కట్టంగూర్, డిసెంబర్ 30 : ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేసేందుకు ప్రజా పాలన కార్యక్రమం చేపట్టినట్లు నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. శనివారం నకిరేకల్ మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో, చందుపట్ల, మర్రూర్, కట్టంగూర్ మండలం అయిటిపాముల, నార్కట్పల్లి మండలం లింగోటం, చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామాల్లో జరిగిన ప్రజాపాలన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా పాలన ద్వారా ఐదు పథకాల అమలుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు.
అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఆరు గ్యారెంటీలు అందుతాయన్నారు. ఆయా కార్యక్రమాల్లో నకిరేకల్, చిట్యాల మున్సిపల్ చైర్మన్లు శ్రీనివాస్, కోమటిరెడ్డి చిన వెంకట్రెడ్డి, కమిషనర్ బాలాజీ, ప్రత్యేకాధికారులు పాండు నాయక్, గౌతమ్రాజ్, విద్యాసాగర్, కట్టంగూర్ ఎంపీపీ జెల్లా ముత్తి లింగయ్య, ఎంపీడీఓ పోరెళ్ల సునీత, రమేశ్ దీన్దయాల్, యాదగిరి, తాసీల్దార్లు గుగులోతు ప్రసాద్నాయక్, డొంకెన స్వప్న, పద్మ, ఎంపీఓ మహ్మద్ అథర్ పర్వేజ్, సర్పంచులు , ఎంపీటీసీలు పాల్గొన్నారు.
నియోజకవర్గంలోని రామన్నపేట, చిట్యాల, నార్కట్పల్లి మండలం ఏపీ లింగోటం, ఔరవాణి, పల్లెపహాడ్, షాపల్లి, కట్టంగూర్ మండలం ఈదులూరు, అయిటిపాముల, నకిరేకల్ మండలం చందుపట్ల, మర్రూర్, కేతేపల్లి మండల భీమారం, బొప్పారం, చిట్యాల మండలం పెద్దకాపర్తి, గుండ్రాంపల్లి గ్రామాల్లో శనివారం మూడవ రోజు ప్రజాపాలన గ్రామ సభలు నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. నియోజకవర్గంలోని అరు మండలాల్లో 12,450 దరఖాస్తులు స్వీకరించినట్లు అధికారులు తెలిపారు.
మిర్యాలగూడ : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా అభయహస్తం ఆరు గ్యారెంటీ పథకాలకు గానూ అర్హులైన ప్రతి ఒక్కరి నుంచి దరఖాస్తులను స్వీకరిస్తామని ఎమ్మెల్యే బీఎల్ఆర్ అన్నారు. శనివారం మిర్యాలగూడ, దామరచర్లలో నిర్వహించిన ప్రజాపాలన గ్రామ సభల్లో ఆయన పాల్గొని లబ్ధిదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. దరఖాస్తు ఫారాలు ప్రభుత్వమే ఉచితంగా అందిస్తున్నందున ఎక్కడా కొనాల్సిన పనిలేదన్నారు.
