నల్లగొండ ప్రతినిధి, మే17(నమస్తే తెలంగాణ) : ఈ యాసంగిలో ధాన్యం రికార్డు స్థాయిలో దిగుబడి వచ్చినా కొనుగోళ్ల విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టమైన వైఖరితో రైతన్నకు అండగా నిలుస్తున్నారు. ఓ వైపు కరోనా కలవరానికి గురిచేస్తున్నా వివిధ విభాగాల సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ కొనుగోళ్లకు శ్రీకారం చుట్టారు. పంట పండించిన రైతు ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతో ఉద్యమంలా కొనుగోళ్లను చేపట్టారు. దీంతో కొనుగోళ్లు ప్రారంభమైన నాటి నుంచి నిరాటంకంగా కొనసాగుతూనే ఉన్నాయి. నల్లగొండ జిల్లాలో 376 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయగా అందులో ఐకేపీ 200, పీఏసీఎస్ 163, మార్కెట్ కమిటీ 13 కేంద్రాలు ఉన్నాయి. వీటిలో నేటి వరకు 71,627 మంది రైతుల నుంచి 5.35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. వీటి విలువ రూ.1010 కోట్లు ఉంది. అయితే ఈ సీజన్లో మొత్తం 10లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేయగా అందులో 7.10లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని అధికారులు లెక్కలు వేశారు.
ఇప్పటివరకు 75శాతం కొనుగోళ్లను అధికారులు పూర్తి చేశారు. కొన్ని కేంద్రాల్లో వంద శాతం ధాన్యాన్ని కొనేశారు. దీంతో ఆయా చోట్ల కేంద్రాలను కూడా మూసివేస్తూ వస్తున్నారు. సోమవారం నాటికి 44 ఐకేపీ కేంద్రాలతోపాటు 37 పీఏసీఎస్ల ఆధ్వర్యంలోని కొనుగోలు కేంద్రాలు మూసివేశారు. ఇక్కడ 70శాతం రైతులకు ధాన్యం డబ్బులు కూడా చెల్లింపులు పూర్తి చేశారు. మిగిలి ఉన్న చెల్లింపులను వేగవంతం చేసే దిశగా అధికారులు దృష్టి సారించారు. ఆదివారం నాటికి ఐకేపీ కేంద్రాల్లో దామరచర్లలో 12, మిర్యాలగూడలో 11, త్రిపురారంలో 10, అనుముల, వేములపల్లిలో రెండు చొప్పున, నిడమనూరులో ఒక కేంద్రాన్ని మూసివేశారు. ఇక పీఏసీఎస్ల విషయానికి వస్తే మిర్యాలగూడలో 14, త్రిపురారంలో 9, దామరచర్లలో 3, నిడమనూరులో 2, కట్టంగూర్ మండలంలో కటి చొప్పున కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటికే వంద శాతం పూర్తికావడంతో వాటిని మూసివేశారు. వీటితో పాటు సోమవారం కూడా మరో 14 కేంద్రాలను మూసివేశారు.
ఈ వారంలో మరో 50శాతం కేంద్రాల్లో పూర్తి
ఈ వారంలో మరో 50శాతం కేంద్రాల్లో కొనుగోళ్లు పూర్తి చేయాలని నల్లగొండ జిల్లా అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ప్రతి గింజనూ సేకరించి కేంద్రాలను మూసివేస్తున్నారు. ఈ క్రమంలో మిగిలిన కేంద్రాల్లోనూ ఈ నెలాఖరు నాటికి వందశాతం కొనుగోళ్లు పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే మిర్యాలగూడ నియోజకవర్గంలో 95శాతం కొనుగోళ్లు పూర్తయ్యాయి. ఇక్కడ మరో 5వేల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉండవచ్చని భావిస్తున్నారు. శాలిగౌరారం మండలంలో 5వేలు, మునుగోడు నియోజకవర్గంలో 10వేలు, దేవరకొండ నియోజకవర్గంలో 20వేలు, సాగర్లో 35వేలు, నకిరేకల్లో 45వేలు, నల్లగొండ నియోజకవర్గంలో 50వేల మెట్రిక్ టన్నుల ధాన్యం ఇంకా కొనుగోలు కేంద్రాల్లో ఉందని అధికారులు అంచనా వేశారు. సుమారు 1.70లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉంటుందని, దీన్నింతటినీ ఈ నెలాఖరు వరకు కొనుగోలు చేస్తామని నల్లగొండ అదనపు కలెక్టర్ వనమాల చంద్రశేఖర్ ‘నమస్తే తెలంగాణ’కు తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో వందశాతం పూర్తైన కేంద్రాలను మూసివేశామని చెప్పారు. మొత్తం 23వేల లారీల లోడ్ల ధాన్యాన్ని ఇప్పటివరకు రైస్మిల్లులకు తరలించామని వెల్లడించారు. నగదు చెల్లింపులు కూడా సాధ్యమైనంత తొందరగా చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఎప్పటికప్పుడూ మంత్రి జగదీశ్రెడ్డి, కలెక్టర్ ప్రశాంత్జీవన్ పాటిల్ సలహాలు, సూచనలతో ముందుకు సాగుతున్నామని చెప్పారు.
