నందికొండ, సెప్టెంబర్ 20 : నిడమనూరు మండలం వేంపాడు వద్ద సాగర్ ఎడమ కాల్వకు పడిన గండి పూడ్చివేత పనులు పూర్తయ్యాయి. దాంతో మంగళవారం ఎన్నెస్పీ అధికారులు 2,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. వారం రోజుల్లో ఎడమ కాల్వకు పూర్తిస్థాయిలో నీళ్లివ్వనున్నట్లు తెలిపారు. గండి పడిన ప్రాంతంలో పూర్తిచేసిన పనులను జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి, ఎమ్మెల్యేలు శానంపూడి సైదిరెడ్డి, బొల్లం మల్లయ్యయాదవ్, నోముల భగత్తో కలిసి పరిశీలించారు. రైతుల ప్రయోజనం దృష్ట్యా పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసినట్లు మంత్రి చెప్పారు.
నాగార్జునసాగర్ ఎడమ కాల్వకు నీటి విడుదలను మంగళవారం అధికారులు ప్రారంభించారు. ప్రధాన కాల్వ 32.109 కిలోమీటరు వద్ద నిడమనూరు మండలం వేంపాడు సమీపంలో ఈ నెల 7న గండి పడడంతో నీటి విడుదలను నిలుపుదల చేశారు. ప్రస్తుతం పూడ్చివేత పనులు పూర్తయిన నేపథ్యంలో నీటి విడుదలను పునురుద్ధరించారు. ఎడమ కాల్వ జలవిద్యుత్ కేంద్రం ద్వారా 2వేల క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు. గండి ప్రదేశంలో పనులను పర్యవేక్షిస్తూ వారం రోజుల్లో పూర్తిస్థాయిలో ఎడమకాల్వకు నీటిని విడుదల చేస్తామని ఎన్నెస్పీ సీఈ శ్రీకాంతారావు తెలిపారు.
ఎడమ కాల్వ గండి పూడ్చివేత పనులు పూర్తి
నిడమనూరు : మండల పరిధిలోని వేంపాడు శివారులో సాగర్ ఎడమ ప్రధాన కాల్వకు పడిన గండి పూడ్చి వేత పనులు పూర్తయ్యాయి. ఈ నెల 7న 32.109 కిలోమీటరు వద్ద అండర్ టన్నెల్లో ఏర్పడిన రంధ్రం కారణంగా కట్ట కోతకు గురై గండి పడింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో అధికారులు గండి పూడ్చివేత పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టి పూర్తి చేశారు. కాల్వ మధ్య భాగంలో ఇసుక బస్తాలతో బెడ్ వేసి మట్టికట్ట నిర్మాణం చేపట్టారు. బెడ్ మట్టం నుంచి 7.5 మీటర్ల ఎత్తులో మట్టికట్టను పటిష్టంగా నిర్మించారు. మంగళవారం కాల్వకు నీటిని విడుదల చేసిన నేపథ్యంలో గండి ప్రాంతంలో నిర్మించిన మట్టికట్టకు అనుబంధంగా ఇసుక బస్తాలు వేశారు. రైతులు సాగు చేసిన పంట పొలాలు ఎడిపోకుండా చూసేందుకు అధికారులు రెండు వారాల పాటు రేయింబవళ్లు శ్రమించారు. సుమారు 50వేల క్యూబిక్ మీటర్ల మట్టిని వినియోగించి కాల్వ గండి పనులు పూర్తి చేసినట్లు నీటిపారుదలశాఖ ఈఈ లక్ష్మణ్ తెలిపారు.