ఎవరైనా దరఖాస్తు ఫారాలు అమ్మినట్లు తెలిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. రేషన్కార్డు లేని వారు సైతం పథకాలకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ చెన్నయ్య, మున్సిపల్ కమిషనర్ పూర్ణచందర్రావు, మెప్మా పీడీ కరుణాకర్, నాయకులు నూకల వేణుగోపాల్రెడ్డి, గాయం ఉపేందర్రెడ్డి, గుంజ చంద్రకళశ్రీనివాస్, గంధం రామకృష్ణ, కోడిరెక్క ఇంద్రకుమార్, బక్కయ్య, అబ్దుల్లా, విష్ణు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
నల్లగొండ : నియోజకవర్గంలో శనివారం నల్లగొండ మున్సిపాలిటీతో పాటు కనగల్, తిప్పర్తి, నల్లగొండ మండలాల్లో గ్రామ సభలు నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. శనివారం నియోజకవర్గం మొత్తంలో 10,195 దరఖాస్తులు రాగా మూడు రోజుల్లో మొత్తంగా 22,383 దరఖాస్తులు వచ్చాయి. తిప్పర్తిలో ఇన్చార్జి కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, జిల్లా కేంద్రంతో పలు మండలాల్లో ఆర్డీఓ రవి పర్యటించి దరఖాస్తుల స్వీకరణను పరిశీలించారు. మున్సిపల్ కమిషనర్, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
దేవరకొండ : నియోజకవర్గంలో శనివారం ప్రజాపాలన గ్రామ సభలు నిర్వహించిన అధికారులు ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. దేవరకొండ మున్సిపాల్టీలో 4087 దరఖాస్తులు అందినట్లు కమిషనర్ వెంకటయ్య తెలిపారు. దేవరకొండ మండం కొండబీమనపల్లి, ముదిగొండ, మైనంపల్లి, పడ్మట్పల్లి, తాటికోల్ గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి 687 దరఖాస్తులు స్వీకరించినట్లు ఎంపీడీఓ శర్మ తెలిపారు. కొండమల్లేపల్లి మండంలోని గుమ్మడవెల్లి, దోనియాల, చెన్నంనేని పల్లి గ్రామాల్లో గ్రామ సభల ద్వారా 981 దరఖాస్తులు వచ్చినట్లు ఎంపీడీఓ బాలరాజ్రెడ్డి తెలిపారు. చింతప్లలి మండంలోని తీదేడులో, చందంపేట, నేరేడుగొమ్మ, పీఏపల్లి, డిండి మండలంలోని పలు గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.
హాలియా : నాగార్జునసాగర్ నియోజకవర్గంలో శనివారం హాలియా, నందికొండ మున్సిపాలిటీతో పాటు ఆరు మండలాల్లోని పలు గ్రామాల్లో ప్రజాపాలన గ్రామ సభలు నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అనుముల మండలంలోని చల్మారెడ్డిగూడెం, మధారిగూడెం, కొట్టాల, త్రిపురారం మండలం దుగ్యాపల్లి, సత్యనారాయణపురం, జి.అన్నారం, మర్రిగూడెం, నిడమనూరు మండలం సూరేపల్లి, నందికొండవారిగూడెం, వడ్డెరగూడెం, పార్వతీపురం, గుర్రంపోడు మండలంలోని చామలోనిబావి, కాల్వపల్లి, జూనూతల, చింతగూడెం, ఆమలూరు, తిరుమలగిరిసాగర్ మండలం జువ్విచెట్టుతండా, నేతాపురం, చిలుకాపురం, సఫావత్తండా, ఎల్లాపురం గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ అనుముల పాండమ్మాశ్రీనివాస్రెడ్డి, జడ్పీటీసీ భరతీభాస్కర్నాయక్, తాసీల్దార్ జయశ్రీ, గాజుల ప్రమీల, జంగాల కృష్ణయ్య, యాదగిరి, తౌఫిక్అహ్మద్, ఎంపీడీఓ గోళ్ల లక్ష్మి, అలువేలు మంగమ్మ, ప్రమోద్కుమార్, పల్ల్లెబోయిన రామలింగయ్య, ఖాజ అజ్గర్అలీ, శ్రీపాద సుధాకర్, దుర్గాప్రసాద్, సర్పంచులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
మునుగోడు : మండలంలోని చొల్లేడు, దుబ్బకాల్వ, రత్తిపల్లి గ్రామాల్లో నిర్వహించిన గ్రామ సభల్లో జడ్పీటీసీ నారబోయి స్వరూపరాణి పాల్గొని దరఖాస్తులు స్వీకరించారు. మర్రిగూడ మండలంలోని కొండూరు, మేటిచందాపురం, తమ్మడపల్లి, సరంపేట గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి దరఖాస్తులు స్వీకరించారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.