బీబీనగర్ (భూదాన్పోచంపల్లి), జూలై 2 : స్వరాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, వసతి గృహాలు అధునాతన హంగులతో రూపుదిద్దుకుంటున్నాయి. సకల వసతులు సమకూర్చుకుంటున్నాయి. ఇందులో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్పోచంపల్లి మండల కేంద్రంలోని ఎస్సీ వసతి గృహం రంగురంగుల చిత్రాలతో ఆకట్టుకుంటున్నది. హాస్టల్ గోడలపై అద్భుతంగా తీర్చిదిద్దిన బొమ్మలు విద్యార్థులకు విజ్ఞానం పంచుతున్నాయి. చూపరులను అబ్బురపరుస్తున్నాయి.
రూ.10 లక్షలతో ..
భూదాన్పోచంపల్లిలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఎస్సీ వసతి గృహాన్ని నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాల, మోడల్ స్కూల్లో చదువుతున్న ఎస్సీ విద్యార్థులు ఈ హాస్టల్లో వసతి పొందుతున్నారు. ప్రస్తుతం 3నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న 65 మంది బాలికలు ఉన్నారు. వసతి గృహాన్ని అద్భుతంగా తీర్చిదిద్ది మౌలిక వసతులు కల్పిస్తుండడంతో ఈ ఏడాది విద్యార్థుల నమోదు మరింత పెరగనుంది. కాగా, ఎస్సీ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో 10లక్షల రూపాయలతో అధునాతన హంగులతో హాస్టల్ను తీర్చిదిద్దారు. గోడలపై విద్యకు సంబంధించిన బొమ్మలను రంగురంగులతో రమణీయంగా వేశారు. బయట, లోపల, మెట్లు ఎక్కడా వదలకుండా హాస్టల్ మొత్తం విజ్ఞాన చిత్రాలు దర్శనమిస్తున్నాయి.
విద్యార్థులకు మంచి మెనూ, వసతులు..
ఎస్సీ వసతి గృహంలో విద్యార్థులకు మంచి మెనూ అందిస్తున్నారు. ఉదయం రాగి జావ, అరటి పండు, మధ్యాహ్నం భోజనం, అరటి పండు, సాయంత్రం స్నాక్స్ ఇస్తున్నారు. వారంలో మూడ్రోజులు గుడ్డు, ప్రతి అదివారం చికెన్ అందిస్తున్నారు. వసతి గృహంలో భోజనం చేయడానికి ప్రత్యేక హాల్, బెంచీలు, పడుకోవడానికి అధునాతన బెడ్స్, చదువుకోవడానికి కంప్యూటర్స్ అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులకు మంచి సౌకర్యాలు కల్పించడంతోపాటు చదువుకోవడానికి అనుకూలమైన వాతావరణాన్ని కల్పించేందుకు కలెక్టర్ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్ దీపక్ తివారీ పలుమార్లు సందర్శించి సూచనలు చేశారు.
హాస్టల్ను అధునాతనంగా తీర్చిదిద్దాం
ఎస్సీ బాలికల వసతి గృహాన్ని ప్రైవేటుకు దీటుగా అధునాతనంగా తీర్చిదిద్దాం. కృసియల్ వెల్పేర్ ఫండ్ రూ.10లక్షలతో ఎస్సీ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో హాస్టల్ గోడలపై విద్యకు సంబంధించిన చిత్రాలను వేశారు. వసతి గృహంలో విద్యార్థులు భోజనం చేయడానికి బెంచీలు, పడుకోవడానికి బెడ్లు, చదువుకోవడానికి కంప్యూటర్స్ అందుబాటులో ఉన్నాయి.
– ఆర్.శైలజ, ఏఎస్ఈబ్ల్యూఓ