నల్లగొండ, జనవరి 20 : వరంగల్ – ఖమ్మం – నల్లగొండ పట్టభద్రుల శాసన మండలి నియోజకవర్గం ఉప ఎన్నిక నేపథ్యంలో అర్హులైన పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకోవాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో శనివారం విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. పట్టభద్రుల శాసన మండలి ఓటరు జాబితాను కొత్తగా రూపొందించనున్నారని, గత ఎన్నికల్లో ఓటరుగా నమోదైన వారు కూడా మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని అన్నారు.
2020 నవంబర్ 1 నాటికి డిగ్రీ ఉత్తీర్ణత చెందినవారు అర్హులని తెలిపారు. డిగ్రీ పూర్తి చేసిన వారు స్థానికులై ఉంటే దరఖాస్తులను ఆర్డీఓ లేదా తాసీల్దార్ కార్యాలయాల్లో స్వయఒంగా లేదా ceotelangana.nic.inలో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తులను ఫిబ్రవరి 6వరకు స్వీకరించి ఫిబ్రవరి 24న ముసాయిదా ఓటరు జాబితా ప్రచురించనున్నట్లు తెలిపారు.
ముసాయిదా జాబితాపై అభ్యంతరాలుంటే ఫిబ్రవరి 24 నుంచి మార్చి 14వరకు స్వీకరించి మార్చి 29 వరకు పరిశీలిస్తారని, ఏప్రిల్ 4న తుది ఓటరు జాబితా ప్రచురిస్తారని అన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటి వరకు అన్ని జిల్లాలు కలిపి 77,579 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. అదేవిధంగా ప్రత్యేక ఓటరు జాబితా సవరణ 2024లో భాగంగా పార్లమెంట్కు జరుగనున్న సాధారణ ఎన్నికల్లో ఓటరుగా నమోదు చేసుకునేందుకు 18 సంవత్సరాలు నిండిన వారు జనవరి 22 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
జిల్లా వ్యాప్తంగా శని, ఆదివారం అన్ని పోలింగ్ కేంద్రాల్లో స్పెషల్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నందున బీఎల్ఓలు అందుబాటులో ఉంటారని అన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె ప్రజలకు సూచించారు. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ఫిబ్రవరి 8న తుది జాబితా విడుదల చేస్తామని తెలిపారు. విలేకరుల సమావేశంలో అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, కలెక్టరేట్ ఏఓ మోతీలాల్, సూపరింటెండెంట్ కృష్ణమూర్తి, ఎలక్షన్స్ డీటీ విజయ్ పాల్గొన్నారు.