నల్లగొండ, జూన్ 28 : రాష్ట్ర ప్రభుత్వం వానకాలం సీజన్ కోసం రైతులకు పెట్టుబడి సాయం కింద అందిస్తున్న రైతుబంధు మంగళవారం నుంచి వారి ఖాతాల్లో జమ అవుతున్నది. జిల్లా వ్యాప్తంగా 5,08,298 మంది రైతులు ఉండగా ఈ సీజన్లో వారికి ప్రభుత్వం ఎకరాకు రూ.5వేల చొప్పున రూ.617,70,79,567 అందించనున్నది. ఈ సాయం పది రోజుల పాటు రైతుల ఖాతాల్లో జమ చేసేవిధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. తొలిరోజు రూ.41.36 కోట్లను జమచేసింది. జిల్లా వ్యవసాయ యంత్రాంగం రెండు ఎకరాల లోపు భూమి ఉన్న 2,54,524 మంది రైతులకు సంబంధించిన వివరాలను ట్రెజరీకి పంపించింది. వారికి రూ.133,82,39,503 జమ చేయాల్సి ఉంది. తొలిరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎకరం లోపు భూమి ఉన్న 1,33,183 మంది రైతుల ఖాతాలో రూ.41,36,41,063 జమచేసింది. బుధవారం రెండు ఎకరాల్లోపు ఉన్న రైతులకు రైతుబంధు అందనున్నది. ఇలా క్రమంగా పది రోజుల పాటు అందరికీ డబ్బులు జమ చేసేలా చర్యలు తీసుకుంటున్నది.
అంతటా సంబురాలు
వానకాలం సీజన్ ఆరంభానికి ముందే రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పెట్టుబడి రాయితీ రూపంలో రైతుబంధును అందించడంతో రైతాంగం సంబురాలు చేసుకుంటున్నది. నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని హాలియా, పెద్దవూర, గుర్రంపోడు, త్రిపురారం, తిరుమలగిరి(సాగర్)అన్ని మండలాల్లో రైతులు సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం నిర్వహించారు. రైతుబంధు సాయం ఖాతాల్లో జమ అయినట్లు ఫోన్కు సమాచారం రాగానే రైతులు బ్యాంకులు, ఏటీఎం సెంటర్ల వద్దకు వెళ్లి డబ్బులు తీసుకున్నారు. ప్రభుత్వం అందించిన డబ్బులతో విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేశారు.
పెట్టుబడికి ఇబ్బందుల్లేవు
రాష్ట్ర ప్రభుత్వం అందించిన రైతుబంధుతో పంట పెట్టుబడికి ఇబ్బందులు లేకుండా పోయాయి. రైతులు కష్టాల్లో ఉన్నప్పుడు సాగు పెట్టుబడి కోసం సాయం చేస్తున్న ప్రభుత్వాన్ని ఇప్పుడే చూస్తున్నాం. ప్రభుత్వం సాయంతో మాలాంటి పేద రైతులకు అప్పుల బాధ తప్పింది. నా కున్న ఎకరం భూమికి రూ.5వేలు బ్యాంకు ఖాతాలో పడ్డాయి. ప్రభుత్వం చేస్తున్న సాయాన్ని మేము ఎప్పటికీ మరువలేం. సీఎం కేసీఆర్కు ఎల్లప్పుడూ అండగా ఉంటాం.
– మద్దెల శంకర్, కట్టంగూర్
అప్పుల బాధ తీరింది
నాకు పోతిరెడ్డిపల్లి పరిధిలో అరెకరం భూమి ఉంది. మంగళవారం ఉదయమే నా ఖాతాలో రైతుబంధు డబ్బులు పడినట్లు మెసేజ్ వచ్చింది. మాలాంటి సన్నకారు రైతులు విత్తనాలు, ఎరువులు కొనే సమయానికి రైతు బంధు పైసలు పడ్డాయి. దాంతో పెట్టుబడికోసం షావుకార్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా పోయింది. మాకు సాయం చేస్తున్న సీఎం కేసీఆర్సార్కు రుణపడి ఉంటాం.
-చిత్రియాల రాములు, పోతిరెడ్డిపల్లి , పీఏపల్లి