నల్లగొండ ప్రతినిధి, ఫిబ్రవరి3 (నమస్తే తెలంగాణ) : కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్ సర్కారు వ్యవహారశైలి ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతాంగాన్ని ఆందోళనకు గురిచేస్తున్నది. కృష్ణా నదిలో నీటి వాటాలు తేలకముందే శ్రీశైలంతోపాటు నాగార్జుసాగర్ ప్రాజెక్టులను కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ)కు అప్పగించేందుకు సిద్ధ్దమైనట్లు ప్రచారం జరుగుతున్నది. ఇదే నిజమైతే భవిష్యత్లో సాగర్ ఎడమ కాల్వతోపాటు ఏఎంఆర్పీ పరిధిలోని 14లక్షల ఎకరాల ఆయకట్టు ప్రశ్నార్థకంగా మారనున్నది. భారీ వరదలు వస్తే తప్ప శ్రీశైలం నుంచి సాగర్కు వరద నీరు రావడమే గగనం. ప్రస్తుతం ఉన్న నిబంధనలతో బోర్డు పరిధిలోకి ప్రాజెక్టులు వస్తే సాగర్కు రావాల్సిన నీరంతా రాయలసీమలోని పెన్నా బేసిన్కు ఏపీ సర్కార్ తరలించుకుపోవడం ఖాయమని నీటి పారుదల నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కేసీఆర్ సర్కార్ హయాంలో కృష్ణా నది ప్రాజెక్టుల విషయంలో రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకోవడంలో ఎక్కడా రాజీ పడలేదు. శ్రీశైలం నుంచి సాగర్కు వరద నీటిని తరలించడంలో, సాగర్ నుంచి సాగునీటిని ప్రణాళికాబద్ధంగా వినియోగించుకోవడంలోనూ పకడ్బందీగా వ్యవహరించారు. కృష్ణా జలాల వినియోగంలో ఏపీ సర్కార్ అభ్యంతరాలను సైతం తోసిపుచ్చి ముందుకు సాగారు. దాంతో 2014 నుంచి 2023 వరకు కృష్ణానదిలో ఏ మాత్రం వరద సాగినా ఆ నీటిని సాగర్ వరకు తీసుకురావడంలో కేసీఆర్ సర్కారు సక్సెస్ అయ్యింది.
2015 క్రాప్ హాలిడేను మినహాయిస్తే 2016, 2017, 2018 సంవత్సరాల్లో ఎగువ నుంచి సాగర్కు భారీ వరద లేకపోయినా శ్రీశైలం నుంచి నీటిని తరలించి ఆయకట్టులో రెండు పంటలకు విజయవంతంగా సాగునీటిని అందించింది. మిగతా సంవత్సరాల్లో భారీగా వరదలు రావడంతో ఇబ్బంది లేకుండా పోయింది. అయితే.. శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టులపై రాష్ర్టానికి పెత్తనం ఉండడం వల్లే ఇది సాధ్యమైంది. అయితే ఈ ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించాలని ఏపీ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నా కేసీఆర్ ప్రభుత్వం అభ్యంతరాలను వ్యక్తం చేసింది.
కృష్ణా ట్రిబ్యూనల్లో నీటి కేటాయింపుల విచారణ పూర్తయ్యేంత వరకు 50 ః 50 నిష్పత్తిలో నీటి కేటాయింపులు ఉండేలా చర్యలు చేపట్టాలి. అప్పగింతకు ముందే ఆపరేషనల్ ప్రొటోకాల్ను ఖరారు చేయాలని, నీటి వాటాలను తేల్చాలని కేసీఆర్ సర్కార్ డిమాండ్ చేసింది. సాగర్కు శ్రీశైలం నుంచి 264 టీఎంసీల నీటిని సరఫరా చేసేందుకే శ్రీశైలం ప్రాజెక్టును డిజైన్ చేశారు. ట్రిబ్యూనల్ అవార్డు ప్రకారం 830 అడుగులే కనిష్ట నీటి నిల్వ. శ్రీశైలం నుంచి 34 టీఎంసీల నీటిని మాత్రమే బయటి బేసిన్లకు ఏపీ మళ్లించేందుకు పరిమితం కావాలి. క్యారీ ఓవర్ స్టోరేజీ అవకాశం ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తూ వచ్చింది. అయితే.. వీటిపై బోర్డు స్పష్టత ఇవ్వకపోవడంతో కేసీఆర్ సర్కార్ అప్పగింతకు ఒప్పుకోలేదు. ప్రస్తుతం కాంగ్రెస్ సర్కార్కు ఈ విషయంలో చిత్తశుద్ధి కొరవడింది. దాంతో గత నెల 17న జరిగిన బోర్డు సమావేశంలో రాష్ట్ర ప్రాజెక్టుల అప్పగింతకు రాష్ట్ర సర్కార్ ఒకే చెప్పిందంటూ మినిట్స్ బయటకు రావడంతో కలకలం రేపుతున్నది.
