భూదాన్పోచంపల్లి, ఆగస్టు 6 : పోచంపల్లి ఇకత్ వస్త్రాలకు మరింత గుర్తింపు తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని మిసెస్ తెలంగాణ మమతాత్రివేది అన్నారు. ఆదివారం భూదాన్పోచంపల్లి టై అండ్ డై అసోసియేషన్ భవనంలో మిసెస్ తెలంగాణ, టై అండ్ డై అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఫ్యాషన్షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వచ్చే నెలలో హైదరాబాద్లోని నోవాటెల్లో జరిగే కార్యక్రమంలో పోచంపల్లి చేనేత వస్త్రాలు ధరించి ఫ్యాషన్ షో చేయబోతున్నట్లు తెలిపారు. భవిష్యత్లో చేనేత వస్త్రాల ప్రదర్శనతో బహుళ ప్రాచుర్యం కల్పించి చేనేత కార్మికులకు ఉపాధి కల్పించేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. నేడు యువత అభిరుచులకు అనుగుణంగా నూతన డిజైన్ల రూపకల్పన, అవసరమైన సలహాలు ఇవ్వనున్నట్లు చెప్పారు. తమ సేవా సంస్థ ద్వారా నిరుపేద చేనేత కార్మికులకు ఆర్థిక సాయం అందజేస్తున్నట్లు తెలిపారు. 2023 మిసెస్ తెలంగాణ పోటీల్లో పాల్గొన్న 30 మందితో కలిసి ఫ్యాషన్ షో చేశామన్నారు. ఖండాంతరాల్లో పోచంపల్లి ఇకత్ వస్త్రాలకు మంచి ఆదరణ లభిస్తున్నట్లు చెప్పారు. ప్రింటెడ్ వస్త్రాలతో చేనేత రంగం సంక్షోభంలో కూరుకుపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. చేనేత పరిశ్రమపై లక్షలాది మంది ఆధారపడి జీవిస్తున్నారని పేర్కొన్నారు. చేనేతకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు శాయశక్తులా కృషి చేయనున్నట్లు తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం చేనేత వస్త్రాలపై విధిస్తున్న ఐదు శాతం జీఎస్టీని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఫ్యాషన్ షోలో పాల్గొన్న పోటీదారులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం పోచంపల్లి చేనేత కార్మికుల గృహాలకు వెళ్లి మగ్గాలపై వస్త్రాల తయారీ, రంగుల అద్దకాన్ని పరిశీలించారు. కార్మికుల జీవన స్థితిగతులు, మారెటింగ్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో టై అండ్ డై అసోసియేషన్ అధ్యక్షుడు తడక రమేశ్, ప్రధాన కార్యదర్శి భారత లవకుమార్, ఉపాధ్యక్షుడు భోగ విష్ణు, పట్టుచీరల ఉత్పత్తిదారుల సంఘ అధ్యక్షుడు రుద్ర శ్రీశైలం, నాయకులు కర్నాటి నరసింహ, గుండు ఉప్పలయ్య, ముసూరి నరసింహ, గంజి బాలరాజు, తోటగిరి ప్రసాద్, సీత లక్ష్మణ్, సీత భవానీశంకర్, కస్తూరి శ్రీనివాస్, చింతకింది రమేశ్, కర్నాటి పురుషోత్తం, మెరుగు శశికళ, గుండు రాజమణి, ఎరవ నీలమ్మ, వ్యాపారస్తులు,
కళాకారులు పాల్గొన్నారు.
చేనేత ఫ్యాషన్ షో..
చేనేతను ప్రోత్సహించే ఉద్దేశంతో మిసెస్ తెలంగాణ మమతా త్రివేది, టై అండ్ డై అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం భూదాన్పోచంపల్లిలో ఫ్యాషన్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు, మోడల్స్ చేనేత వస్ర్తాలతో ఆకట్టుకున్నారు.
-భూదాన్ పోచంపల్లి ఆగస్టు 6