నల్లగొండ, మార్చి 11 : ‘రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కుల గణన చేస్తాం.. దాని ఆధారంగానే స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ అమలు చేసి 23,500 మందికి పదవులు వచ్చేలా చర్యలు తీసుకుంటాం. సబ్ ప్లాన్ అమలు చేసి ఏడాదికి రూ.20వేల కోట్లు కేటాయిస్తాం. అసెంబ్లీలో బీసీల ఆరాధ్య దైవం మహాత్మా జ్యోతీరావుపూలే విగ్రహం ఆయన జయంతిలోపు ఏర్పాటు చేస్తాం’ అని కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో చేసిన బీసీ డిక్లరేషన్కు వెంటనే అమలు చేయాలని బీసీ సంఘాల నేతలు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు.
నల్లగొండలోని చిన్న వెంకట్రెడ్డి ఫంక్షన్ హాల్లో సోమవారం బీసీల హక్కుల సాధన కోసం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశం ఈ మేరకు నినదించారు. యునైటెడ్ పూలే ఫ్రంట్, భారత జాగృతి సంయుక్తంగా నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్, సాహితీవేత్త జూలూరి గౌరీశంకర్ అధ్యక్షత వహించగా.. భారత జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
మూడున్నర గంటల పాటు కొనసాగిన సమావేశంలో 28 మంది ప్రభుత్వానికి సూచనలు చేశారు. బీసీల హక్కుల సాధన కోసం ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. ప్రధానంగా కామారెడ్డిలో రేవంత్రెడ్డి ఆధ్వర్యంలో ప్రకటించిన బీసీ డిక్లరేషన్ను అమలు చేయాలని ప్రభుత్వంపై తేవాలని, రేవంత్ సర్కార్ పట్టించుకోకపోతే అవసరమైతే డిల్లీ వరకు తీసుకువెళ్లాలని ఎమ్మెల్సీ కవిత బీసీ సంఘాల నేతలకు పిలుపునిచ్చారు.
వచ్చే 11న బీసీల బాపూ పూలే విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టి కామారెడ్డిలో ప్రకటించిన బీసీ డిక్లరేషన్ను అమలు చేయాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దేశంలో బీసీలు ఎక్కువగా ఉన్నప్పటికీ కేంద్రంలో తొలుత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ మొదలు నేటి బీజేపీ వరకు కుల గణన చేయకపోవడం వల్ల బీసీల్లో ఎంతమంది ఉన్నారు.. వారికి ఎంత రిజర్వేషన్ ఇవ్వాలనే స్పష్టత లోపించి ఆ వర్గాలకు అన్యాయం జరుగుతున్నదన్నారు. తొలుత 1931లో కుల గణన చేస్తే, ఆ తర్వాత 1996, 2006లో కాంగ్రెస్ ప్రభుత్వం కుల గణన చేస్తామని రూ.4,500 కోట్లు ఖర్చు చేసి అగ్రవర్ణాల ఒత్తిడితో ఆ లెక్కలు బయటికి చెప్పలేదని తెలిపారు.
బీసీల్లో మహిళలకు ఉప కోటా అని, మహిళలను మొత్తంగా బీసీ కింద పరిగణించాలనే సాకుతో చివరికి మండలి కమిషన్ను కూడా అమలు చేయకుండా ఉంటే ప్రస్తుతం కొన్ని రాష్ర్టాల్లో ప్రాంతీయ పార్టీలు కుల గణన చేస్తున్నాయని చెప్పారు. బీసీలకు రాజ్యాధికారం రావాలన్నా, విద్య, ఉద్యోగావకాశాల్లో న్యాయం జరుగాలన్నా కులగణన తప్పనిసరి అని వివరించారు. బహుజనులకు న్యాయం జరుగాలని పూలే ఎంతో పోరాటం చేశారని, అలాంటి మహోన్నత వ్యక్తి విగ్రహాన్ని అసెంబ్లీలో పెడుతామని ప్రకటించి ఎందుకు దాట వేస్తున్నారని కాంగ్రెస్ను ప్రశ్నించారు.
