నల్లగొండ ప్రతినిధి, మే26(నమస్తే తెలంగాణ) : వరంగల్ -ఖమ్మం- నల్లగొండ శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నికకు సర్వం సిద్ధమైంది. సోమవారం ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. ఆదివారం సాయంత్రమే ఆయా జిల్లా కేంద్రాల్లోని డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుంచి పోలింగ్ సిబ్బంది సామగ్రి పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. సోమవారం ఉదయం 6 గంటల నుంచి పోలింగ్ ప్రక్రియ మొదలు పెట్టి 8 గంటల వరకు సర్వం సిద్ధంగా ఉంటారు. మొత్తం 12 జిల్లాలో పరిధిలో విస్తరించి ఉన్న నియోజకవర్గంలో 605 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మున్సిపల్ పట్టణాలతోపాటు ఓటర్ల సంఖ్యను భట్టి ఆయా మండల కేంద్రాల్లో మాత్రమే పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
ఎన్నికల బరిలో మొత్తం 52 మంది అభ్యర్థులు రంగంలో ఉండగా నియోజకవర్గ పరిధిలో 4,63,839 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. నియోజకవర్గం మొత్తం ఓటర్లలో పురుషులు 2,88,189మంది, మహిళలు 1,75,645 మంది, ట్రాన్స్ జెండర్లు ఐదుగురు ఉన్నారు. ఇక ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 1,66,448 మంది ఓటర్లు ఉండగా అందులో నల్లగొండ జిల్లాలో 80,871 మంది, సూర్యాపేట జిల్లాలో 51,497 మంది, యాదాద్రి భువనగిరి జిల్లాలో 34,080 మంది ఉన్నారు. పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను కల్పించారు.
ముఖ్యంగా ఇతర ఎన్నికలకు ఎమ్మెల్సీ ఎన్నికలకు తేడా ఉందని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రాధాన్యత క్రమంలో ఓటర్లు ఓటు వేయాల్సి ఉండడంతో అందుకు అనుగుణంగా ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద పోస్టర్తోపాటు, ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల ఆవరణలో టెంట్స్, సరైన లైటింగ్, బయట మెడికల్ టీమ్స్ లాంటి మౌలిక వసతులు కూడా కల్పించారు. పోలింగ్ స్టేషన్ పరిధిలో అవాంఛనీయ ఘటనలు జరుగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. పోలింగ్ కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ కూడా అమలులో పెట్టారు. పోలింగ్ పూర్తి సజావుగా నిర్వహించేలా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన ప్రకటించారు. పోలింగ్కు పటిష్టమైన పోలీస్ బందోబస్త్ చర్యలు చేపట్టినట్లు నల్లగొండ జిల్లా ఎస్పీ చందనా దీప్తి తెలిపారు.