రామగిరి, ఏప్రిల్ 12 : నల్లగొండ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలను నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్(న్యాక్) బృందం మంగళవారం తనిఖీ చేసింది. న్యాక్ గుర్తింపు గడువు ముగియడంతో ప్రిన్సిపాల్ డాక్టర్ ఘన్శ్యాం నివేదిక మేరకు యూజీసీ (యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్) కమిటీని పంపించింది. న్యాక్ బృందం చైర్మన్ డాక్టర్ సుగం ఆనంద్ నేతృత్వంలో కో ఆర్డినేటర్ డాక్టర్ కాశం అగర్వాల్, సభ్యులు డాక్టర్ నాగరత్నం కళాశాలను తనిఖీ చేశారు. ముందుగా బృందం సభ్యులకు కళాశాల ప్రిన్సిపాల్ ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ప్రిన్సిపాల్ పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కళాశాలకు సంబంధించిన వివరాలను వివరించారు. కళాశాలలో బోటనీ, జువాలజీ, మైక్రోబయాలజీ, కంప్యూటర్ సైన్స్, గ్రంథాలయం, క్రీడల అంశాలను పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. మధ్యాహ్నం కళాశాల రెగ్యులర్, అలూమినీ(ఓల్డ్బ్యాచ్) విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహించి నివేదిక రాసుకున్నారు. సాయంత్రం కళాశాల విద్యార్థినుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
న్యాక్ బృందం బుధవారం రెండో రోజు కళాశాలలో పలు అంశాలను పునఃపరిశీలన చేయనున్నారు. మధ్యాహ్నం తర్వాత కమిటీ సభ్యులు సమావేశమై న్యాక్ గ్రేడ్కు సంబంధించిన నివేదిక తయారు చేసి సీల్డ్ కవర్లో యూజీసీ, న్యాక్కు పంపిస్తారు.
ఉమెన్స్ కళాశాలలకు 2006లో న్యాక్ గ్రేడ్-బి + వచ్చింది. ఆ గడువు 2011తో ముగిసింది. అయితే 2011లో ప్రిన్సిపాల్ నిర్లక్ష్యంతో న్యాక్ పర్యటనకు నివేదిక అందించ లేదు. 2015లో న్యాక్కు పోవడంతో గ్రేడ్ ‘బి’ వచ్చింది ప్రస్తుతం జరుగుతున్న న్యాక్ పర్యటనతో కళాశాల గ్రేడ్ పెరుగుతుందా..? తగ్గుతుందా..? అనే అంశం చర్చగా మారింది.
కళాశాలకు ఉదయం న్యాక్ బృందం వచ్చిన సమయంలో మీడియాను అనుమతించలేదు. గతంలో ఎన్జీ కళాశాల, ఎంజీయూలో న్యాక్ బృందం పర్యటించినప్పుడు మీడియాను అనుమతించడంతోపాటు పూర్తి వివరాలు వెల్లడించారు. ప్రస్తుతం న్యాక్ పర్యటనలో మీడియాను అనుమతించకపోవడంతో పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. మీడియా వస్తే తప్పులు బహిర్గతమవుతాయనే లోపలికి అనుమతించలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.