కృష్ణమ్మ ప్రవాహంతో నాగార్జునసాగర్ నిండుకుండలా మారింది. శ్రీశైలం క్రస్ట్ గేట్ల నుంచి 3,39,064 క్యూసెక్కుల వరద పోటెత్తుతుండడంతో ప్రాజెక్టు నీటి మట్టం బుధవారం సాయంత్రానికి 582.70 అడుగులకు చేరుకుంది. పూర్తిస్థాయి సామర్థ్యం 590 అడుగులు కాగా, మరో 7 అడుగులు మాత్రమే మిగిలి ఉంది. ఎగువ నుంచి వరద కొనసాగుతుండడంతో నాగార్జునసాగర్ క్రస్ట్ గ్రేట్ల నుంచి గురువారం ఉదయం 6.30 గంటలకు నీటిని విడుదల ఎన్నెస్పీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని ప్రాజెక్టు, రెవెన్యూ అధికారులు సూచించారు. సిబ్బందిని అప్రమత్తం చేశారు.
నందికొండ, ఆగస్టు 10 : కృష్ణమ్మ ఎగువ ప్రాంతాల నుంచి పరుగు పరుగున సాగర్ ప్రాజెక్టులోకి నీరు వచ్చి చేరుతుండడంతో రిజర్వాయర్ నీటిమట్టం వేగంగా పెరుగుతున్నది. శ్రీశైలం రిజర్వాయర్లో 884.20 అడుగుల వద్ద 210.9946 టీఎంసీల నీరు నిల్వ ఉంది. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి సాగర్ ప్రాజెక్టుకు బుధవారం 3,39,064 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగింది.
సాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 590 అడుగులు కాగా ప్రస్తుతం 582.70 అడుగుల వద్ద 290.8025 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జలాశయం నుంచి ప్రధాన జల విద్యుత్ కేంద్రం ద్వారా 32,805 క్యూసెక్కులు, ఎడమకాల్వకు 2,608 కుడికాల్వకు 2,915, ఎస్ఎల్బీసీకి 2400, వరద కాల్వకు 300 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్ రిజర్వాయర్ నుంచి మొత్తం 41,028 క్యూసెక్కుల ఔట్ఫ్లో కొనసాగుతున్నది.
శ్రీశైలం ఎగువనున్న ప్రాజెక్టులన్నీ పూర్తిస్థాయిలో నిండడంతో ఇన్ఫ్లో భారీగా వచ్చి చేరుతున్నది. దాంతో శ్రీశైలం జల విద్యుత్ కేంద్రాలతో పాటు, 10 క్రస్ట్ గేట్లను 10 అడుగుల మేరకు ఎత్తి 3,39,064 క్యూసెక్కులను సాగర్కు విడుదల చేస్తున్నారు. సాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండేందుకు చేరువైనందున డ్యాం భద్రత దృష్ట్యా వరద ఉధృతిని ఎదుర్కొనేందుకు నాగార్జునసాగర్ డ్యాం క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయాలని ఎన్ఎస్పీ అధికారులు నిర్ణయించారు.
గురువారం ఉదయం 6.30 గంటలకు క్రస్ట్గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేయడానికి సిద్ధమవుతున్నట్లు ఎన్నెస్పీ అధికారులు తెలిపారు. మంగళవారం సాగర్ రిజర్వాయర్ నీటిమట్టం 577.20 అడుగులు ఉండగా బుధవారం సాయంత్రానికి 582.70 అడుగులకు చేరుకుంది. క్రస్ట్గేట్లు ఎత్తుతున్నందున లోతట్టు ప్రాంత ప్రజలు, చేపల వేటకు వెళ్లేవారు, కృష్ణానది శివారు ఆలయాల పూజార్లు అప్రమత్తంగా ఉండాలని ఎన్నెస్పీ ఎస్ఈ ధర్మానాయక్ సూచించారు. ముంపునకు గురయ్యే ప్రాంతాల వారిని అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు.
కేతేపల్లి, ఆగస్టు 10 : మూసీ ప్రాజెక్టుకు బుధవారం 5450.11క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగింది. దీంతో ప్రాజెక్టు 2గేట్లతో 3282.22క్యూసెక్కులు, కుడి కాల్వకు 101.36క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 101.36క్యూసెక్కుల నీరు ఔట్ఫ్లోగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645(4.46 టీఎంసీలు)కాగా, ప్రస్తుతం 638.30(2.84 టీఎంసీలు)అడుగులుగా ఉన్నట్లు ఏఈ డి.ఉదయ్కుమార్ తెలిపారు.
ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 36అడుగులు(2.45టీఎంసీలు) కాగా ప్రస్తుతం పూర్తిస్థాయిలో నిండింది. ప్రాజెక్టుకు ఇన్ఫ్లో 3,755 క్యూసెక్కులు కాగా అవుట్ ఫ్లో 3,605క్యూసెక్కులు, ప్రధాన కాల్వ నుంచి 150క్యూసెక్కులు నీటి విడుదల జరుగుతున్నట్లు నీటిపారుదల శాఖ ఏఈ ఫయాజ్ తెలిపారు. డిండి వాగు పరిసర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాగులోకి ఎవరూ వెళ్లకూడదని సూచించారు.