నల్లగొండ, ఆగస్టు 15 : ఎందరో ఉద్యమకారులు, మహనీయుల త్యాగ ఫలితమే దేశానికి స్వాతంత్య్రం అని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అంతకుముందు కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, ఎస్పీ రెమా రాజేశ్వరితో కలిసి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 282 మంది ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందచేశారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో విద్యార్థినీ విద్యార్థుల నృత్య ప్రదర్శనలను తిలకించారు. పలు శాఖల శకటాల ప్రదర్శన అనంతరం పలువురి లబ్ధిదారులకు ఆస్తులు పంపిణీ చేసి మాట్లాడారు. రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని కంకణం కట్టుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఎనిమిదేండ్లుగా చేస్తున్న కృషి ఫలితమే నేడు తెలంగాణ దేశంలోనే అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలిచిందని తెలిపారు. అభివృద్ధితో పాటు సంక్షేమానికి నిధులు కేటాయిస్తూ రాష్ర్టాన్ని ముందుకు తీసుకెళ్తున్న ఘనత మన సీఎం కేసీఆర్దే అని పేర్కొన్నారు.
కోట్లాది రూపాయలతో సంక్షేమం..
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు గడిచినా దళితుల జీవన విధానం మెరుగు పడలేదనే ఉద్ధేశంతో రాష్ట్ర ప్రభుత్వం దళిత బందు పథకాన్ని అమలు చేస్తున్నట్లు గుత్తా సుఖేందర్రెడ్డి తెలిపారు. నియోజకవర్గానికి వంద మంది చొప్పున ఇప్పటికే 518 మందికి రూ.51.18 కోట్లు అందజేసినట్లు చెప్పారు. ఆసరా పథకం కింద ఈ స్వాతంత్య్ర దినోత్సవం నుంచి మరో 51 వేల మందికి పింఛన్ అందజేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. పల్లె ప్రగతి, హరితహారంతో గ్రామాలు సమగ్రాభివృద్ధి సాధించాయన్నారు.
నల్లగొండ పట్టణాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక..
నల్లగొండ పట్టణాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలనే ఉద్ధేశంతో సీఎం కేసీఆర్ రూ.750 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. పట్టణ సుందరీకరణలో భాగంగా జంక్షన్లు, ఆర్చ్లు, పార్కులు, వెజ్, నాన్ వెజ్ మార్కెట్లు, నీటి సరఫరా, వైకుంఠ ధామాలు, ఇండోర్, అవుట్ డోర్ స్టేడియాలు, డ్రైనేజీ, రైతు బజార్ల నిర్మాణం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ బండా నరేందర్రెడ్డి, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్రెడ్డి, నల్లమోతు భాస్కర్రావు, నోముల భగత్, చిరుమర్తి లింగయ్య, నల్లగొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి పాల్గొన్నారు.
రూ. 5.77 కోట్ల ఆస్తుల పంపిణీ..
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వివిధ వర్గాల నిరుపేద లబ్ధిదారులకు ప్రభుత్వ తరుపున సుమారు రూ.5.77 కోట్ల ఆస్తులను మండలి చైర్మన్ పంపిణీ చేశారు. మహిళా సంఘాలకు బ్యాంక్ లింకేజీ కింద నగదు, దివ్యాంగులకు ట్రైసైకిల్స్, క్రచేస్లు, లబ్ధిదారులకు దశిత బంధు యూనిట్లను అందజేశారు.
శకటాల ప్రదర్శన.. సాంస్కృతిక ప్రదర్శనలు
పోలీసు పరేడ్ గ్రౌండ్లో జరిగిన వేడుకల్లో అభివృద్ధి, సంక్షేమాన్ని వివరిస్తూ ఆయా శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన శకటాల ప్రదర్శన చూపరులను ఆకట్టుకుంది. అలాగే విద్యా శాఖ అధ్వర్యంలో చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. సాంస్కృతిక ప్రదర్శనలో పాల్గొన్న పాఠశాలలకు బహుమతులు ప్రదానం చేశారు.
విద్య, వైద్యానికి ప్రాధాన్యం..
ప్రభుత్వం విద్య, వైద్యానికి కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నదని మండలి చైర్మన్ అన్నారు. ఈ క్రమంలో భాగంగానే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మన ఊరు-మన బడి కార్యక్రమమని తెలిపారు. ఇక కేసీఆర్ కిట్, ఆరోగ్యశ్రీ కింద చికిత్సలు, నల్లగొండకు మెడికల్ కళాశాల మంజూరు చేసిన సీఎం ఎస్ఎల్బీసీలో 42 ఎకరాల్లో నూతన భవన నిర్మాణం చేపట్టినట్లు వెల్లడించారు.
వ్యవసాయ, సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత..
రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటందనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ రైతుకు ప్రాధాన్యత ఇస్తూ ఆ రంగంలో అనేక పథకాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. రైతు బంధు, రైతు బీమా, రైతు వేదికల నిర్మాణం, ధాన్యం కొనుగోలు చేపట్టినట్లు వెల్లడించారు. ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో సబ్సిడీలతో ఆయిల్పామ్ సాగుకు ప్రోత్సాహం ఇస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయ అనుబంధ రంగాలైన పాడి, మత్స్య, గొర్ల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నామన్నారు. ఇక వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ అందజేస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో లిఫ్ట్ల కింద ఉన్న రైతాంగానికి సాగు నీరు అందించాలనే ఉద్ధేశంతో నాగార్జున సాగర్, మిర్యాలగూడ, దేవరకొండ, నకిరేకల్ నియోజక వర్గాల్లో లిఫ్ట్ల కోసం రూ.703 కోట్లు కేటాయించి నిర్మాణం చేస్తున్నట్లు తెలిపారు.