు. వేలకోట్ల రూపాయల కాంట్రాక్టుల కోసం బీజేపీకి అమ్ముడుపోయిన కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిని చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. కృష్ణరాంపల్లి, చర్లగూడెం రిజర్వాయర్లు పూర్తయితే మునుగోడు ప్రాంతం సస్యశ్యామలం అవుతుందని, ఉప ఎన్నికలో టీఆర్ఎస్ గెలిస్తే నియోజకవర్గ ప్రజల మనసులో ఉన్న అన్ని అభివృద్ధి పనులు పూర్తవుతాయని తెలిపారు.
– కంచర్ల భూపాల్రెడ్డి, నల్లగొండ ఎమ్మెల్యే
రాజగోపాల్రెడ్డికి డిపాజిట్ రాకుండా చేయాలి
మునుగోడు ప్రజల ఆత్మగౌరవాన్ని బీజేపీకి అమ్ముకున్న కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డికి సరైన బుద్ధి చెప్పాలని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అన్నారు. బీజేపీది దొంగల బండి అని.. అభివృద్ధి కావాలనుకున్న వారంతా టీఆర్ఎస్ బండిలో ఉన్నారని తెలిపారు. ఉప ఎన్నికలో రాజగోపాల్రెడ్డికి డిపాజిట్ కూడా రాకుండా చేయాలని పిలుపునిచ్చారు. మునుగోడులో గులాబీ పార్టీని గెలిపించుకొని సీఎం కేసీఆర్కు బహుమతిగా ఇద్దామని, టీఆర్ఎస్ గెలిచాక కారు నిండా నిధులు తీసుకొచ్చి మునుగోడును మరింత అభివృద్ధి చేసుకుందామని అన్నారు. మరోసారి గెలిపిస్తే మునుగోడు ప్రజలకు జన్మంతా రుణపడి ఉంటానని చెప్పారు.
-కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే
ఆకట్టుకున్న కళా ప్రదర్శనలు
సమ్మేళనానికి ముందు మునుగోడు చౌరస్తా నుంచి బోనాలు, కోలాటాలు, ఒగ్గు కళాకారుల ప్రదర్శనతో నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి సభా స్థలానికి చేరుకున్నారు. కళాకారులు ప్రదర్శించిన పేరిణి నృత్యం సభికులను ఆకట్టుకుంది. టీఆర్ఎస్ సంక్షేమ పథకాలను వివరిస్తూ డ్యాన్స్మాస్టర్ సందీప్ ఆధ్వర్యంలో నృత్యప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనంతరం ఇండియన్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ (ఐఎస్ఓ) అధ్యక్షుడు రవితేజతోపాటు వంద మంది, కొంపల్లికి చెందిన కాంగ్రెస్, టీడీపీ నాయకులు సుమారు 200 మంది మంత్రి జగదీశ్రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. వీరికి మంత్రి గులాబీ కండువాలు కప్పి గులాబీ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ ఆత్మీయ సమ్మేళనానికి సుమారు పదివేల మందికి పైగా కార్యకర్తలు హాజరై తృప్తిగా భోజనం చేసి టీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించారు. ఉప ఎన్నికలో టీఆర్ఎస్ తప్పక గెలుస్తుందని వారు ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు, ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్రెడ్డి, చిరుమర్తి లింగయ్య, నల్లగొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, ఎంపీపీ కర్నాటి స్వామి, జడ్పీటీసీ నారబోయిన స్వరూపారాణి, రాష్ట్ర నాయకుడు నారబోయిన రవి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బండ పురుషోత్తంరెడ్డి, వైస్ ఎంపీపీ అనంత వీణ, మార్కెట్ వైస్ ఛైర్మన్ జాజుల అంజయ్యగౌడ్, జిల్లా మాజీ కార్యదర్శి గుర్రం సత్యం, దాడి శ్రీనివాస్రెడ్డి, భవనం శ్రీనివాస్రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి పగిళ్ల సతీశ్, అనంత లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.