నల్లగొండ, జూలై 30 : ఆరో విడుత చేప పిల్లల పంపిణీకి ప్రభుత్వం నిధులను విడుదల చేసింది. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 2015లో చేప పిల్లల పంపిణీని ప్రారంభించిన సర్కార్ ఇప్పటి వరకు కొనసాగిస్తున్నది. ఈ ఏడాది సైతం ఈ ప్రక్రియ కొనసాగించాలని ప్రభుత్వం మత్స్య శాఖ యంత్రాంగానికి సూచించడంతో ఆ శాఖ అధికారులు టెండర్లు పిలిచారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రూ.15.75 కోట్లతో 13.47 కోట్ల చేప పిల్లలు సెప్టెంబర్ నుంచి పోయనున్నారు. మొత్తంగా పెద్ద , చిన్న చెరువుల్లో మొత్తం 2,540 పిల్లలను వదలనున్నారు. పెద్ద చెరువుల్లో 80 నుంచి 100 ఎంఎం సైజ్, చిన్న చెరువుల్లో 30 నుంచి 40 ఎం ఎం సైజ్ కలిగిన పిల్లలను వదలనున్నారు. ఇందుకు ప్రభు త్వం పెద్దపిల్లలకు రూ.1.55, చిన్న పిల్లలకు 60 పైసలు వెచ్చిస్తున్నది.
44వేల మంది సభ్యులకు ప్రయోజనం..
ప్రభుత్వం వదులుతున్న చేప పిల్లలతో ఆయా చెరువుల పరిధిలో 44వేల మంది మత్స్య కారులకు ప్రయోజనం కలుగనుంది. ప్రధానంగా మత్స్యకారుల జీవన విధానం మెరుగు పరచాలనే ఉద్దేశంతో 100 శాతం గ్రాంటు ఇస్తుండడంతో అంత మేరకు ఫలితం లభిస్తున్నది. ఉమ్మడి జిల్లాలో 457 మత్స్య సహకార సొసైటీలు ఉండగా అందులో 44వేల మంది సభ్యులు ఉన్నారు. వారు ఆయా చెరువుల్లో చేపలు పట్టి విక్రయించి తమ ఆర్థ్దిక వనరులు పెంచుకుంటున్నారు. ప్రతి ఏటా ఒక్కో మత్స్యకారుడు చేపల వేటతోనే రూ.60 నుంచి 75వేల వరకు ఆదాయం పొందుతున్నాడు. అంతేకాక రిజర్వాయర్ల పరిధిలో చేపల వేట నిషేధ సమయంలో అంటే ఆగస్ట్టు నుంచి అక్టోబర్ వరకు మూడు నెలల పాటు ప్రతి సభ్యుడికి నెలకు రూ.900 చొప్పున మొత్తంగా రూ.2, 700 జీవన భృతి కింద సర్కార్ అందజేస్తున్నది.
ఏటా రూ. 675 కోట్ల చేపల ఉత్పత్తి
ప్రభుత్వం ప్రతి ఏటా సుమారు రూ.10 నుంచి 16 కోట్లు వెచ్చించి చెరువుల్లో చేపలు పోస్తుండగా అదే చేపలను మత్స్య కారుల పట్టి మరింత ఆదాయం సమపార్జిస్తున్నారు. ప్రధానంగా బొచ్చ, రవ్వ, కొర్ర మేను, బంగారు తీగ, మోసు, బురక రకాల చేపలు మన చెరువుల్లో లభ్యమవుతున్నాయి. అంతేకాక ప్రధానం జలాశయాల్లో రొయ్యలు సైతం ప్రభుత్వం పోస్తుండటంతో వీటి ద్వారా సైతం మత్స్యకారులు మరింత ఆదాయం పొందుతున్నారు. మొత్తం ఆయా చెరువుల్లో ప్రతి ఏటా 46,825 టన్నుల చేపలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చేతికి వస్తున్నాయి. వీటిని మత్స్యకారులు కిలో రూ.80 నుంచి 120 వరకు విక్రయిస్తుండడంతో సుమారు రూ.675 కోట్ల ఆదాయం వస్తుంది. మన చేపకు మంచి డిమాండ్ ఉండడంతో ఇవి మన రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, మహారాష్ట్ర , పశ్చిమ బెంగాల్, కేరళ రాష్ర్టాలకు మన చేపలు ఎగుమతి అవుతున్నాయి.
టెండర్లు పూర్తి
జిల్లా వ్యాప్తంగా ఈ సారి సైతం ప్రభుత్వం ఉచితంగా అన్ని చెరువుల్లో చేప పిల్లలు ఉచితంగా పోయడానికి నిధులు ఇవ్వడంతో టెండర్లు పిలి చాం. ఈ నెల 29 వరకు టెండర్లు తీసుకున్నాం. గతంలో లాగనే రెండు రకాల సైజు ఉన్న చేప పిల్లలు మొత్తంగా 1,280 చెరువుల్లో పోసే విధంగా ప్రణాళికలు రూపొందించాం. ఈ సారి నల్లగొండలో ఏడు కోట్ల రూపాయలతో 6.17 కోట్ల చేప పిల్లలు పోయాలని నిర్ణయించి టెండర్లు పిలిచాం. ఇలా ఉచితంగా చేప పిల్లలు పోయడంతో మత్స్యకారులకు మంచి ఆదా యం వస్తుంది.
– చరితారెడ్డి,జిల్లా మత్స్యశాఖ అధికారి, నల్లగొండ