మన పట్టణాలకు కొత్తరూపు రాబోతున్నది. ఏండ్ల క్రితం రూపొందించిన ప్రణాళికలను ప్రస్తుత అవసరాలకు తగ్గట్టు మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. అందుకోసం కొత్త మాస్టర్ ప్లాన్లను సిద్ధం చేస్తున్నది. ఇప్పటికే ఉపగ్రహాల సాయంతో మున్సిపాలిటీల పరిధిలోని ప్రాంతాల వారీగా ఉపరితలం ఎత్తు, పరిస్థితులు, రోడ్లు, ఇండ్లు, డ్రైనేజీ, తాగునీటి పైపులైన్లు, సెల్ టవర్స్, టాయిలెట్స్, రిజర్వాయర్లు, మార్కెట్లు, వైకుంఠధామాలు.. ఇలా ప్రతి అంశాలన్నీ వివరాలు, చిత్రాలతో విభాగాల వారీగా సేకరించి బేస్ మ్యాప్లను తయారుచేసింది. వాటిని ఆధారం చేసుకుని 30 ఏండ్ల భవిష్యత్ అవసరాలకు తగ్గట్టు అధికార యంత్రాంగం కొత్త మాస్టర్ ప్లాన్ను రూపొందించే పనిలో నిమగ్నమైంది. పట్టణాల అభివృద్ధి, సమస్యల పరిష్కారంలో ఈ బేస్ మ్యాప్లే కీలకం కానున్నాయి.
నేరేడుచర్ల, డిసెంబర్ 21 : రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలకు జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టం(జీఐఎస్) ఆధారంగా ఉప్రగహాల కెమెరాలతో అన్ని ప్రాంతాల ఛాయా చిత్రాలను తీశారు. దీని కోసం క్విక్ బర్ట్ శాటిలైట్ ఇమేజినరీ అండ్ సర్వే పరిజ్ఞానాన్ని వినియోగించారు. దీనిలో ఆయా పట్టణాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సేకరించి, పట్టణ పరిధిలో ఏయో ప్రాంతాలు ఎలా ఉన్నాయి, ఎలాంటి పరిమితులున్నాయో విభాగాలవారీగా బేస్ మ్యాపులు సిద్ధం చేశారు.
30 ఏండ్ల అవసరాలు దృష్టిలో పెట్టుకొని..
ఉమ్మడి జిల్లాలోని 19 మున్సిపాలిటీలకు అందించిన బేస్ మ్యాప్ల ఆధారంగా ఆయా పట్టణాల భవిష్యత్తు అవసరాలను దృష్టిలో మాస్టర్ ప్లాన్ను తయారు చేస్తున్నారు. సూర్యాపేట జిల్లాలో నేరేడుచర్ల, హుజూర్నగర్, కోదాడ, సూర్యాపేట, తిరుమలగిరి, నల్లగొండ జిల్లాలో నందికొండ, నల్లగొండ, నకిరేకల్, మిర్యాలగూడ, హాలియా, దేవరకొండ, చిట్యాల, చండూరు, యాదాద్రి భువనగరి జిల్లాలో యాదగిరి గుట్ట, పోచంపల్లి, మోత్కూరు, చౌటుప్పల్, భువనగిరి, ఆలేరు మున్సిపాలిటీల్లో మాస్టర్ ప్లాన్కు సంబంధించిన చర్యలు చేపట్టారు. ఇప్పటికే ఉన్న రోడ్ల పరిస్థితితోపాటు వచ్చే 30 ఏండ్లలో అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ మ్యాపులను తయారు చేస్తున్నారు.
ఆయా మున్సిపాలిటీల్లో ప్రధానంగా ట్రాఫిక్ సమస్యలను తీర్చడంతోపాటు, విస్తరిస్తున్న పట్టణాల అవసరాలకు అనుగుణంగా గృహ, వాణిజ్య అవసరాలు, పరిశ్రమలకు సంబంధించిన ఏరియాల కేటాయింపుపై ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం సైతం ఈ నెలాఖరులోగా అన్ని మున్సిపాలిటీలకు సంబంధించిన మాస్టర్ ప్లాన్ ముసాయిదాలను విడుదల చేసేందుకు చర్యలు చేపడుతున్నది. అందుకు అనుగుణంగా టౌన్ ప్లానింగ్ అధికారులు చర్యలు ప్రారంభించారు. ఇప్పటికే కొన్ని మున్సిపాలిటీల్లో ప్రజలతో సమావేశాలు నిర్వహించడంతోపాటు మ్యాప్లను పరిశీలించి ప్లాన్ను తయారు చేస్తున్నారు.
భవిష్యత్ తరాలకు అనుగుణంగా ప్లాన్
రా్రష్ట్ర ప్రభుత్వం జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టం ఆధారంగా ఉప్రగహాల కెమెరాలతో అన్ని ప్రాంతాల ఛాయా చిత్రాలను తీయించింది. రానున్న 30 సంవత్సరాల్లో కావాల్సిన అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ మ్యాప్ను తయారు చేయిస్న్నుది. మున్సిపాలిటీ పరిధిలో పూర్తి సమాచారాన్ని ఈ మ్యాప్లతో గుర్తించవచ్చు. ఈ నెల చివరిలోపు మాస్టర్ ప్లాన్కు సంబంధించిన పూర్తిస్థాయి నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తాం.
– వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్, నేరేడుచర్ల