కట్టంగూర్, ఫిబ్రవరి 28 : పౌర హక్కులపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని కట్టంగూర్ సర్పంచ్ ముక్కామల శ్యామలా శేఖర్ అన్నారు. మండల కేంద్రంలోని అంబేద్కర్ నగర్ కాలనీలో శనివారం రెవిన్యూ శాఖ ఆధ్వర్యంలో పౌర హక్కుల దినోత్సవాన్ని పురష్కరించుకుని గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం పౌరులందరికీ సమాన హక్కులు కల్పించిందన్నారు. ఎస్సీ, ఎస్టీలకు రక్షణ కల్పించే చట్టాలున్నాయని, వాటి గురించి అవగాహన కలిగి ఉండడం ఎంతో అవసరమన్నారు. బాల్య వివాహాలు సమాజానికి ముప్పని, చిన్నారుల భవిష్యత్ ను నాశనం చేసే దురాచారాన్ని పూర్తిగా నిర్మూలించాలన్నారు. పౌర హక్కులకు భంగం కలిగించడం నేరమని ప్రతి ఒక్కరు ఇతరుల హక్కులలో జోక్యం చేసుకోవద్దన్నారు. కాలనీలో తాగునీరు. రహదారులు, విద్యుత్ సంక్షేమ పథకాల అమలు వంటి సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తాసీల్దార్ కార్యాలయ జూనియర్ సహాయకులు భాగ్యలక్ష్మి, జీపీఓ అల్లావుద్దీన్, వార్డు సభ్యులు మైనం ఉమా అంబేద్కర్, కాలనీ వాసులు పాల్గొన్నారు.