మండుతున్న ఎండలు
ఈ ఏడాది ఇదే గరిష్ఠ స్థాయి ఉష్ణోగ్రత
ఒకవైపు కరోనా.. మరోవైపు వేడిమి
ఇంటికే పరిమితమవుతున్న ప్రజలు
ఎండలు మండిపోతున్నాయి. భానుడు రోజురోజుకు ఉగ్రరూపం దాల్చుతున్నాడు. ఆదివారం 44 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదు కాగా ఈ సీజన్లో ఇదే రికార్డు. వారం క్రితం 38 డిగ్రీలు ఉన్న ఉష్ణోగ్రతలు రోజుకు ఒకటి, రెండు డిగ్రీల చొప్పున పెరుగుతున్నాయి. మరి కొద్దిరోజులు ఎండలు ఇలానే ఉంటాయని, ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఒకవైపు కరోనా విజృంభణ, మరోవైపు భగభగ మండే ఎండలతో ప్రజలు బయటికెళ్లడానికి భయపడుతున్నారు. దీంతో జన సంచారం లేక రోడ్లు, వ్యాపార సముదాయాలు బోసిపోతున్నాయి.
నల్లగొండ సిటి, మే 9 : భానుడు ఉగ్రరూపాన్ని దాల్చుతున్నాడు. ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. మధ్యాహ్నం ఎండ వేడి అధికమవుతోంది. ఉక్కపోత భరించలేక ప్రజలు అవస్థలు పడుతున్నారు. వారంరోజుల క్రితం పగటి ఉష్ణోగ్రతలు 38 డిగ్రీలు ఉండగా ఆదివారం 44 డిగ్రీలుగా నమోదైంది. మే మొదటి వారంలోనే పరిస్థితి ఇలా ఉంటే నెల చివరలో ఎలా ఉంటుందనే ప్రశ్న తలెత్తుతోంది. జిల్లాలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగి పోవడంతో పట్టణంతోపాటు గ్రామీణ ప్రాంతాల ప్రజలు మధ్యాహ్నం బయటకు రావడం లేదు. ఒక వైపు కరోనాతో అల్లాడుతున్న ప్రజలు పెరుగుతున్న ఎండలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. మరో మూడురోజుల వరకు ఈ తరహాలోనే ఎండలు మండనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు.
అప్రమత్తత అవసరం …
జిల్లాలో మరో నెలపాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. వేసవి వేడి నుంచి ఉపశమనం పొందేందుకు మరిన్ని జాగ్రతలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కూలి పనులు చేసుకునేవారు ఎండ ముదరక ముందే ఇంటికి చేరుకోవాలి. ఉదయం, సాయంత్రం వేళల్లో పని చేయాలి. శరీర ఉష్ణోగ్రత 106 డిగ్రీల ఫారన్హీట్ దాటితే వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉంది. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు ఎట్టిపరిస్థితిలో ఎండకు వెళ్లవద్దని వైద్యులు సూచిస్తున్నారు. నీటిని, చల్లని పానీయాలు తీసుకోవడంతో ఎండ నుంచి ఉపశమనం పొందవచ్చని చెబుతున్నారు.
గత ఐదు రోజుల్లో నమోదైన ఉష్ణోగ్రతలు..
తేదీ కనిష్ఠం గరిష్ఠం
9న 26.0 44.0
8న 24.0 42.5
7న 24.4 42.0
6న 24.0 43.0
5న 24.0 42.0