హాలియా, మార్చి 25 : వర్షాలు లేక, చెరువులు, కుంటలు ఎండిపోవడంతో జిల్లాలో తీవ్రమైన కరువు అలుముకున్నది. భూగర్భజలాలు సైతం అడుగంటి చుక్కనీరు దొరుకని పరిస్థితి నెలకొన్నది. యాసంగిలో సాగు చేసిన వరి పొలాలు నీళ్లు లేక ఎండిపోతున్నాయి. నాగార్జున సాగర్ ఎడమ కాల్వ నీరు రాకున్నా చాలా మంది రైతులు బోర్ల ద్వారా సాగు చేశారు.
తొలుత బాగానే పోసినా ఆ తర్వాత నీటిమట్టం గణనీయంగా పడిపోయింది. మరోవైపు ఎండలు ముదరడంతో పంటలకు నీరందడం లేదు. ఒక తడికి సాగర్ నుంచి నీటిని విడుదల చేస్తే పొట్ట దశకు వచ్చిన పంటలు చేతికొచ్చేవని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే చాలా వరిచేలు ఎండిపోగా ఆలస్యంగా వేసిన పంటలను దక్కించుకునేందుకు నీటిని విడుదల చేయాలని కోరుతున్నారు.
నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఈ ఏడాది యాసంగిలో బోరు, బావులు, చెరువుల కింద 75 వేల ఎకరాల్లో వరిసాగు చేశారు. మొదట కరెంట్ కష్టాలు వెంటాడినప్పటికీ పొలాలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చారు. గత నెల వరకు వరిచేలు బాగానే ఉన్నాయి. పంట పొట్ట దశలో ఉండగా భూగర్భ జలాలు అడుగంటడంతో క్రమంగా ఎండిపోతున్నాయి. సాగర్ ఎడమ కాల్వకు వారం రోజులపాటు మొదటి జోన్లోని రైతులకు సాగునీరు ఇస్తే పంటలు చేతికి వచ్చే అవకాశం ఉన్నది. మరోవైపు చెరువులు, కుంటలు నిండి ఎండాకాలంలో పశుపక్షాదులకు నీటికి ఇబ్బంది లేకుండే.
కానీ ప్రభుత్వం నుంచి స్పందన లేదు. దాంతో నియోజకవర్గంలో ఇప్పటికే 25 వేల ఎకరాల్లో వరిపంటలు పూర్తిగా ఎండిపోయాయి. అనుముల మండలంలోని 15 గ్రామాల్లో పంటలు చేతికందకుండా పోయాయి. పులిమామిడి, రామడుగు, అనుముల, మధారిగూడెం, హజారిగూడెం, చల్మారెడ్డిగూడెం, పుల్లారెడ్డిగూడెం, కొట్టాల సూరేపల్లి గ్రామాల రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఎండిన వరి చేలను చేసేదేమీ లేక రైతులు పశువులను మేపుతున్నారు.
ఎకరానికి రూ.20 వేల చొప్పున పెట్టుబడి పెట్టి ఈ యాసంగిలో బోర్ల కింద 10 ఎకరాల్లో వరి సాగు చేసిన. తీరా పంట చేతికి వచ్చే సమయంలో భూగర్భజలాలు అడుగంటిపోవడంతో పూర్తిగా ఎండిపోయింది. వడగండ్ల వానకు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం ఇస్తామన్నట్లుగానే, పంట ఎండిపోయిన రైతులకు కూడా నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలి. వడగండ్ల వానకు పంట దెబ్బతిన్న రైతులకు, నీరందక పంట ఎండిన రైతులకు పెద్ద తేడా ఏమీ లేదు. అంతిమంగా నష్టపోయింది రైతే. కాబట్టి ప్రభుత్వం పెద్దమనసుతో ఆలోచించి పంట ఎండిన రైతులను కూడా ఆదుకోవాలి.
-రావుల అంజయ్య, రైతు, చల్మారెడ్డిగూడెం, అనుముల మండలం, నల్లగొండ జిల్లా
నాకున్న 5 ఎకరాలతోపాటు మరో 3 ఎకరాలు కౌలుకు తీసుకొని వరి సాగు చేసిన. గతేడాది బావిలో నీళ్లు ఉండడంతో ఈ సారి కూడా అట్లనే వేసిన. ఈ ఏడాది ఏఎంఆర్పీ కాల్వ రాకపోవడంతో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. నీళ్లందక పొట్టదశకు వచ్చిన 8 ఎకరాల వరి పైరు ఎండిపోయింది. మొత్తం పొలం పెట్టుబడి కోసం రూ.2.50 లక్షల అప్పు చేసిన. ఇప్పుడేం చేయాలో గుండెల్లో గుబులు మొదలైంది. పదేండ్లుగా సాగునీటికి ఇంత ఇబ్బంది రాలె. పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నష్ట పరిహారం ఇచ్చి ఆదుకోవాలి.
-కిశోర్రెడ్డి, బుడమర్లపల్లి, కనగల్ మండలం