అర్వపల్లి, ఫిబ్రవరి 26 : మండల కేంద్రంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి ఉమెన్స్ కబడ్డీ పోటీల్లో నల్లగొండ జిల్లా జట్టు చాంపియన్గా నిలిచింది. శ్రీయోగానంద లక్ష్మీనృసింహస్వామి బ్రహ్మోత్సవాలు పురస్కరించుకుని ఎమ్మెల్యే గాదరి కిశోర్ తండ్రి మారయ్య స్మారకార్థం నిర్వహిస్తున్న పోటీల్లో భద్రాద్రి కొత్తగూడెం జట్టుపై ఘన విజయం సాధించి టైటిల్ను కైవసం చేసుకుంది. రెండో బహుమతిని భద్రాద్రి కొత్తగూడెం, మూడో బహుమతిని ఆదిలాబాద్, నాలుగో బహుమతిని సూర్యాపేట జిల్లా జట్లు గెలుచుకున్నాయి. శనివారం రాత్రి జరిగిన ముగింపు కార్యక్రమానికి ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో గ్రామీణ క్రీడలు, కళలను ప్రోత్సహిస్తున్నదని అన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని సూచించారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు రజాక్, ఎంపీపీ మన్నె రేణుక, జడ్పీటీసీ దావుల వీరప్రసాద్ యాదవ్, కబడ్డీ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మారిపెద్ది శ్రీనివాస్గౌడ్, జిల్లా అధ్యక్షుడు రామచంద్రగౌడ్, కార్యదర్శి నర్సింహారావు, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు పి.ఎర్ర నర్సయ్య, ఆలయ కమిటీ చైర్మన్ చిల్లంచర్ల విద్యాసాగర్, సర్పంచ్ బైరబోయిన సునీతారామలింగయ్య, ఎంపీటీసీ పద్మా శ్రీనివాస్ పాల్గొన్నారు.