యాదాది, మే 15 : మోటకొండూర్ గ్రామానికి ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్నది. 7, 8 శతాబ్దాల కాలంలో ఈ ప్రాంతంలో యుద్ధాలు జరిగిన ఆనవాళ్లున్నాయి. వీరగల్లులు, రాష్ట్ర కూటులు, కళ్యాణీ చక్రవర్తులు ఈ నేలపై నడయాడారు. శతాబ్దాల చరిత్ర కలిగిన మోటకొండూర్లో పరిశోధకులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి చారిత్రక ఆనవాళ్లు, శాసనాలు, ఆదిమానవుల సమాధులను సైతం గుర్తించారు. విష్ణుకుండినుల కాలంలోని రామలింగేశ్వరాలయం నేటికీ చెక్కు చెదరకపోవడం విశేషం.
యాదాద్రి భువనగిరి జిల్లాలోని మోటకొండూరు ప్రాచీన గ్రామం. ఇక్కడ అప్పట్లోనే పెద్ద ఎత్తున యుద్ధాలు జరిగినట్లు చరిత్ర ద్వారా తెలుస్తున్నది. ఏండ్ల తరబడి కొనసాగిన యుద్ధాల్లో ఎంతో మంది వీరమరణం పొందారు. నవీన శిలాయుగం నాటి ఆదిమానవుల సమాధులు కూడా ఇక్కడ కనిపిస్తాయి. ఈ గ్రామంలో పదుల కొద్ది వీరగల్లులవిగ్రహాలు ఉన్నాయి. వీరగల్లు మీద ఉన్న తెలుగు లిపి కాలం 7,8 శతాబ్దాల నాటిదిగా పరిశోధకులు చెప్తున్నారు.
మొదటి జగదేకమల్ల దేవుడి శాసనం..
మోటకొండూర్ గ్రామాన్ని ఎంతో మంది రాజులు పాలించిన అనవాళ్లున్నాయి. ప్రస్తుతం ఆంజనేయస్వామి ఆలయం ఎదుట ఉన్న రాతికట్టడంపై ఓ శాసనం కనిపిస్తుంది. దీనిని 11వ శతాబ్దంలో కళ్యాణీచాళుక్యుల చక్రవర్తి మొదటి జగదేకమల్ల దేవుడి శాసనంగా చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు.
ఎన్నెన్నో దేవతామూర్తుల విగ్రహాలు..
రామలింగేశ్వరాలయ ప్రాంగణానికి ఈశాన్య ప్రాంతంలో మరో రెండు దేవాలయాలున్నాయి. ఒకటి విశ్వకర్మ మందిరం. మరొకటి అమ్మదేవతల ప్రాంగణం. అర్ధగోళాకారపు గోడలో ఏర్పరిచిన తట్టులో ఐదు శిల్పాలున్నాయి. ఎడమ నుంచి కుడికి ఒక శైవాచార్యుడి విగ్రహం, రెండోది ముంగిస వాహనం, చతుర్భుజి, ఖడ్గం, ఢమరుకం, త్రిశూలం, పానపాత్రలతో ఆసనస్థితిలో అమ్మదేవత, చండిక, నక్కవాహనం, చతుర్భుజి, ఖడ్గం, ఢమరుకం, త్రిశూలం, పానపాత్రలతో ఆసనస్థితిలో చాముండ, నాలుగోది ఏనుగు వాహనం, చతుర్భుజి, ఖడ్గం, ఢమరుకం, త్రిశూలం, పానపాత్రలతో ఎడమపాదం నేలకానించిన ఆసనస్థితిలో ఐరావతి, ఐదోది చతుర్భుజుడు, బలిఖడ్గం, ఢమరుకం, త్రిశూలం, పకాలపాత్రలతో నగ్న భైరవ శిల్పాలున్నాయి.
రాష్ట్ర కూటుల కాలం నుంచి కళ్యాణీ చాళుక్యుల వరకు శక్తిపూజలు, భైరవపూజలు ఉండేవి. ఎక్కడెక్కడైతే జైనం ఉంటుందో అక్కడికి శక్తి దేవతలు, బైరవులు వచ్చారు. ఈ విగ్రహాలు ఆనాటి ప్రజల విశ్వాసాలను ప్రతిఫలించే మూర్తిమత్వాలు, అవిశక్త్యారాధన, భైరవారాధన కోసం అప్పటి వరకు జైన, బౌద్ధ మతాలకు ప్రతిగా, వ్యతిరేకంగా నెలకొల్పిన ఆరాధనాస్థలాలు, అందుకే జైన బసదులు శివాలయాలుగా పరివర్తింపబడ్డాయి.
