నల్లగొండ, అక్టోబర్ 26 : గత ఎన్నికల్లో నల్లగొండ నియోజకవర్గ ప్రజలు తనను నమ్మి ఎమ్మెల్యేగా గెలిపించారు. నల్లగొండ పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దా.. నియోజ కవర్గంలో కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టా.. ఈ సారి ఎన్నికల్లో కూడా ఆలోచించి మరోసారి అభివృద్ధికి ప్రజలు ఓటు వేయాలని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని 43,45,46 వార్డుల్లో ఆయన గురువారం ప్రచారం నిర్వహించి కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. నియోజకవర్గ ప్రజలు మరోసారి ఓటు వేసి గెలిపిస్తే నల్లగొండను మరింత అభివృద్ధ్ది చేస్తానని అన్నారు.
గత ఎన్నికల్లో మార్పుకోసం తనకు అవకాశం ఇవ్వాలని కోరగా ప్రజలు ఇచ్చిన అవకాశంతో నల్లగొండను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో పెట్టినట్లుగా ఈ సారి అధికారంలోకి రాగానే మార్చి నుంచి ఆసరా పింఛన్తో పాటు తెల్లకార్డు కలిగిన వారికి ఉచిత బీమా అమలు చేయనున్నట్లు తెలిపారు. తనకు ఎలాంటి వ్యాపకాలు లేవని తన ధ్యాస మొత్తం నల్లగొండ అభివృద్ధ్ది, ఇక్కడి ప్రజల సంక్షేమమే అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చే ఆరు గ్యారంటీలు అనేది అవాస్తవమని ఆ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పథకాలు అమలు కాబోవన్నారు. నిజంగా చిత్తశుద్ది వారికే ఉంటే వారు ప్రాతినిధ్యం వహించే రాష్ట్రాల్లో ఇప్పడు ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు.
నల్లగొండ పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎవరూ కూడా పెద్దగా పట్టించుకోలేదని అలాంటి నల్లగొండను సుందరీకరిస్తూ సమూల మార్పు చేస్తున్న మీకే మా మద్దతు అంటూ పట్టణ ప్రజలు నినదిస్తూ ఎమ్మెల్య కంచర్ల భూపాల్ రెడ్డికి మద్దతిస్తూ నినదిస్తున్నారు. గురువారం పట్టణంలోని మూడు వార్డుల్లో ప్రచారం చేయగా మహిళల్లో విశేష ఆదరణ లభించింది. వార్డుల్లో ప్రచారం చేస్తున్న సమయంలో మహిళలు హారతులతో స్వాగతం పలుకుతూ తిలకం దిద్ది మరోసారి మీకే ఓటు వేస్తామని చెప్తున్నారు. ఆయా ప్రచార కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, బీఆర్ఎస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్, ఎడ్ల శ్రీనివాస్, శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు.