నల్లగొండ, మే 21 : ఈ నెల 23 నుంచి జరిగే పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ నుంచి ఆయా శాఖల అధికారులతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 19,910 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నారని, 107 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి పరీక్షా కేంద్రాన్ని తాసీల్దార్లు, ఎంఈఓలు, ఆర్డీఓలు, డీఎస్పీలు పర్యవేక్షించాలని సూచించారు. 1,110 మంది ఇన్విజిలేటర్లు, ఆరుగురు ఫ్లయింగ్ స్కాడ్లను నియమించినట్లు తెలిపారు. విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రానికి చేరుకునే విధంగా ఆయా రూట్లలో ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయాలన్నారు. ప్రతీ పరీక్షా కేంద్రంలో మౌలిక వసతులు ఏర్పాటు చేయాలన్నారు. కాన్ఫరెన్స్లో డీఈఓ భిక్షపతి, ఆర్డీఓలు, డీఎస్పీలు, తాసీల్దార్లు, ఎంఈఓలు పాల్గొన్నారు.
పరీక్ష కేంద్రాల పరిశీలన.. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన పలు పరీక్షా కేంద్రాలను శనివారం అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, డీఈఓ భిక్షపతి పరిశీలించారు. ఆయా కేంద్రాల్లో మౌలిక వసతులపై ఆరా తీశారు.