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక డిమాండ్గా ఉంటూ వచ్చిన నీళ్ల అంశంపై సీఎం కేసీఆర్ నిబద్ధతకు నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిదర్శనం. గతంలో శ్రీశైలం డ్యామ్ నిండి క్రస్ట్గేట్లు ఎత్తితే తప్ప అప్పటివరకు సాగర్కు చుక్క నీరు విడుదల చేసేవారు కాదు. వాస్తవంగా శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద రాక ప్రారంభమైతే విద్యుత్ ఉత్పత్తి చేస్తూ ఆ నీటిని సాగర్కు విడుదల చేయవచ్చు. కానీ.. సమైక్య పాలకులు శ్రీశైలం నీటిని రాయలసీమకు తరలించడానికి వీలుగా ఆ పని చేసేవారు కాదు. దాంతో సాగర్ ఆయకట్టు రైతాంగం తీవ్రంగా నష్టపోయేది. దాంతో సరైన వర్షాలు లేని సమయంలో సాగర్ ఆయకట్టుకు నీటి విడుదల సమస్యాత్మకంగా మారేది. స్వరాష్ట్రంలో కేసీఆర్ తనదైన మార్క్ను చూపించారు. 2018 నుంచి కేసీఆర్ సర్కార్ కృష్ణా జలాలను సాగర్కు తరలించడంలో స్పష్టమైన వ్యూహంతో ముందుకు సాగింది. శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద మొదలు కాగానే అక్కడ రాష్ట్ర ఆధీనంలో ఉండే ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రం ద్వారా కరెంటు ఉత్పత్తి చేస్తూ సుమారు 40వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తూ వచ్చింది.
2018లో దీనికి శ్రీకారం చుట్టి గతేడాది వరకు ఇదే విధానాన్ని అనుసరిస్తూ వచ్చారు. దీనిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేసినా సరే తెలంగాణ ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. ఇరు రాష్ర్టాలకు ఉపయుక్తమైన సాగర్లో నీటిని నిల్వ చేయాలని భావించింది. తద్వారా ఆయకట్టు రైతాంగానికి లబ్ధి చేకూర్చాలన్న గట్టి పట్టుదలతో వ్యవహరిస్తూ వచ్చింది. 2020 వానకాలం సీజన్లో శ్రీశైలం నుంచి కరెంటు ఉత్పత్తి చేస్తూ సాగర్కు 25 రోజుల్లో 33 అడుగుల అదనపు నీటిమట్టంతో 70 టీఎంసీల నీటిని తరలించారు. దాంతో ఆయకట్టుకు సకాలంలో సాగునీటిని విడుదల చేయగలిగారు. 2021లో సైతం శ్రీశైలంలోకి వరద మొదలు కాగానే సాగర్కు నీటిని తరలించారు.
తద్వారా సాగర్లో 10 అడుగుల మేర నీటిమట్టం పెరిగింది. 2022లోనూ ఇదేవిధంగా కేసీఆర్ సర్కార్ వ్యవహరించింది. ఆగస్టు 12న శ్రీశైలం ప్రాజెక్టుకు వరద మొదలు కాగా, 13 నుంచే పవర్ జనరేషన్తో సాగర్కు నీటిని తరలించారు. దీనివల్ల శ్రీశైలం గేట్లు ఎత్తే నాటికే సుమారు 22 అడుగుల నీటిని అదనంగా సాగర్కు తరలించారు. ఈ నీటితో ముందస్తు నీటి విడుదలకు ఆస్కారం ఏర్పడింది. కానీ.. ప్రస్తుతం ఈ ప్రాజెక్టులను బోర్డుకు అప్పగిస్తే ఆ అవకాశం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదు. దాంతో సమైక్య పాలన నాటి దుస్థితినే నాగార్జునసాగర్ ఎడమ కాల్వతోపాటు ఏఎంఆర్పీ ఆయకట్టుకు దాపురించనున్నది. దీనిపై రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ జంట నగరాలతోపాటు ఉమ్మడి నల్లగొండ జిల్లా తాగునీటి అవసరాలకు కూడా గడ్డు కాలం దాపురించనుందనడంలో సందేహం లేదు.