అసెంబ్లీలో పూలే విగ్రహం పెట్టిన తర్వాత బీసీ బిల్లు పెట్టి చట్టం చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు చేసిన తీర్మానాలతో ఉపయోగం లేదని, దాన్ని చట్టం చేసి ఆ తర్వాత ఇచ్చిన మాటకు అనుగుణంగా బీసీ సబ్ప్లాన్కు ఏటా రూ.20 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. కుల గణన అనంతరం వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో భారత జాగృతి నల్లగొండ జిల్లా అధ్యక్షుడు బోనగిరి దేవేందర్,
నల్లగొండ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చీర పంకజ్యాదవ్, యునైటెడ్ పూలే ఫ్రంట్ కో కన్వీనర్లు రాజారాం యాదవ్, బోల్ల శివశంకర్, ఎంబీసీ రాష్ట్ర నాయకులు కొండూరు సత్యనారాయణ, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు దుడుకు లక్ష్మీనారాయణ, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మహేశ్గౌడ్, శ్రీకాంత్ గౌడ్, మామిడి పద్మ, నాగభూషణం, లొడంగి గోవర్ధన్, వడ్డెబోయిన సైదులు, ఎంబీసీ రాష్ట్ర కన్వీనర్ నిమ్మల వీరన్న, దత్తాత్రి, నారబోయిన భిక్షం, సింగం లక్ష్మి, కోండ్ర స్వరూప, పద్మావతి గౌడ్, రూపని నర్సింహ, మెరుగు గోపీనాథ్ పాల్గొన్నారు.
బీసీ రౌండ్ టేబుల్ సమావేశానికి వచ్చిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ముందుగా క్లాక్ టవర్ సెంటర్లో మహాత్మా జ్యోతీరావు పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మున్సిపల్ ఆఫీస్ సమీపంలో ఉన్న జయశంకర్ సర్ విగ్రహానికి పూల మాల వేశారు. జడ్పీ చైర్మన్ బండ నరేందర్రెడ్డి ఆమె బొకే అందజేసి స్వాగతం పలికారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, నాయకులు కరీంపాషా, మేడె రాజీవ్ సాగర్, బోనగిరి దేవేందర్, అభిమన్యు శ్రీనివాస్, సుంకరి మల్లేశ్గౌడ్ పాల్గొన్నారు.
ఎన్నికల ముందు రాజకీయ పార్టీలు బీసీలకు హామీలు ఇచ్చి ఆ తర్వాత వదిలేయడం సరికాదు. బీఆర్ఎస్ ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చిన హామీకి అనుగుణంగా ముస్లింలకు 12శాతం రిజర్వేషన్ అమలు చేయడంతోపాటు కుల గణన చేయాలని కేంద్రానికి 2015లో అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి నివేదించింది. బీసీలు ఆర్థికంగా ఎదుగాలంటే ప్రధానంగా విద్యే మూలమని గమనించిన కేసీఆర్ రాష్ట్రంలో 1,061 గురుకులాలు ఏర్పాటు చేశారు. ఇయ్యాల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కామారెడ్డిలో ప్రకటించినట్లు బీసీ డిక్లరేషన్ను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఎన్నికల తర్వాత అమలు చేస్తామన్న 42 శాతం రిజర్వేషన్, కుల గణన, బీసీ సబ్ ప్లాన్ అమలు చేయాలి. లేదంటే రేవంత్ ప్రభుత్వాన్ని బీసీలు ఎండగట్టి దించే రోజు వస్తది.
-జూలూరి గౌరీశంకర్, తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్
అధికారంలోకి వచ్చిన వెంటనే కుల గణన చేసి బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినందున ఈ ఎన్నికల్లోపే పూర్తి చేయాలి. బీసీలు రాజకీయంగా ఎదుగాలంటే జనాభా తగ్గట్లు రిజర్వేషన్లు ఉండకపోతే అన్యాయం జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే బీసీల ఆగ్రహాన్ని చూడాల్సి వస్తది. బీసీల పట్ల కనీస ఆలోచన చేయని సీఎం ఇప్పటి వరకు బీసీ శాఖకు మంత్రినే పెట్టలేదు. కుల గణన చేస్తే అసలు ఎవరు ఎంత మంది ఉన్నారో తెలుస్తుంది.
