భారతీయుల ఏకత్వానికి, శౌర్యానికి, స్వాభిమానానికి, సార్వభౌమత్వానికి, సమున్నతకి ప్రతీకగా నిలిచిన త్రివర్ణ పతాకం రూపుదిద్దుకున్నది సూర్యాపేట జిల్లా నడిగూడెం మండల కేంద్రంలోని రాజావారి కోటలోనే. అంతటి శక్తి కలిగిన పతాకాన్ని రూపొందించిన స్వాతంత్ర సమరయోధుడు, చరితార్థుడు పింగళి వెంకయ్య. స్వాతంత్య్రం కోసం బ్రిటీష్ వారిని తరిమికొట్టేందుకు దేశాన్నంతటిని ఒకే తాటిపైకి తీసుకువచ్చేందుకు ఒక జెండా ఉండాలని మహాత్మాగాంధీ తలంచారు. ఎందరో మేధావులు రకరకాల జెండాలను అప్పుడు జరుగుతున్న సమావేశాలు, సభల్లో మహాత్ముడికి చూపించారు. అయితే పింగళి వెంకయ్య రూపొదించిన జెండా గాంధీజీని ఆకర్షించింది.
నడిగూడెంలో కోట నిర్మించుకుని జమీందార్ రాజా నాయిని వెంకటరంగారావు పరిపాలిస్తుండేవారు. 1876 ఆగస్టు 2న కృష్ణా జిల్లా మచిలీపట్నం పరిధిలోని మొవ్వ మండలం భట్ల పెనుముర్రులో హనుమంత నాయుడు, వెంకటరత్నం దంపతులకు పింగళి వెంకయ్య జన్మించారు. బందరులో చదుకునే సమయంలో గాంధీజీతో సన్నిహితంగా ఉండేవారు. స్వాతంత్య్ర ఉద్యమ సమయంలో మహాత్ముడితో సన్నిహితంగా ఉండే పింగళికి నడిగూడెం జమీందార్ వెంకటరంగారావుతో పరిచయం ఏర్పడింది.
ఆ పరిచయంతో పింగళి నడిగూడెంలో ఉంటూ నూతన పత్తి వంగడాలను పండించేందుకు రైతుల్లో చైతన్యం నింపి, ఆధునిక వ్యవసాయానికి నాంది పలికారు. ఆ రోజుల్లో వెంకయ్య పత్తి వెంకయ్యగా ఈ ప్రాంత ప్రజలకు సుపరిచితుడయ్యారు. 1906 నుంచి 1921 వరకు రాజా వారి ఆస్థానంలో వ్యవసాయ శాస్త్రవేత్తగా పనిచేశారు. స్వాతంత్య్రం కోసం ఉధృతంగా పోరాటం జరుగుతున్న కాలంలో పోరాటానికి ఒక జెండా అవసరమని పలు సభలు, సమావేశాల్లో గాంధీజీ, నాటి ఉద్యమ నాయకులు అభిప్రాయపడ్డారు.
ఆ సమయంలో నడిగూడెం వెంకటరంగారావు ఆస్థానంలో పనిచేస్తున్న వెంకయ్య మూడు రంగుల జెండాకు రూపకల్పన చేశారు. జాతీయ జెండాలో కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులతో కూడిన జెండాను తయారు చేసి మధ్యలో నూలు ఒడికే రాట్నం అమర్చారు. 1921 మార్చి 31న విజయవాడలో జరిగిన కాంగ్రెస్ మహాసభల్లో పింగళి రూపొదించిన జెండాను గాంధీజీకి అందించారు.
అప్పటికే పలు రాష్ర్టాల నుంచి సుమారు 14కు పైగా జెండా నమూనాలు గాంధీజీకి అందించగా వాటిల్లో పింగళి రూపొదించిన జెండాను ఆమోదించారు. స్వాతంత్య్ర ఉద్యమానికి ఊపిరిపోసిన మువ్వన్నెల జెండాలో 1947లో స్వాతంత్య్రం అనంతరం నెహ్రూ సమక్షంలో జరిగిన రాజ్యాంగ సభలో మూడు రంగుల జెండాలోని నూలు ఒలికే రాట్నాన్ని తీసేసి దాని స్థానంలో అశోకుడి ధర్మచక్రాన్ని చేర్చి అధికారికంగా జాతీయ జెండాగా ఆమోదించారు.
జాతీయ జెండా రూపుదిద్దుకున్న కోటలో పింగళి వెంకయ్య మ్యూజియాన్ని ఏర్పాటు చేయాలి. ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసి, స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను, పింగళి వెంకయ్య జయంతి, వర్థంతిలను అధికారంగా నిర్వహించాలి.
– చిల్లంచర్ల సత్యనారాయణ, మాజీ సర్పంచ్, నడిగూడెం