Nagarjuna Sagar | హాలియా, ఏప్రిల్ 15 : నాగార్జున సాగర్ జలాశయం డేడ్ స్టోరేజీకి చేరువైంది. ఈ ప్రభావం హైదరాబాద్ జంట నగరాలతోపాటు ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాలకు తాగునీటి సరఫరాపై పడనుంది. నాగార్జున సాగర్ జలాశయానికి వరద నీరు రావడానికి మరో మూడు నెలల సమయం పట్టనుంది. అప్పటి వరకు తాగునీటి అవసరాలు ఎట్ల తీర్చాలనే దానిపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ప్రాజెక్టులో నీటి నిర్వహణ లోపిస్తే మంచినీళ్ల కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఈ ఏడాది కూడా జూన్, జూలై, ఆగస్టు నెలల్లో సరైన వర్షపాతం నమోదు కాకపోతే, ఎగువ నుంచి వరద నీరు రాకపోతే కృష్ణా పరీవాహక ప్రాంతంలో దారిద్య్ర పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంది.
నాగార్జున సాగర్ జలాశయం రెండు తెలుగు రాష్ర్టాల్లో లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించడంతోపాటు వేలాది గ్రామాల్లో కోట్లాది మంది ప్రజలకు తాగునీటి అవసరాలను తీరుస్తుంది. దశాబ్ద కాలంపాటు తాగు, సాగునీటికి కొదవ లేకుండా సిరులు కురిపించిన ఈ జలాశయం గత ఏడాది సరైన వర్షాలు లేకపోవడం, ఎగువ నుంచి వరద రాకపోవడంతో పూర్తిగా నిండలేదు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు గరిష్ఠ నీటిమట్టం 590 అడుగులు కాగా, ఈ ఏడాది 540 అడుగులు కూడా దాటలేదు. వానకాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో సాగర్ ఎడమ కాల్వకు నీటిని విడుదల చేసి పంటలను గట్టెక్కించింది. కానీ.. యాసంగిలో కాంగ్రెస్ ప్రభుత్వం క్రాప్ హాలిడే ప్రకటించి తాగునీటి అవసరాలకు మాత్రమే నీటిని విడుదల చేస్తున్నది.
నాగార్జున సాగర్ జలాశయం గరిష్ఠ నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 509.40 అడుగుల నీరు మాత్రమే ఉన్నది. దీంతో హైదరాబాద్ నగరానికి భవిష్యత్లో తాగునీటి సరఫరా చేసేందుకు ఇబ్బంది కానున్నది. సాగర్ జలాశయంలో 510 అడుగుల నీరు ఉంటేనే ఏఎమ్మార్పీ ఎత్తిపోతల ద్వారా హైదరాబాద్ నగరానికి తాగునీటిని సరఫరా చేయడం వీలవుతుంది. 510 అడుగుల కంటే తక్కువ ఉంటే నీటిని పంపింగ్ చేయడం సాధ్యం కాదు. పంపింగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాలకు తాగునీటికి ఇబ్బంది కానున్నది.
నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్వహణను కృష్ణా రిజర్వాయర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) చేపట్టిన తరువాత ఇటీవల తెలంగాణ నీటి అవసరాల కోసం ఎడమ కాల్వకు 5 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్ తాగునీటి అవసరాల కోసం 5 టీఎంసీల నీటిని విడుదల చేయడం జరిగింది. కాగా, సాగర్ జలాశయం డెడ్ స్ట్టోరేజీకి చేరువైనప్పటికీ 505 అడుగుల నీటి మట్టం వరకు తాగునీటి అవసరాల కోసం వాడుకోవాలని ఇటీవల తెలుగు రాష్ర్టాల అధికారులు ఒక అవగాహనకు వచ్చారు.
కానీ.. ప్రస్తుతం జలాశయంలో ఉన్న నీరు మరో మూడు నెలల వరకు తాగునీటి అసరరాలను తీర్చుతుందా? అన్నది సందేహంగా మారింది. ప్రస్తుతం ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోయాయి. గ్రామాల్లో నీటిఎద్దడి నెలకొన్నది. ఈ పరిస్థితుల్లో ఈ ఏడాది కూడా మొదటి మూడు మాసాల్లో సరైన వర్షపాతం నమోదు కాకపోతే, ఎగువ నుంచి వరద నీరు రాకపోతే పరిస్థితి ఏంటని అధికారులను వేధిస్తున్న ప్రశ్న.