నల్లగొండ, ఆగస్టు 13 : నల్లగొండలో పలు అభివృద్ధి పనులకు ఆదివారం ప్రారంభోత్సవాలు జరుగనున్నాయి. పట్టణాభివృద్ధిలో భాగంగా ఆధునీకరించిన మర్రిగూడ బైపాస్తోపాటు క్లాక్ టవర్ సెంటర్ను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డితో కలిసి ప్రారంభించనున్నారు. 2018 ఎన్నికల్లో సీఎం కేసీఆర్ హామీల్లో భాగంగా నల్లగొండను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు ఇప్పటికే పట్టణానికి రూ.450 కోట్లు కేటాయించగా, తాజాగా మరో రూ.223 కోట్లు కేటాయించారు.
అయితే ఈ నిధులతో అద్దంకి-నార్కట్పల్లి రహదారి మర్రిగూడ బైపాస్ నుంచి క్లాక్టవర్ సెంటర్, అక్కడి నుంచి పెద్దబండ, డీఈఓ ఆఫీస్ నుంచి కలెక్టరేట్ వరకు రోడ్ల విస్తరణ జరుగుతున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా పట్టణంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగానే నిర్మితమైన మర్రిగూడ బైపాస్ జంక్షన్ను ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డితో కలిసి ఉదయం 10 గంటలకు ప్రారంభించనున్నారు.
అనంతరం నాగార్జున కళాశాల నుంచి బస్టాండ్ సుభాశ్ విగ్రహం వరకు 750 మీటర్ల భారీ జాతీయ పతాకంతో ప్రదర్శన చేపట్టనున్నారు. 10.30 గంటలకు గడియారం సెంటర్ జంక్షన్ను ప్రారంభించి అందులో అత్యంత ఎత్తులో ఏర్పాటు చేసిన భారీ జాతీయ పతాకాన్ని మంత్రి ఆవిష్కరించనున్నారు. ఆ తర్వాత కేశరాజుపల్లి, మర్రిగూడలో ఏర్పాటు చేసిన నూతన బస్తీ దవఖానలను మంత్రి, ఎమ్మెల్యే ప్రారంభిస్తారు. ఇప్పటికే జిల్లా కేంద్ర ఆస్పత్రితోపాటు పానగల్, లైన్వాడ, మాన్యంచెల్క అర్బన్ ఆస్పత్రులు ఉండగా, పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకొని ఏర్పాటు చేసిన మరో రెండు అర్బన్ ఆస్పత్రులను మంత్రి ప్రారంభించనున్నారు.
నల్లగొండ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.233.82 కోట్లు విడుదల చేసినట్లు ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి తెలిపారు. శనివారం నల్లగొండలో నిర్వహించిన ఫ్రీడం రన్లో పాల్గొన్న అనంతరం ఆయన మాట్లాడారు. జిల్లా కేంద్రంలో రహదారుల విస్తరణతోపాటు మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం వందల కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల హామీలను అమలు చేయడంలో దేశంలోనే రాష్ట్రం ముందున్నట్లు పేర్కొన్నారు. కళాభారతి నిర్మాణం కోసం కనీవినీ ఎరుగని రీతిలో రూ.90.61కోట్లు కేటాయించినట్లు తెలిపారు.
ఐటీ పార్కు నుంచి ఉదయసముద్రానికి అప్రోచ్ రోడ్డుతోపాటు నల్లగొండలో శాశ్వత హెలీప్యాడ్ నిర్మాణానికి నిధులు కేటాయించినట్లు చెప్పారు. ఎన్నికల ప్రచారంలో చెప్పని మెడికల్ కళాశాల, ఐటీ హబ్ను జిల్లా కేంద్రంలో నెలకొల్పి విమర్శకుల నోరు మూయించిన గొప్ప సీఎం కేసీఆర్ అని అన్నారు. పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి, ఆ హామీకి మించి నిధులు కేటాయించి అభివృద్ధి చేయిస్తున్నట్లు తెలిపారు.
నల్లగొండలో 20 ఏండ్ల నాటి శని పోయిన కారణంగానే నేడు నల్లగొండ ఎంతో అభివృద్ధి జరుగుతున్నట్లు చెప్పారు. మంత్రి జగదీశ్ రెడ్డి సహకారంతో నల్లగొండ అభివృద్ధి చెందుతుందని, ఇటీవల పంపిన ప్రతిపాదనలతోనే ఈ నిధుల కేటాయింపు జరిగిందని అన్నారు. చర్లపల్లి నుంచి కేశరాజుపల్లి వరకు, పానగల్ నుంచి కతాలగూడ వరకు ఎటుచూసినా అభివృద్ధి కనిపిస్తున్నట్లు తెలిపారు. పానగల్లులోని చారిత్రక శివాలయాలు, వేంకటేశ్వరాలయాన్ని ఎంతో అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.