నేరేడుచర్ల, ఏప్రిల్ 7 : కుల, మతాల మధ్య చిచ్చు పెట్టడంతోపాటు దుర్మార్గమైన చర్యలకు పాల్పడుతున్న కేంద్రంలోని బీజేపీ సర్కారును తరిమికొట్టాలని హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి పిలుపునిచ్చారు. గరిడేపల్లి మండలంలోని కీతవారిగూడెంలో శుక్రవారం నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ విజన్ ఉన్న నాయకుడని, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టడంతోపాటు అభివృద్ధిలో దేశంలోనే నంబర్ వన్గా నిలిపారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం రాక ముందు, వచ్చిన తరువాత పరిస్థితి ఎలా ఉందో ప్రజలు గమనించాలని సూచించారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు విజన్ లేదని, గత ప్రభుత్వాల హయాంలో విద్యుత్ విషయంలో రైతులు ఎలా గోసపడ్డారో చూశామని పేర్కొన్నారు. వ్యవసాయానికి నిరంతర ఉచిత విద్యుత్తోపాటు రెండు పంటలకు సాగు నీరందిస్తున్న ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని చెప్పారు. మన పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు.
ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా తీర్చిదిద్దారని, గ్రామాలు సుందరంగా రూపుదిద్దుకున్నాయని తెలిపారు. అభివృద్ధిని అడ్డుకునేందుకు ఉత్తమ్కుమార్రెడ్డి కోర్టుల్లో కేసులు వేశారని విమర్శించారు. కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాల్లో ఉత్తమ్ దంపతులు 25ఏండ్లలో 30 మందికి సీఎం సహాయ నిధి ఇప్పిస్తే.. మనం మూడున్నరేండ్లలోనే గ్రామానికి వంద ఇప్పించామని చెప్పారు. దేశంలో 20 గ్రామ పంచాయతీలకు ఉత్తమ అవార్డులు వస్తే.. వాటిల్లో 19 మన రాష్ర్టానికే వచ్చాయన్నారు. తాను మంచి చేయడం కోసమే రాజకీయాల్లోకి వచ్చానని, నియోజకవర్గ ప్రజలందరూ తన కుటుంబ సభ్యులేనని పేర్కొన్నారు. బీజేపీ చిల్లర రాజకీయాలతో విద్యార్థుల భవిష్యత్ను ఆగం చేయాలని పేపర్ లీకేజీ చేసిందన్నారు. పదవులు చచ్చిపోయే వరకు ఉండవని, మనం చేసిన అభివృద్ధి మాత్రమే శాశ్వతంగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. రైతులకు ఏ సమస్య వచ్చినా తనకు వెంటనే ఫోన్ చేయాలన్నారు. మనం చేసిన అభివృద్ధిని చూసి ఓట్లు అడిగేందుకు ప్రతిపక్షాలు భయపడే పరిస్థితి ఉన్నదని.. అభివృద్ధి, సంక్షేమ పథకాలను గడపగడపకూ వెళ్లి వివరించాలని పార్టీ శ్రేణులకు సూచించారు.
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు చేస్తున్న అసత్య ప్రచారాలను సోషల్ మీడియా మిత్రులు తిప్పికొట్టాలన్నారు. పార్టీ శ్రేణులు కలిసికట్టుగా పనిచేసి సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని, బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకోవాలని సూచించారు. అంతకుముందు కీతవారిగూడెం నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు. సమావేశం ప్రారంభంలో గ్రామాల్లో జరిగిన అభివృద్ధి, రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై ఆయా గ్రామాల సర్పంచులు వివరించారు. అనంతరం గరిడేపల్లి మండలంలోని మర్రికుంట, వెలిదండ గ్రామాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు 100మంది ఎమ్మెల్యే సైదిరెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. సమావేశంలో ఎమ్మెల్యే సతీమణి రజిత, ఎంపీపీ పెండెం సుజాతాశ్రీనివాస్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బాణోతు కృష్ణానాయక్, పీఏసీఎస్ చైర్మన్లు వీరంరెడ్డి శంభిరెడ్డి, ముప్పారపు రామయ్య, నాయకులు కడియం వెంకట్రెడ్డి, గంట సుధాకర్రెడ్డి, కీత జ్యోతీరామారావు, సారధి, వినోద, శ్రీనివాస్, చల్లా శ్రీలతారెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.