నల్లగొండ, జూలై 3: నల్లగొండ జిల్లాపై చకిలం శ్రీనివాస రావు చెరగని ముద్ర వేసుకున్నాడని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. శనివారం నల్లగొండ జిల్లా కేంద్రంలో మాజీ ఎంపీ చకిలం శ్రీనివాసరావు 25వ వర్ధంతి సందర్బంగా నిర్వహించిన సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఆపదలో ఉన్న వారికి అప్పట్లో శ్రీనివాసరావు ఇల్లే శాశ్వత చిరునామాగా మారిందని అన్నారు. అటువంటి ముద్ర వేసుకోవటం అరుదైన అంశమని అలాంటి అదృష్టం ఆయనకే దక్కిందని పేర్కొన్నారు.
చకిలం నాయకత్వంతో పోటీ పడాలని చాలా మంది నేతలు చూశారని అటువంటి నాయకుల సొంత గ్రామాల్లోనూ కాంగ్రెస్ నేతలకు ఎలాంటి కష్టం వచ్చినప్పటికీ మొదటగా గుర్తుకు వచ్చేది మాత్రం శ్రీనివాస రావే అన్నారు. నమ్ముకున్న క్యాడర్ కోసం ఎంత దూరమైనా వెల్లే వ్యక్తి తనే అని..దాంతో స్వపక్షంతో పాటు విపక్షం నుంచి సైతం ఎంతో ప్రచారం లభించిందని అన్నారు. అవకాశం వచ్చిన ప్రతి సారి తన కార్యకర్తలకు ఎన్నో పదవులు కల్పించటంతో ప్రతిపక్ష నేతలే ఎంతో విస్తుపోయారని అన్నారు. అనంతరం శాసన మండలి సభ్యురాలు సురభి వాణీదేవి మాట్లాడుతూ చకిలం శ్రీనివాసరావు ఎంతో దూరదృష్టి కలవాడని ప్రతి కార్యకర్తను కాపాడుకునే ప్రయత్నం ఆయన ఎల్లప్పుడూ చేసే వాడని అన్నారు. అలాంటి వ్యక్తిత్వం ఉన్నందునే ఆయనకు సర్దార్ అనే బిరుదు వచ్చిందని అన్నారు.
మాజీ ప్రధాని పీవీకి చకిలం అత్యంత సన్నిహితుడని, ఆయన సహకారంతో ఎంతో ఖ్యాతి గడించినట్లు తెలిపారు. రెండున్నర సంవత్సరాలు గడించినప్పటికీ ఇప్పటికీ ఆయనకు అభిమానులు ఉన్నారంటే కారణం ఆయన చేసిన సేవలే అన్నారు. మనిషి పుట్టుకకు చావుకు మద్య ఏం చేస్తాడనేది ఆయన చేతుల్లోనే ఉంటదని, అలా చేసిన దానిని బట్టే వారి పేరు ప్రఖ్యాతులు ఉంటాయని అన్నారు. చకిలం శ్రీనివాస రావు కుమారులు ఇప్పటికి తన తండ్రి పేరును చిరస్మరణీయంగా ఉంచాలనే ఉద్దేశంతో చేస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు.
అనంతరం డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి మాట్లాడుతూ శ్రీనివాస రావు నాలాంటి ఎంతో మందికి రాజకీయ భిక్ష పెట్టిన గొప్ప నేతగా అభివర్ణించాడు. కార్యకర్తల కోసం ఒక్కడే ఎంత దూరమైనా వచ్చి వారి సమస్య పరిష్కారం అయ్యాకనే అక్కడి నుంచి కదిలే వాడని అన్నారు. ప్రధానంగా బడుగు బలహీన వర్గాలను దృష్టిలో పెట్టుకోని అనేక సేవలు చేసే వాడని అన్నారు. చకిలం అనిల్ కుమార్ అధ్యక్షతన వహించిన ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యడు బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ తేరా చిన్నప రెడ్డి, శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి, రవింద్రకుమార్, గాదరి కిశోర్, భాస్కర్రావు, నల్లగొండ, మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్లు మందడి సైదిరెడ్డి, భార్గవ్, వైస్ చైర్మన్ అబ్బగోని రమేశ్, చకిలం సునిల్ కుమార్, తిప్పన విజయ సింహారెడ్డి, కోటి రెడ్డి, బీరవోలు సోమిరెడ్డి, బొర్ర సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.