సూర్యాపేట పట్టణంలో పిల్లలు ఆడుకునేందుకు మోడ్రన్ పార్కులు అందుబాటులోకి వచ్చాయి. అందమైన గ్రీనరీతోపాటు ఊయల, జారుడు బండ, బ్యాలెన్సింగ్ బెంచీలు, వాకింగ్ ట్రాక్, పలు జంతువుల ఆకృతుల్లో ఏర్పాటు చేసిన బెంచీలు, రంగుల రాట్నం, వాటర్ ఫౌంటెయిన్ ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. రూ.1.61కోట్లతో పది పాత పార్కులను పునరుద్ధరించగా.. రూ.4కోట్లతో నాలుగు కొత్త పార్కులు ఏర్పాటు చేశారు.
బొడ్రాయిబజార్, ఏప్రిల్ 29 : నాడు ఆదివారం వస్తే ఆటవిడుపు కోసం కుటుంబంతో కలిసి దూర ప్రాంతాలకు వెళ్లి ఆనందం కొని తెచ్చుకునే సూర్యాపేట పట్టణ ప్రజలకు నేడు వారి ప్రాంతాల్లోనే పైసా ఖర్చు లేకుండా అంతకు మించి ఆహ్లాదం, ఆనందాన్ని అందిస్తున్నాయి మోడ్రన్ పార్కులు. సామాన్య, మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో హైదరాబాద్ మహానగరానికి దీటుగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో పలు పార్కులను తీర్చిదిద్దారు. ఇటీవల అందుబాటులోకి వచ్చిన ఈ పార్కులు చిన్నారులకు ఆటవిడుపు, పెద్దలకు మానసిక ప్రశాంతత అందిస్తున్నాయి.
దూర ప్రాంతాలకు వెళ్లలేని పేద, మధ్య తరగతి పిల్లలకు అందమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆటలు ఆడుకునేలా మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి మోడ్రన్ పార్కులు ఏర్పాటు చేశారు. అందమైన గ్రీనరీతోపాటు ఆట వస్తువులైన ఊయల, జారుడుబండ, బ్యాలెన్సింగ్ బెంచీలు, వాకింగ్ ట్రాక్, పలు జంతువుల ఆకృతుల్లో ఏర్పాటు చేసిన బెంచీలు, రంగులరాట్నం, రాత్రి వేళ రంగురంగుల దీపపు కాంతుల్లో ఫౌంటెయిన్ ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. వాటితో చిన్నారుల ఆనందం అంతాఇంతా కాదు. పట్టణంలోని పలు వార్డుల్లో కోట్లాది రూపాయలతో మోడ్రన్ పార్కులను అందంగా తీర్చిదిద్దడంతో పట్టణ ప్రజలు మంత్రికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
అందుబాటులోకి కొత్త పార్కులు
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పాత, కొత్త పార్కులను సకల హంగులతో తీర్చిదిద్దారు. రూ.1.61కోట్లతో పది పాత పార్కులను పునరుద్ధరించగా.. రూ.4కోట్లతో నాలుగు కొత్త పార్కులు ఏర్పాటు చేశారు. అమృత్, పట్టణ ప్రణాళిక నిధులతో వీటిని సుందరంగా తీర్చిదిద్దారు. పాత పార్కులతోపాటు కొత్త పార్కులైన ఇందిరమ్మ కాలనీ 1, 2, 3, సైనిక్పురి, గణేశ్నగర్, అంజనాపురి కాలనీ, అంబేద్కర్ కాలనీ, కోటమైసమ్మ పార్కు, హనుమాన్నగర్, ఎన్టీఆర్ కాలనీ, తాళ్లగడ్డ పార్కులను ఆహ్లాదకరంగా తీర్చిదిద్దారు. ఈ పార్కుల్లో అన్ని హంగులతో సకల సౌకర్యాలు కల్పించారు. ఒక హబ్, పచ్చని చెట్లు, బెంచీలు, వాకింగ్ ట్రాక్, ఎల్ఈడీ విద్యుత్ సౌకర్యంతోపాటు ఫౌంటెయిన్లను ఏర్పాటు చేశారు. 48వ వార్డు కోటమైసమ్మ బజార్లో ఏర్పాటు చేసిన మోడ్రన్ పార్కులో ప్రత్యేకంగా ఫుట్బాల్ కోర్టును, అంజనాపురి కాలనీ పార్కులో జిమ్ పరికరాలు ఏర్పాటు చేశారు. ఈ పార్కులు పనులు పూర్తి చేసుకొని అందుబాటులోకి రావడంతో ఆయా ప్రాంతాల ప్రజలు ఉదయం, సాయంత్రం సరదాగా గడుపుతూ తమ పిల్లలను ఆడిపిస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
పాఠశాల నుంచి వచ్చి పార్కుకే..
మా ప్రాంతంలో మంచి పార్కు ఏర్పాటు చేశారు. మొన్ననే మంత్రి జగదీశ్రెడ్డి వచ్చి ప్రారంభించిండు. ఆ రోజు నుంచి పార్కులో మా దోస్తులతో కలిసి ఆడుకుంటున్నా. రోజూ సాయంత్రం పాఠశాల నుంచి రాగానే హోంవర్క్ చేసుకొని పార్కుకు వెళ్తాను. అక్కడ ఆట వస్తువులతోపాటు రాత్రి పూట రంగురంగుల లైట్లతో ఫౌంటెయిన్ ఎంతో అందంగా ఉంది. ఈ పార్కు నాకు, నా దోస్తులకు ఎంతో నచ్చింది.
– చేపూరి రఘురాం, 7వ తరగతి విద్యార్థి, మానసనగర్
వ్యాయామం చేసేందుకు బాగుంది
మా కాలనీలో జిమ్ పరికరాలతో కూడిన అమృత్పార్కు ఏర్పాటు చేయడం సంతోషకరం. నేను రోజూ ఉదయం, సాయంత్రం మా ప్రాంతంలోని రోడ్ల వెంట వాకింగ్కు వెళ్తుంటాను. ఇటీవల మా కాలనీలో పార్కు ప్రారంభించారు. అక్కడే జిమ్ వస్తువులు ఉన్నాయి. మా పిల్లలను ఆడిపించేందుకు రోజూ పార్కుకు వస్తాను. వారు ఆడుకుంటున్న సమయంలో నేను వ్యాయామం చేస్తున్నా. పార్కులో ఏర్పాటు చేసిన వాకింగ్ ట్రాక్పై నడక కూడా సాగిస్తున్నా. పార్కు ఏర్పాటు చేసిన మంత్రి జగదీశ్రెడ్డికి ధన్యవాదాలు.
– వడిగ కవిత, అంజనాపురి కాలనీ