హాలియా,ఆగస్టు 11: స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా గురువారం జిల్లా వ్యాప్తంగా పోలీసుశాఖ ఆధ్వర్యలో ఫ్రీడమ్ రన్ నిర్వహించారు. యువతలో స్వాతంత్య్ర స్ఫూర్తి నింపేలా 2కేరన్ సాగింది. పోలీసులు, యువకులు, అధికారులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. హాలియా, నిడమనూరు, నాగార్జునసాగర్లో ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ స్థానిక ప్రజాప్రతినిధులు, పోలీస్ అధికారులతో కలసి రన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గాంధీ మహత్ముడు కలలు గన్న గ్రామ స్వరాజ్య స్థాపనే సీఎం కేసీఆర్ ధ్యేయమన్నారు. వజ్రోత్సవాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములై దేశ ఔన్నత్యాన్ని చాటాలన్నారు.
అనేకమంది త్యాగాల ఫలితమే స్వాతంత్య్రం : ఎమ్మెల్యే కంచర్ల
నీలగిరి : అనేక మంది సమరయోధుల ప్రాణత్యాగ ఫలితంగానే మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు. గురువారం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన ఫ్రీడమ్ రన్ను జిల్లా కలెక్టర్ వినయ్కృష్టారెడ్డి, ఎస్పీ రెమా రాజేశ్వరితో కలిసి ప్రారంభించారు. స్వాతంత్య్ర పోరాట చరిత్రను ప్రతి ఒక్కరికీ తెలిపేందుకు సీఎం కేసీఆర్ వజ్రోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని పిలపునిచ్చారని పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాహుల్శర్మ, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోనిరమేశ్, కమిషనర్ డా.కేవీ.రమణాచారి, వివిధ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, యువతీ యువకులు పాల్గొన్నారు.
స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలు మరువలేనివి : ఎమ్మెల్యే భాస్కర్రావు
మిర్యాలగూడ : స్వాతంత్య్ర సాధనకు సమరయోధుల త్యాగాలు మరువలేనివని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు. గురువారం మిర్యాలగూడ పట్టణంలో పోలీసుశాఖ ఆధ్వర్యంలో ఎన్ఎస్పీ క్యాంపు నుంచి ప్రభుత్వ జూనియర్ కళాశాల వరకు నిర్వహించిన 2 కే రన్ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. సమరయోధుల స్ఫూర్తితో యువత దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు. డీఎస్పీ వెంకటేశ్వర్రావు, మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్, ప్రజాప్రతినిథులు, నాయకులు, అధికారులు, యువత పాల్గొన్నారు.
నార్కట్పల్లిలో ప్రారంభించిన ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
కట్టంగూర్ : నార్కట్పల్లి మండల కేంద్రంలో నిర్వహించిన 2కే రన్ను ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య జెండాఊపి ప్రారంభించారు. పట్టణం నుంచి కామినేని జంక్షన్ వరకు ర్యాలీగా వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్ర వజ్రోత్సవ స్ఫూర్తితో యువత దేశ రక్షణకు పునరంకితమవ్వాలని కోరారు.