మేళ్లచెర్వు, అక్టోబర్ 26 : ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఇంటింటికి వివరించాలని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి సూచించారు. మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన మండల బూత్ కమిటీ సభ్యుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధి దేశంలో మరెక్కడా జరగలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 40ఏండ్లలో చేసిన అభివృద్ధిని నాలుగేండ్లలో చేసి చూపించామని పేర్కొన్నారు. కార్లలో డబ్బులు తగులబెట్టిన చరిత్ర ఉత్తమ్దని విమర్శించారు.
దళిత బంధు, రైతు బంధు పథకాలను నిలిపివేయాలని ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయడం దారుణమన్నారు. పదేళ్లుగా అధికారానికి దూరమైన కాంగ్రెసోళ్లు ఎలాగైనా అధికారంలోకి వచ్చి అడ్డంగా సంపాదించాలని చూస్తున్నారన్నారు. ఎన్నికల దాకా కార్యకర్తలు కష్టపడి పనిచేసి పార్టీని తిరిగి అధికారంలోకి వచ్చేలా కృషి చేయాలన్నారు. సమావేశంలో పార్టీ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సూరిశెట్టి బసవయ్య, బోగాల బాలవెంకట్రెడ్డి, స్థానిక సర్పంచ్ శంకర్రెడ్డి, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు ఇమ్రాన్, డీసీసీబీ డైరెక్టర్ వేములూరి రంగాచారి, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ జల్లేపల్లి వెంకటేశ్వర్లు, హుజూర్నగర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రామలింగారెడ్డితో పాటు పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
గరిడేపల్లి : రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి సాయమందించి ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఉదారత చాటుకున్నారు. వెంకట్రామాపురం గ్రామానికి చెందిన కుర్ర రాంబాబు ద్విచక్ర వాహనంపై అబ్బిరెడ్డిగూడెం రోడ్డు నుంచి ప్రధాన రహదారి పైకి రాగా అదే సమయంలో అప్పన్నపేటకు చెందిన నందిపాటి నవీన్ బైక్ వెనుక ఢీకొంది. దీంతో రెండు బైక్లపై ఉన్న ముగ్గురికి గాయాలయ్యాయి. ఆ సమయంలో అటుగా వెళ్తున్న ఎమ్మెల్యే సైదిరెడ్డి సంఘటనను చూసి గాయపడిన వారిని పరామర్శించారు. అనంతరం తన సొంత వాహనంలో గాయపడిన వారిని ఎక్కించుకుని హుజూర్నగర్లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యసేవలు అందించాలని వైద్యాధికారులను ఫోన్లో ఆదేశించారు.
పాలకవీడు, అక్టోబర్ 26 : ఆంధ్రా ప్రాంతానికి పత్తి ఏరేందుకు వెళ్తున్న కూలీల ఆటో మండలంలోని జాన్పహాడ్ గ్రామ శివారులో గురువారం బోల్తాపడింది. ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. ఎస్ఐ లింగయ్య తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని అలింగాపురం గ్రామానికి చెందిన 13మంది వ్యవసాయ కూలీలు అదే గ్రామానికి చెందిన అశోక్ ఆటోలో ఆంధ్రాలోని పులిపాడు గ్రామంలో పత్తి ఏరేందుకు బయల్దేరారు. జాన్పహాడ్ గ్రామ శివారులో మాలమలుపు వద్ద ఆటో ముందు టైర్ పంక్చర్ కావడంతో అదుపు తప్పి బోల్తా పడడంతో పలువురు కూలీలకు చిన్నపాటి గాయాలయ్యాయి. గాయపడిన వారికి స్థానికుల సాయంతో ప్రథమ చికిత్స చేసి వారి ఇండ్లకు పంపినట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.