యాదాద్రి భువనగిరి, జూలై28 (నమస్తే తెలంగాణ) : ఉమ్మడి రాష్ట్రంలో చిన్నపాటి ఉద్యోగం దొరకాలన్నా ఎక్కడెక్కడో తిరగాల్సిన పరిస్థితి ఉండేది. ఆఖరికి ఏం లేని పరిస్థితుల్లో చదువుకున్న నిరుద్యోగులు హైదరాబాద్లో ఆటోలు నడుపుకొని కాలం వెల్లదీసేవారు. షాపింగ్ మాల్స్లో అరకొర జీతాలతో పనిచేసేశారు. పని దొరకడమే గగనంగా కూలీ పనికి కూడా వెళ్లేవారు. కానీ తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాలతోపాటు ప్రైవేట్ జాబ్స్కు కూడా కొదువలేదు. పరిశ్రమల ఏర్పాటుతో జిల్లా ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి దాకా 25,197మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కాయి. వీరే కాకుండా పరోక్షంగా మరో రెండు లక్షల మందికి ఉపాధి దొరికింది.
రాష్ట్రంలోనే ఉపాధి కల్పనలతో జిల్లా ఐదో స్థానంలో నిలువడం విశేషం. ఇక ప్రస్తుతం పరిశ్రమల్లో స్థానికులు ఉండటంతోపాటు ఉన్నత స్థాయి పోస్టుల్లోనూ అధికశాతం మన వాళ్లే కనిపిస్తుండడం విశేషం. వీళ్లకు ఆయా సంస్థలు మంచి ప్యాకేజీ ఇస్తున్నాయి. రూ.50వేల నుంచి లక్ష వరకు జీతాలు తీసుకొనే ఉద్యోగులు అనేక మంది ఉన్నారు. అంతేకాకుండా సొంత ఇలాఖాలోనే, ఇంటి పట్టున ఉపాధి దొరుకుతుండటంతో అంతా ఇక్కడే ఉండి ఆనందంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు.
693 పరిశ్రమలు.. 5,638 కోట్ల పెట్టుబడులు..
టీఎస్ ఐపాస్ (తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ అప్రూవల్ సెల్ఫ్ సర్టిఫికెట్ సిస్టం)ను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడులు ఆకర్షించే ఉద్దేశంతో ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా యాదాద్రి జిల్లాకు పరిశ్రమలు వరదలా వచ్చాయి. సర్కారు నిర్ణయానికి తోడు ఇక్కడి అనుకూల పరిస్థితులతో పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ వచ్చాయి. జిల్లా ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు 693 పరిశ్రమలు మంజూరయ్యాయి. వీటిలో 367 పరిశ్రమలు ఉత్పత్తిని ప్రారంభిం చాయి. ఇందులో భాగంగా రూ.5,638 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. హైదరాబాద్ సమీపంలోనే జిల్లా ఉండటంతో వివిధ రంగాల పరిశ్రమలు ఆకర్షిస్తున్నాయి. పోచంపల్లి, బీబీనగర్, చౌటుప్పల్, వలిగొండ, రామన్నపేట తదితర మండలాల్లో విరివిగా పరిశ్రమలు వెలిశాయి. ముఖ్యంగా ఇంజినీరింగ్, ఫుడ్ ప్రాసెసింగ్, కోల్డ్ స్టోరేజ్, సిమెంట్, కాంక్రీట్, క్రషింగ్, ఇండస్ట్రియల్ పార్కులు, ఔషధాలు, కెమికల్స్, వస్త్ర తదితర పరిశ్రమలు ఏర్పాటయ్యాయి.
సర్కారు ప్రోత్సాహకాలు.. సులభతర అనుమతులతోనే..
టీఎస్ ఐపాస్తో సులభంగా పరిశ్రమలకు అనుమతులు పొందవచ్చు. దీని ద్వారానే జిల్లాలో భారీ సంఖ్యలో పరిశ్రమలు వచ్చాయి. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన పరిశ్రమలకు వందశాతం కరెప్షన్ ఫ్రీతో అనుమతులు మంజూరు చేస్తారు. ఆన్లైన్లో టీఎస్ ఐపాస్ పోర్టల్లో దరఖాస్తులను స్వీకరిస్తారు. సీఎం ఆఫీసులో ఏర్పాటు చేసిన చేజింగ్ సెల్ ద్వారా పరిశ్రమల అనుమతులపై మానిటరింగ్ ఉంటుంది. ఆలస్యం లేకుండా 15రోజుల్లో ఇండస్ట్రీస్ ఏర్పాటు కోసం అనుమతులు ఇస్తున్నారు.
ఒకవేళ ఏదైనా దరఖాస్తును క్లియర్ చేయడంలో ఫెయిలైతే ఆలస్యానికి సంబంధిత కార్యాలయం బాధ్యత వహించాల్సి ఉంటుంది. 30 రోజుల తర్వాత దరఖాస్తు ఆమోదించినట్లు పరిగణిస్తారు. అంతేకాకుండా పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. ఇండస్ట్రీస్కు సర్కారు ప్రోత్సాహకాలు కూడా అందిస్తున్నది. అవసరం ఉన్న చోట పరిశ్రమల ఏర్పాటుకు ల్యాండ్ ఇస్తున్నది. 24గంటలు విద్యుత్ సరఫరా చేస్తున్నది. వీటిలో కొన్నింటికి రాయితీలతోపాటు వాటర్ గ్రిడ్ పైప్లైన్ ద్వారా ప్రాజెక్టుల నుంచి నీటిని అందిస్తున్నది. అవసరం ఉన్న చోట రోడ్లు వేస్తున్నది.