మునుగోడు, డిసెంబర్ 10 : మునుగోడు నియోజకవర్గంలో ఇక నుంచి బెల్ట్ షాపులు ఉండవని నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా మునుగోడు క్యాంప్ కార్యాలయంలో ఆదివారం నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో బెల్ట్షాపులు ఉండవ్వని కార్యకర్తల సమక్షంలో ఏకగ్రీవంగా తీర్మానం చేస్తున్నట్లు చేతులు లేపి మద్దుతు తెలిపారు.
పెండింగ్లో ఉన్న ఉదయ సముద్రం, కిష్టరాయినపల్లి, చర్లగూడెం ప్రాజెక్టులను పూర్తి చేసి నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు సాగు నీరందించేందుకు కృషి చేస్తానన్నారు. భూ నిర్వాసితులకు 100శాతం న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు. నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసుకుందామన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి, రాజీవ్ ఆరోగ్యశ్రీ నిరుపేదలకు వరంలాంటివని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆసుపత్రి ఆవరణలో ఆదివారం ఏర్పాటు చేసిన మహాలక్ష్మి పథకం, రాజీవ్ ఆరోగ్యశ్రీ సేవలను రూ.10 లక్షలకు పెంచే పోస్టర్ను మండలకేంద్రంలో ఆదివారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేదల వైద్య చికిత్స కోసం ప్రభుత్వం రూ.10 లక్షల వరకు పెంచినట్లు చెప్పారు.
అనంతరం మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ప్రత్యేకంగా మహిళలతో కూడిన బస్సును ఆయన జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం పలువురు అధికారులు ఎమ్మెల్యేను సన్మానించారు. కార్యక్రమంలో జడ్పీ సీఈఓ ప్రేమకరణ్రెడ్డి, డిప్యూటీ డీఎంహెచ్ఓ వేణుగోపాల్రెడ్డి, డీటీసీఈఓ డాక్టర్ కల్యాణ్చక్రవర్తి, ఎంపీపీ కర్నాటి స్వామి యాదవ్, వైస్ ఎంపీపీ అనంతవీణాలింగస్వామి, ఎంపీటీసీ బొడ్డుశ్రావణి, ఆర్టీసీ అధికారులు, సర్పంచులు, ఎంపీటీసీలు,నాయకులు పాల్గొన్నారు.