సూర్యాపేటలో 67 కేంద్రాల్లో 100శాతం పూర్తి
సూర్యాపేట జిల్లాలోనూ ఇప్పటివరకు 67 కేంద్రాల్లో వంద శాతం ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేశారు. దీంతో వీటిని ఒక్కొక్కటిగా మూసివేస్తూ వచ్చారు. ఇక్కడ మొత్తం 339 కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించారు. వీటిల్లో 209 ఐకేపీ, 130 పీఏసీఎస్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ సీజన్లో మొత్తం 6.26లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కేంద్రాలకు వస్తుందని అంచనా వేశారు. ఇందులో ఇప్పటివరకు 50714 మంది రైతుల నుంచి 3.94లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఇందులో 3.79 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైస్మిల్లులకు తరలించారు. మొత్తం కొనుగోలు చేసిన ధాన్యం విలువ రూ.743కోట్లు కాగా ఇప్పటివరకు 29,368 మంది రైతులకు రూ.492 కోట్లు ఖాతాల్లో జమ చేశారు. కాగా ఈ జిల్లాల్లోనూ మంత్రి జగదీశ్రెడ్డి, కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి సారథ్యంలో కొనుగోళ్లల్లో ఆటంకాలు లేకుండా చర్యలు చేపట్టారు.
కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాల్లో ఇప్పటికే పలుచోట్ల వందశాతం కొనుగోళ్లు పూర్తయ్యాయి. మొత్తం కేంద్రాల్లో ఇప్పటివరకు 46 ఐకేపీ కేంద్రాలను, 21 పీఏసీఎస్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేంద్రాలను మూసివేసినట్లు జిల్లా అధికారులు ప్రకటించారు. జూన్ మొదటివారంలో వానకాలం వర్షాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆలోపే కొనుగోళ్లు పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఈ సీజన్లో సూర్యాపేట జిల్లాలోనూ ఓ వైపు గోదావరి జలాలు, మరోవైపు కృష్ణాజలాలు సమృద్ధిగా అందుబాటులో ఉండడంతో భారీగా ధాన్యం దిగుబడులు వచ్చాయి. దీంతో కొనుగోళ్లు కూడా భారీగా జరుపాల్సి వస్తుందని అధికారులు చెబుతున్నారు. గతంలో ఎన్నడూ ఇంత ధాన్యాన్ని కొనుగోలు చేసిన దాఖలాలు లేవని స్పష్టం చేస్తున్నారు.
మిర్యాలగూడ మండలంలో రూ.58.36 కోట్ల ధాన్యం
మిర్యాలగూడ రూరల్, మే17 : మిర్యాలగూడ మండలంలో 13 ఐకేపీ కేంద్రాలు, 15 పీఏసీఎస్ కేంద్రాలు, ఒక మార్కెట్ ద్వారా 5,432 మంది రైతుల నుంచి 3,09,130 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేశారు. వీటి విలువ రూ.58,36,37,440. సుమారు రూ. 28,34,44,340 రైతుల ఖాతాల్లో నగదు జమ చేశారు.
70 శాతం డబ్బులు జమయ్యాయి..
ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాలని ప్రకటించగానే మార్కెట్ సిబ్బంది ద్వారా కావాల్సిన కాంటాలు , తేమ చూసే యంత్రాలు, గన్నీ బ్యాగులు, టార్పాలిన్లు సిద్ధం చేసుకున్నాం. ఐకేపీ, పీఏసీఎస్ కొనుగోలు కేంద్రాలకు సామాగ్రి అందజేశాం. ఏ ఇబ్బందీ లేకుండా కొనుగోళ్లు పూర్తి చేశాం. ఇప్పటికే 70 శాతం మంది రైతులకు నగదు చేరింది. పది రోజుల్లో అందరికీ పడుతుంది.
మాడ్గులపల్లిలో ముగుస్తున్న కొనుగోళ్లు
మాడ్గులపల్లి, మే 17 : మండలంలో 8 ఐకేపీ, 6 పీఏసీఎస్ కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. చిరుమర్తి, కన్నెకల్ ఐకేపీ కేంద్రాల్లో కొనుగోళ్లు పూర్తికాగా సెంటర్లను మూసివేశారు. 366 మంది రైతుల నుంచి 28,605.40 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేసి 98 లారీల్లో మిల్లులకు తరలించారు. రూ.5,40,07,372 డబ్బుకు 103 మంది రైతుల ఖాతాల్లో రూ.1,73,62,465 జమయ్యాయి. మిగిలిన డబ్బులు కూడా త్వరలో ఖాతాల్లో పడతాయని ఏపీఎం నిజాముద్దీన్ తెలిపారు.
వేములపల్లిలో 41, 622 క్వింటాళ్లు
వేములపల్లి మే 17 : మండలంలో ఆమనగల్లు, రావులపెంట, మొల్కపట్నం, తిమ్మారెడ్డిగూడెం, బుగ్గబావిగూడెం గ్రామాల్లో ఐకేపీ సెంటర్ల ద్వారా ధాన్యం కొనుగోలు చేశారు. 7, 504 క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేయగా రైతుల ఖాతాల్లోకి రూ.70,53,760 జమయ్యాయి. మొల్కపట్నం, ఆమనగల్లు కేంద్రాలు నడుస్తుండగా రావులపెంట, తిమ్మారెడ్డిగూడెం, బుగ్గబావిగూడెం కేంద్రాల్లో ధాన్యం అయిపోవడంతో మూసి చేశారు. శెట్టిపాలెం, వేములపల్లి, సల్కునూరు, లక్ష్మీదేవిగూడెం గ్రామాల్లో పీఏసీఎస్ కేంద్రాలను ఏర్పాటు చేసి 34,118 క్వింటాళ్ల ధాన్యాన్ని కొన్నారు. రూ.4కోట్ల32లక్షల40వేల రైతుల ఖాతాల్లో జమ చేశారు. మండలంలో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా 41,622 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేశారు.