రామగిరి, జూన్ 23 : ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజామిత్ర సలహా కేంద్రం కృషి చేయాలని, న్యాయబద్ధంగా ప్రజలకు సంక్షేమ పథకాలు చేరేలా సహాయపడాలని సమాచార హక్కు చట్టం మాజీ ప్రధాన కమిషనర్ డాక్టర్ వర్రె వెంకటేశ్వర్లు సూచించారు. నల్లగొండలోని జిల్లా పరిషత్ వెనుక సమాచార హక్కు వికాస సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రజామిత్ర సలహా కేంద్రం ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
రాజ్యాంగం ప్రసాదించిన హక్కులపై అవగాహన పెంచడంతో ప్రజలు వారి సమస్యలను పరిష్కరించుకునే స్థాయిలో చైతన్యం చేయాలన్నారు. ఇందుకు సమాచార హక్కు వికాస సమితి గత 6 సంవత్సరాలుగా కృషి చేస్తుండడం అభినందనీయమన్నారు. సమాచార హక్కు చట్టం-2005పై విశేషంగా ప్రచారం చేసి వాటి నియమ నిబంధనలు, సెక్షన్లను సులభంగా ప్రజలు తెలుసుకునేలా చూడాలన్నారు. అప్పుడే వాటితో న్యాయం పొందే వీలుంటుందన్నారు.
నల్లగొండ జిల్లా ఆర్టీఐ మానిటరింగ్ సభ్యుడిగా డాక్టర్ యరమాద కృష్ణారెడ్డి అధికారులు, ప్రజలకు వారధిగా పనిచేయడం అభినందనీయమన్నారు. కోటగిరి దైవాదీనం అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఏపాల సత్యనారాయణరెడ్డి, తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు ముజీబుద్దీన్, సమాచార హక్కు వికాస సమితి సభ్యులు బొక్క శ్రీనివాస్రెడ్డి, మాదగోని భిక్షపతి, భీమనపల్లి నగేశ్, కొత్తపల్లి కరణ్కుమార్, దేవార్సు నీరజ, యరమాద హేమలత, బైరు సైదులుగౌడ్, యాళ్ల చంద్రారెడ్డి పాల్గొన్నారు.