నార్కట్పల్లి, జూలై 5 : నార్కట్పల్లి ఆర్టీసీ బస్ డిపో ఆవరణలో మతిస్థితిమితం లేని నాలుగు గంటలపాటు హల్ చేసింది. చెట్టు చివరి కొమ్మల వరకు ఎక్కి.. చేతులు, కాళ్లు, మొహం బ్లేడ్తో కోసుకుంటూ.. దూకేస్తానంటూ బెదిరించింది. పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి చాకచక్యంగా వ్యవహరించి ఆమెకు కిందికి దింపారు. హైదరాబాద్లోని దిల్సుఖ్నగర్కు చెందిన సుబ్రహ్మణ్యం, సుందరి దంపతుల కూతురు హారిక. కొన్ని సంవత్సరాల నుంచి ఆమె మతిస్థిమితం కోల్పోయి బాధపడుతున్నది. వారం కిందట నార్కట్పల్లి పట్టణంలో తిరుగుతుండగా, పోలీసులు గుర్తించి ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు. హారిక ఆదివారం మళ్లీ నార్కట్పల్లికి వచ్చింది. సోమవారం ఉదయం బస్ డిపో ఆవరణలో ఉన్న ఒక చెట్టు ఎక్కి.. బ్లేడ్తో శరీరం కోసుకుంటూ, కిందికి దూకేస్తానంటూ బెదిరించింది. స్థానికులు, ప్రయాణికులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. ఎస్ఐ యాదయ్య సిబ్బందితో అక్కడికి చేరుకుని.. నల్లగొండ జిల్లా కేంద్రం నుంచి అగ్నిమాపక సిబ్బందిని రప్పించారు. వారు నిచ్చెన వేసుకుని చెట్టుకు ఎక్కుతూ.. యువతిని మాటల్లో పెట్టి క్షేమంగా కిందికి దింపారు. దాంతో అక్కడున్న వాళ్లంతా ఊపిరి పీల్చుకున్నారు. చేతికి తీవ్రంగా గాయాలవడంతో స్థానిక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించి తల్లిదండ్రులకు అప్పగించారు.