ఇట్లాంటి మండపాలు చాలా అరుదుగా ఉన్నాయి. వలిగొండ మండలంలోని నాగారం శంకరంగుట్ట వద్ద పంచలింగేశ్వరాలయం ముందు, మెదక్ జిల్లాలోని దుద్దెడ, సిద్దిపేటల్లో ఇటువంటి ద్వార మండపాలను చూడొచ్చు. విష్ణుకుండినుల కాలంలో రామలింగేశ్వరాలయాలు నిర్మించారని, ఈ శివాలయం నిర్మాణం కూడా అతిపురాతనమైనదని చరిత్రకారులు చెబుతున్నారు. కాగా, చాలాసార్లు పునరుద్ధరించిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. అలయానికి అర్ధ మండపం చిన్నదిగా ఉంది. ముఖ మంటప ద్వారానికి ఇరువైపులా పూర్ణకుంభాలున్నాయి. లోపల అర్ధమంటపంలో రంగ మంటపం ఉంది. ఎనిమిది స్తంభాలున్నాయి. అంతరాళద్వారానికి రెండువైపులా సర్పాలు, గదలను ధరించిన రెండు చేతులున్న ద్వార పాలకులుండటం విశేషం. గర్భగుడిలో చతురస్రాకారపు పానవట్టం మీద శివలింగం ప్రతిష్ఠితమై ఉన్నది. గుడి ముందు పూర్తిగా చెక్కని నల్లరాతి నంది విగ్రహం దర్శనమిస్తున్నది. దేవాలయ ప్రాంగణంలో చతురస్రాకారపు పానవట్టం మీద చిన్న శివలింగం, కొన్ని నాగశిల్పాలున్నాయి. దేవాలయ ద్వారానికి ఇరువైపులా ద్వారబంధాలపై కలశాలు జైనమని చెప్పడానికి నిదర్శనం. ఈ గుడిలో శివలింగ ప్రతిష్ఠ తర్వాతికాలంలో జరిగినట్టు తెలుస్తున్నది.
విష్ణుకుండినుల కాలంలోనే ఆలయ నిర్మాణం
విష్ణుకుండినుల కాలంలో మోటకొండూర్ గ్రామంలో రామలింగేశ్వరాలయం నిర్మించారు. అప్పట్లో ఈ ఆలయాన్ని మల్లన్నదేవుడి గుడిగా పిలిచేవారని తెలుస్తున్నది. కాలక్రమంలో రామలింగేశ్వరాలయాన్ని పునరుద్ధరించి వీరగల్లులను శివాలయం ఎదుటచరిత్రలో-మోటకొండూరు ప్రతిష్ఠించారు. సుమారు 12 వీరగల్లులు ఈ శివాలయంలో ఉన్నాయి. ఈ వీరగల్లులపై రాతలను గమనిస్తే 7,8 శతాబ్దాల కాలంనాటి శాసనం. పెద్ద శివాలయం వెనుక మరో చిన్న శివాలయం ఉన్నది. శివాలయ ముందుగా రెండతస్తుల ద్వార మండపం ఉంటుంది.
నవీన శిలాయుగం నాటి సమాధులు…
గ్రామ చరిత్రను పరిశీలించాలన్న లక్ష్యంతో అప్పటి శాసనాలపై దృష్టి సారించాం. చాలా సార్లు మోటకొండూర్ ప్రాంతంలో పరిశోధనలు చేశాం. మోటకొండూర్ గ్రామానికి చారిత్రక నేపథ్యం ఉన్నట్లు శాసనాలు చెబుతున్నాయి. నవీన శిలాయుగం నాటి ఆదిమ మానవుల సమాధులున్నాయి. చారిత్రకకాలంలో ఇక్కడ యుద్ధాలు జరిగి ఉంటాయి. అందుకే ఈ గ్రామంలో పదుల కొద్ది వీరగల్లులున్నాయి. వీరగల్లు మీద ఉన్న తెలుగు లిపి కాలం 7,8 శతాబ్దాల నాటిదిగా భావించవచ్చు. విష్ణుకుండినుల కాలంలో రామలింగేశ్వరాలయాలు నిర్మించారు. ఈ శివాలయం నిర్మాణం కూడా అతిపురాతమైనది. కాగా, చాలాసార్లు పునరుద్ధరించిన ఆనవాళ్లున్నాయి. గ్రామ శివారుల్లో ఒక దగ్గర పాదాలు, మరో దగ్గర తల ఇలా.. విగ్రహాలు విసిరేసినట్టుగా ఉన్నాయి. పులివేట వీరగల్లులు సైతం గ్రామంలో అనేకం ఉన్నాయి. రాకాసి బొందలు, రాకాసి గూళ్లు, దెయ్యం బొందలు వంటి ఆదిమమానవుల సమాధులు ఎన్నో ఉన్నాయి. పెద్ద పెద్ద నల్లగుండ్లతో సమాధులు ఉన్నాయి.
– శ్రీరామోజు హరగోపాల్, కొత్త తెలంగాణ పరిశోధకుడు