దేవరకొండ, డిసెంబర్ 27 : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే ప్రజా పాలన కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని ఎమ్మెల్యే నేనావత్ బాలూనాయక్ అన్నారు. బుధవారం పట్టణంలోని అంబేద్కర్ భవన్లో అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు ప్రజాపాలన దరఖాస్తులను ప్రజల నుంచి స్వీకరించాలన్నారు. ప్రజలు అధికంగా వస్తే అదనపు కౌంటర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహ, ఎంపీపీ నల్లగాసు జాన్యాదవ్, ఎంపీడీఓ శర్మ, డీఎస్పీ గిరిబాలు, వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించాలి : ఎమ్మెల్యే బీఎల్ఆర్
మిర్యాలగూడ : అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు అందించాలని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి సూచించారు. బుధవారం మిర్యాలగూడ రైతువేదికలో ప్రజాపాలనపై నియోజకవర్గ పరిధిలోని అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజాపాలన కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించి సంక్షేమ పథకాలకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించాలన్నారు. సమావేశంలో డీఎస్పీ వెంకటగిరి, ఎంపీడీఓ జ్యోతిలక్ష్మి, అధికారులు పాల్గొన్నారు.
నకిరేకల్, డిసెంబర్ 27 : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమం నిరంతర ప్రక్రియ అని, అర్హులకు సంక్షేమ పథకాలు అందించే బాధ్యత అధికారులదే అని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. బుధవారం నకిరేకల్లోని శ్రీనివాస ఫంక్షన్ హాల్లో నిర్వహించిన నియోజకవర్గస్థాయి ప్రజాపాలన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామసభలలో ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారని, అర్హులను గుర్తించే ప్రక్రియను అధికారులు పారదర్శకంగా చేపడతారన్నారు.
ఈ గ్రామసభల్లో 5 గ్యారంటీలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు, అధిక జనాభా కలిగిన గ్రామాలు, పట్టణాలలో వలంటీర్లను నియమించుకునే వెసులుబాటును కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ప్రజాపాలన నిర్వహిస్తామన్నారు. నియోజకవర్గానికి మరో 1000 ఇండ్లు అదనంగా కేటాయించాలని గృహనిర్మాణశాఖ మంత్రిని కోరినట్లు తెలిపారు. సమావేశంలో నియోజకవర్గ ప్రత్యేకాధికారి కోటేశ్వర్రావు, మున్సిపల్ చైర్మన్లు రాచకొండ శ్రీనివాస్, కోమటిరెడ్డి చినవెంకట్రెడ్డి, జడ్పీటీసీలు మాద ధనలక్ష్మీనగేశ్, బొప్పని స్వర్ణలత, ఎంపీపీలు బచ్చుపల్లి శ్రీదేవీ గంగాధర్, జెల్ల ముత్తిలింగం, మున్సిపల్ కమిషనర్ బాలాజీ, తాసీల్దార్ గుగులోతు ప్రసాద్నాయక్, ఎంపీడీఓ రమేశ్ దీన్దయాల్, సీఐలు రాఘవరావు, రాజశేఖర్, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
మునుగోడు, డిసెంబర్ 27 : రాష్ట్ర ప్రభుత్వం గురువారం నుంచి చేపడుతున్న ప్రజా పాలన కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని, దరఖాస్తు చేసేందుకు వచ్చే ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని జడ్పీసీఈఓ ప్రేమకరణ్రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం మండల కేంద్రంలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. మహాలక్ష్మి, రైతుభరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. అధికారులు సమన్వయంతో పని చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. సమావేశంలో చౌటుప్పుల్ ఆర్డీఓ జగ్ననాథరావు, మున్సిపల్ కమిషనర్ వెంకట్మణి కర్ణన్, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.