మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి సోమవారం తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని అసెంబ్లీలో స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డికి స్వయంగా అందజేశారు. రాజీనామా లేఖను పరిశీలించినఅనంతరం ఆమోదిస్తున్నట్లు స్పీకర్ అధికారికంగా ప్రకటించారు. అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచార్యులు మునుగోడు అసెంబ్లీ స్థానం-93 ఖాళీ అయినట్లుగా నోటిఫై చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దాంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యం కానున్నది.
ఎన్నికల నిబంధనల ప్రకారం ఏదైనా అసెంబ్లీ స్థానం ఖాళీ అయిన ఆరు నెలల్లోపు తిరిగి ఎన్నిక నిర్వహించాల్సి ఉంది. ఆ ప్రకారం ఫిబ్రవరి 7లోపు ఉప ఎన్నికను పూర్తి చేయాల్సి ఉంటుంది. వచ్చే నవంబర్లో ఇతర రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలు జరుగునున్న నేపథ్యంలో వాటితో కలిపి మునుగోడుకు కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఉప ఎన్నికను నిర్వహించవచ్చని తెలుస్తున్నది.
నల్లగొండ ప్రతినిధి, ఆగస్టు 8(నమస్తే తెలంగాణ) : 2018 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి మునుగోడు ఎమ్మెల్యేగా కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి గెలుపొందారు. ఆ తర్వాత కొంత కాలానికే కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ బీజేపీకి అనుకూలంగా మాట్లాడుతూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల బీజేపీ నేత, కేంద్ర మంత్రి అమిత్షాతో భేటీ అయ్యాక బీజేపీలో చేరేందుకు సిద్ధ్దమై కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికీ రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు.
కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికే రాజీనామా చేయగా, సోమవారం ఎమ్మెల్యే పదవికి కూడా చేశారు. రాజగోపాల్రెడ్డి బీజేపీ నుంచి ఉప ఎన్నికల్లో బరిలోకి దిగనున్నట్లు ప్రకటించారు. చౌటుప్పల్, నారాయణపురం, మునుగోడు, చండూరు, మర్రిగూడ, నాంపల్లి మండలాలతో ఉన్న మునుగోడు నియోజకవర్గంలో ప్రస్తుతం 2,27,202 మంది ఓటర్లు ఉండగా, అందులో పురుషులు 1,15,463, మహిళలు 111735 మంది, ట్రాన్స్జెండర్లు నలుగురు ఉన్నారు.
మునుగోడు నియోజకవర్గంలో సంస్థాగతంగా టీఆర్ఎస్ పార్టీ తిరుగులేని పట్టు కలిగి ఉంది. మెజార్టీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్ నుంచే గెలుపొందారు. ఐదుగురు జడ్పీటీసీ సభ్యులు, ఐదుగురు ఎంపీపీలు, ఇద్దరు మున్సిపల్ చైర్మన్లతోపాటు పీఏసీఎస్ చైర్మన్లు, ఎక్కువ మంది ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్లు కూడా టీఆర్ఎస్ నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి నేతృత్వంలో ఇక్కడ మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్చార్జి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి సారథ్యంలో ప్రతి గ్రామంలోనూ టీఆర్ఎస్ పటిష్టమైన యంత్రాంగాన్ని కలిగి ఉంది.
దాంతోపాటు ఇక్కడ దశాబ్దాల తరబడి తిష్ట వేసిన ఫ్లోరైడ్కు చెక్ పెట్టిన ఘనత టీఆర్ఎస్ సర్కార్దే. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నల్లా నీటితో అద్భుతమైన ఫలితాలను సాధించింది. ఫ్లోరైడ్కు శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేస్తూ నాగార్జునసాగర్ తర్వాత అతి పెద్దదైన చర్లగూడెం రిజర్వాయర్ నిర్మాణాన్ని కూడా చేపట్టింది. డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా మర్రిగూడెం మండలంలో 12 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో దీన్ని నిర్మిస్తున్నది. ఇది పూర్తయితే ఇక్కడ కరువుకు శాశ్వతంగా చెక్ పెడనుంది. రహదారులు, విద్య, వైద్యం వంటి మౌలిక సదుపాయాల కల్పనలోనూ గణనీయమైన ప్రగతిని సాధించింది.
గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రాజగోపాల్రెడ్డి ఇక్కడి నుంచి గెలుపొందిన అనంతరం ఆయన నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి సారించలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయాలు మాట్లాడడం తప్ప, అభివృద్ధి గురించి ఏనాడూ పట్టించుకోలేదని సొంత పార్టీ కార్యకర్తలే విమర్శిస్తున్నారు. ఓట్లేసి గెలిపించిన ప్రజలు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నది నిజం. ప్రస్తుతం మునుగోడు ఉప ఎన్నిక వస్తే తిరిగి టీఆర్ఎస్ను గెలిపించుకునేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు.
2014లో టీఆర్ఎస్ నుంచి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి ఎమ్మెల్యే అయ్యాకే ఇక్కడ అభివృద్ధికి అడుగులు పడ్డాయని, ఆ తర్వాత రాజగోపాల్రెడ్డి పట్టించుకోలేదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతున్నది. ఈ నేపథ్యంలో ఉప ఎన్నిక ఎప్పుడు వచ్చినా టీఆర్ఎస్నే గెలిపించుకుంటామని ప్రజలు బహిరంగంగానే చెప్తున్నారు. రాజగోపాల్రెడ్డి పార్టీ మార్పుతో కాంగ్రెస్ పార్టీకి కొత్తగా అభ్యర్థి కోసం వెతుక్కోవాల్సి వచ్చింది.
రాజగోపాల్రెడ్డి వెంట పార్టీ నేతలు, కార్యకర్తలు వెళ్లకుండా జాగ్రత్త పడేందుకు పీసీసీ నేతలు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఎన్నో పదవులతోపాటు గుర్తింపునిచ్చిన కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసిన రాజగోపాల్రెడ్డికి గుణపాఠం చెప్పాలన్న సంకల్పంతో కాంగ్రెస్ ముఖ్యులు కనిపిస్తున్నారు. ఇక రాజగోపాల్రెడ్డి బీజేపీలో చేరుతున్నా గతం నుంచి ఇక్కడ పని చేస్తున్న ఆ పార్టీ నేతలు మాత్రం నోరు మెదపడం లేదు. వారు రాజగోపాల్రెడ్డికి ఎంత వరకు సహకరిస్తారన్నది చర్చనీయాంశంగా మారింది.