హాలియా, మే17 : కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. సోమవారం హాలియా మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్, వైద్యారోగ్యశాఖ అధికారితో కలసి సమీక్ష సమావేశం నిర్వహించారు. కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలను మున్సిపల్ చైర్పర్సన్ వెంపటి పార్వతమ్మాశంకరయ్య, కమిషనర్ వేమనరెడ్డి ఎమ్మెల్యేకు వివరించారు. పీహెచ్సీలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నామని, పాజిటివ్ వచ్చిన వారికి మెడికల్ కిట్లు అందిస్తున్నామని మండల వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మున్సిపాలిటీలోని అన్ని వార్డుల్లో సోడియం హైపోక్లోరైట్ పిచికారీ చేయాలని సూచించారు. ప్రజలు నిబంధనలు పాటించేలా వారికి అవగాహన కల్పించాలన్నారు. కొవిడ్ లక్షణాలు కనిపించిన వెంటనే పరీక్షలు చేయించుకొని మందులు వాడితే తగ్గుతుందని, ఆలస్యం చేయడం వల్లే పరిస్థితి విషమిస్తున్నదని ఎమ్మెల్యే పేర్కొన్నారు. సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నల్లగొండ సుధాకర్, మండల వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాస్, కౌన్సిలర్లు వర్రా వెంకట్రెడ్డి, ప్రసాద్ నాయక్, అన్నెపాక శ్రీను, కోఆప్షన్ సభ్యులు రావుల లింగమ్మ, డేవిడ్, చాపల సైదులు, ఎడమకాల్వ మాజీ వైస్చైర్మన్ మలిగిరెడ్డి లింగారెడ్డి, టీఆర్ఎస్ నాయకులు చెరుపల్లి ముత్యాలు ఉన్నారు.
లాక్డౌన్ అమలు తీరు పరిశీలన
హాలియాలో లాక్డౌన్ అమలు తీరును సోమవారం ఎమ్మెల్యే నోముల భగత్ పరిశీలించారు. ఉదయం 11 గంటలకు మున్సిపల్ కార్యాలయంలో సమావేశానికి హాజరై వెళ్తూ ప్రధాన కూడలిలో కొద్దిసేపు ఆగారు. లాక్డౌన్ అమలు తీరుపై ఎస్ఐ శివకుమార్ను అడిగి తెలుసుకున్నారు. కరోనా కట్టడికి నిరంతరం శ్రమిస్తున్న పోలీసులకు ప్రజలు సహకరించాలని కోరారు. ఆయన వెంట జడ్పీ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు, వర్రా వెంకట్రెడ్డి ఉన్నారు.
పారిశుధ్య కార్మికులకు రూ.10వేలు అందజేత
కరోనా కష్టకాలంలో కూడా నిరంతరాయంగా విధులు నిర్వహిస్తున్న పారిశుధ్య కార్మికులకు టీఆర్ఎస్ జిల్లా నాయకుడు మలిగిరెడ్డి లింగారెడ్డి సోమవారం రూ. 10వేలను ఎమ్మెల్యే నోముల భగత్ చేతుల మీదుగా అందించారు. మున్సిపల్ కార్మికుల సేవలను ఎమ్మెల్యే ఈ సందర్భంగా కొనియాడారు. లింగారెడ్డిని అభినందించారు.