రామగిరి, జూలై 25 : నాటకాలను నేటి తరానికి పరిచయం చేసేలా కోమలి కళా సమితి నల్లగొండ ఆధ్వర్యంలో రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ హైదరాబాద్, నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి సౌజన్యంతో సోమవారం రాత్రి జిల్లా కేంద్రంలోని చిన వెంకట్రెడ్డి ఫంక్షన్ హాల్లో రాష్ట్ర స్ధాయి నాటకోత్సవాలు అట్టహసంగా ప్రారంభమయ్యాయి.
కోమలి కళా సమితి వ్యవస్ధాపక అధ్యక్షుడు బక్క పిచ్చయ్య, ఎంవీఆర్ విద్యా సంస్థల చైర్మన్ కొలనుపాక రవికుమార్తోపాటు నిర్వాహకులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి హాజరై కోమలి కళా సమితి నాటక రంగానికి చేస్తున్న చేవలను కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం కళారంగాన్ని ప్రోత్సహిస్తున్నదన్నారు.
మరిన్ని సందేశాత్మక నాటకలు ప్రదర్శించి నేటి తరం యువతలో స్ఫూర్తి నింపాలని సూచించారు. ప్రదర్శకులను సన్మానించారు. అనంతరం తృష్ణ, చీకటి పువ్వు అనే నాటకాలు ప్రదర్శించారు. కార్యక్రమంలో కోమలి కళా సమితి అధ్యక్షుడు పోశం రఘుపతి, ప్రధాన కార్యదర్శి ఎంఎల్ నర్సింహారావు, సభ్యులు డాక్టర్ లింగనబోయిన లేఖానందస్వామి, వి.భాస్కర్, ఎం.శ్రీకాంత్బాబు, జీఎల్ కుమార్, మాజీ కౌన్సిలర్ రావుల శ్రీనివాస్రెడ్డి, నాయకులు యుగేంధర్రెడ్డి పాల్గొన్నారు.
తొలుత వరంగల్ జిల్లా రంగస్థల కళాకారుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో తృష్ణ నాటకాన్ని ప్రదర్శించారు. ఇందులో భారతదేశపు యువ జంటకు లేక లేక కలిగిన సంతానం కదా అని, గారాబంగా పెంచకుండా కట్టుదిట్టంగా పెంచుతూ చిన్నతనంలోనే ఉన్నత శిఖరాలు చేరుకోవాలని అత్యాశతో తన కొడుకును పెంచుతారు. ఈ తరుణంలో ఆ యువ జంట ఉద్యోగ రీత్యా నార్వే దేశానికి వెళ్లాల్సి వస్తుంది. ఆ జంట అక్కడ వారి కుమారుడు చెడు స్నేహితుల సహవాసంతో పక్కదారి పడుతున్నాడేమోనని, తల్లిదండ్రులు వారిని అదుపులో పెట్టడానికి ప్రయత్నిస్తారు.
పిల్లవానికి వాతలు పెడుతారు. ఈ విషయం పై కేసు నమోదై ఆ దేశ చట్టం ప్రకారం ఆ తల్లిదండ్రులకు శిక్ష పడుతుంది. తల్లిదండ్రులు పిల్లలపై దురుసుగా ప్రవర్తించకూడదని, పిల్లల ఆత్మాభిమానాన్ని, అభిరుచుల్ని తెలుసుకుని ఆ దిశగా ప్రయత్నిస్తే జీవితంలో ఉన్నతంగా రాణిస్తారని, బలవంతంగా చదువులు రంగరించవద్దనేది తృష్ణ నాటకం తెలిపింది.