– గట్టు రాంచందర్రావు, యునైటెడ్ పూలే ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్
బీసీలు రాజకీయంగా, ఆర్థ్దికంగా ఎదుగాల్సి ఉంది. రాష్ట్రంలో బీసీలు ఎంత మంది ఉన్నారో లెక్క తేలాలంటే కుల గణన చేయాల్సిందే. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీనే అడుగుతున్నాం. బీసీల ఓట్లు లేకుండా రేవంత్రెడ్డి సీఎం అవలేదు. అందుకే ఇచ్చిన హామీని అమలు చేయాలి. ఏటా రూ.20వేల కోట్ల చొప్పున ఐదేండ్లు లక్ష కోట్లు బీసీ సబ్ ప్లాన్లో కేటాయిస్తే బీసీలు ఆర్థికంగా ఎదిగే అవకాశం ఉన్నందున వెంటనే అమలు చేయాలి.
– నోముల భగత్, నాగార్జున సాగర్ మాజీ ఎమ్మెల్యే
నాటి ధర్మభిక్షం నుంచి నేటి కేసీఆర్ వరకు బీసీల అభివృద్ధి కోసం ఎంతో ప్రాధాన్యం ఇచ్చి వారు రాజకీయంగా, ఆర్థికంగా ఎదిగేందుకు దోహదపడ్డారు. గత ప్రభుత్వంలో రాష్ట్రవ్యాప్తంగా 54 కార్పొరేషన్ పదవులు ఇస్తే అందులో సగం మంది బీసీలే ఉన్నారు. నిత్యం బీఆర్ఎస్పై నిప్పులు చెరుగుతూ కల్వకుంట్ల కుటుంబ పార్టీ అని విమర్శలు చేసే రేవంత్రెడ్డి తన మంత్రివర్గంలో, సలహాదారుల్లో ఎందుకు రెడ్లనే పెట్టుకున్నారు.
– దూదిమెట్ల బాలరాజు యాదవ్, గొర్రెలు, మేకల అభివృద్ధి కార్పొరేషన్ మాజీ చైర్మన్
తెలంగాణ ఉద్యమంతోపాటు మన సంస్కృతి, సంప్రదాయాల కోసం పోరాటం చేసిన జాగృతి వ్యవస్థాపకురాలు కవిత ఆ తర్వాత ఢిల్లీలో పోరాటం చేసి మహిళా బిల్లు సాధించారు. ఇప్పుడు బీసీ బిల్లును చట్టబద్ధం చేయాలని పోరాటం చేయడం సంతోషంగా ఉన్నది. నల్లగొండ జిల్లాలో ఎంతో మంది రెడ్లను ఓడించి బీసీలు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. అలాంటి నల్లగొండ నుంచి ఈ పోరాటం మొదలు కావాల్సి ఉంది.
– రాంచంద్రనాయక్, ట్రైకార్ మాజీ చైర్మన్
70 ఏండ్లుగా బీసీలం రాజ్యాధికారం కోసం పోరాటం చేస్తూనే ఉన్నాం. ఇకనైనా బీసీలు హక్కుల సాధన కోసం మౌనం వీడాలి. ఇయ్యాల బీసీలు తెలంగాణలో ఆత్మగౌరవంతో ఉన్నత విద్యను పొందుతున్నారంటే దానికి కారణం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. రాష్ట్రంలో 1,061 గురుకులాలు ఏర్పాటు చేసిన కేసీఆర్ నల్లగొండ జిల్లాలో 76 గురుకులాలు ఏర్పాటు చేసి ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ బిడ్డలకు నాణ్యమైన విద్యను అందిస్తున్నారు. జిల్లాకో మెడికల్ కళాశాల ఏర్పాటు చేయడం వల్ల ఇయ్యాల 2వేల నుంచి ఎనిమిది వేల మెడికల్ కళాశాలలు రాష్ట్రంలో ఏర్పాటు కావడానికి కారణం కేసీఆర్.
– పల్లె రవికుమార్, కల్లుగీత కార్పొరేషన్ మాజీ చైర్మన్