నీలగిరి, సెప్టెంబర్ 19 : జిల్లా కేంద్ర దవాఖానల్లో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ రమేశ్రెడ్డి అన్నారు. ఇటీవల జిల్లా కేంద్ర ప్రభుత్వ దవాఖానలో బాలింత మృతి చెందడంపై ఆస్పత్రిలో సోమవారం ఆయన వివరాలు సేకరించారు. స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డితో కలిసి ఆస్పత్రిని సందర్శించారు. సిబ్బందితోపాటు గర్భిణులు, బాలింతలు, వారి బంధువులతో మాట్లాడారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కొందరు డాక్టర్ల ప్రవర్తన సరిగా లేదని తమ దృష్టికి వచ్చిందని, అలాంటి వారిపై తగిన చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా ఆస్పత్రికి వచ్చిన గర్భిణి ప్రసవం అనంతరం పీపీహెచ్ అధికం కావడంతో తీవ్ర రక్తస్రావమైందన్నారు. ఆమెకు నాలుగు యూనిట్ల బ్లడ్ ఎక్కించినా కంట్రోల్ కాకపోవడంతో తప్పని పరిస్థితుల్లో గర్భసంచిని తొలగించాల్సి వచ్చిందన్నారు. అయినా రక్తస్రావం కంట్రోల్ కాకపోవడం వల్ల గాంధీ అసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించినా ఫలితం లేకుండా పోయిందన్నారు.
ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి మాట్లాడుతూ నల్లగొండ మెడికల్ కళాశాలను రానున్న ఏడాదిన్నర కాలంలో పూర్తి చేసి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా మారుస్తామన్నారు. రోగుల సహాయకులు డాక్టర్లకు సహకరించాలని సూచించారు.