శాలిగౌరారం, జనవరి 24 : శాలిగౌరారం ప్రాజెక్టుకు మహర్దశ పట్టనుంది. సమైక్యాంధ్ర పాలనలో ప్రాజెక్టు ఏనాడూ పూర్తి స్థాయిలో మరమ్మతులకు నోచుకోలేదు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధికి నిధులను మంజూరు చేసింది. ప్రస్తుతం ప్రాజెక్టు కట్టకు ఇరువైపులా పెరిగిన కంప చెట్లు, కుడి కాల్వను కమ్మేసిన కంప చెట్లను తొలగించి కాల్వను శుభ్రం చేస్తున్నారు. దీంతో ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వలకు 2 వేల ఎకరాలకు సాగు నీరు అందగా కాలక్రమేణా సాగు విస్తీర్ణం పెరుగడంతో ప్రస్తుతం ఆయకట్టు కింద 6వేల ఎకరాలు సాగులోకి రానున్నాయి.
నాడు అరకొర నిధులు
శాలిగౌరారం ప్రాజెక్టుకు సమైక్యాంధ్ర పాలనలో అరకొర నిధులు వెచ్చించి చేతులు దులుపుకున్నారే తప్ప ఏనాడూ పూర్తిస్థాయిలో మరమ్మతులకు నోచుకోలేదు. దాంతో వానకాలం, యాసంగి పంటలకు నీటిని విడుదల చేసిన సమయంలో చివరి భూములకు నీరందని పరిస్థితి ఎదురయ్యేది.
రూ.6.66 కోట్ల నిధులు
తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక శాలిగౌరారం ప్రాజెక్టుకు మరమ్మతులు చేపట్టేందుకు రూ.6 కోట్ల 66 లక్షలా58 వేల నిధులను మంజూరు చేసింది. పల్లివాడ నుంచి శాలిగౌరారం ప్రాజెక్టు వరకు వచ్చే రాచకాల్వకు ఇరువైపులా దట్టంగా పెరిగిన కంప చెట్లు, ప్రయాణమార్గంలోని శిథిలమై ఉన్న షెట్టర్లకు మరమ్మతులు, ప్రాజెక్టు కట్ట వెడల్పు, కట్టకు ఇరువైపులా కంప చెట్లు తొలగించడం, కుడి కాల్వను శుభ్రం చేయడం లాంటి మరమ్మతులు చేయనున్నారు. ప్రస్తుతం జంగల్ కటింగ్ పనులు చేస్తున్నారు.
ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు
ప్రాజెక్టు శాశ్వత పరిష్కారం దిశగా మరమ్మతులు చేపట్టడం మా అదృష్టం. గతంలో మా ప్రాజెక్టును పట్టించుకున్న దాఖలాలు లేవు. ప్రస్తుతం ప్రాజెక్టుకు నిధులు కేటాయించి అభివృద్ధి చేయడం సంతోషాన్ని కలిగిస్తున్నది. నిధులు మంజూరు చేయించిన ఎమ్మెల్యే కిశోర్కుమార్కు ప్రత్యేక కృతజ్ఞతలు.
రైతుల సంక్షేమం కోసమే..
రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. అందులో భాగంగానే దశాబ్దాల కాలంగా పేరొందిన శాలిగౌరారం ప్రాజెక్టును అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు నా వంతు కృషి చేశాను. టెండర్ల ప్రక్రియ పూర్తయ్యింది. సాధ్యమైనంత త్వరలో అధికారికంగా ప్రారంభించి వానకాలం వచ్చే నాటికి పనులు పూర్తయ్యేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటా .
-గాదరి కిశోర్కుమార్, ఎమ్మెల్యే తుంగతుర్తి