నీలగిరి, డిసెంబర్ 2 : అవినీతి, డబ్బు సంచులు అభివృద్ధి గెలుపును ఆపలేవని, 10 వేల మెజార్టీతో నల్లగొండ గడ్డపై గులాబీ జెండా ఎగురుతుందని, కార్యకర్తలెవ్వరూ అధైర్యపడొద్దని బీఆర్ఎస్ నల్లగొండ అభ్యర్థి, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు. శనివారం లక్ష్మీగార్డెన్స్లో బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు భువనగిరి దేవేందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ముందు కొంతమంది నాయకుల వెన్నుపోటుతో మెజార్టీ తగ్గుతుందని, లేకుంటే 25 వేల మెజార్టీతో గెలుపొందేవాళ్లమని ధీమా వ్యక్తం చేశారు.
సైలెంట్ ఓటింగ్తో ప్రజలంతా అభివృద్ధికే ఓటేశారని తెలిపారు. కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి టికెట్లు అమ్ముకొని వచ్చిన సొమ్ముతో నల్లగొండలో వెన్నుపోటు నాయకులను పశువుల్లా కొన్నాడని, నిఖార్సయిన గులాబీ సైనికులను కొనలేకపోయాడని చెప్పారు. 2018లో సర్వేలన్నీ బీఆర్ఎస్కు వ్యతిరేకంగా వచ్చాయని, కానీ అత్యధిక మెజార్టీతో కేసీఆర్ సీఎం అయ్యారని, ఇప్పుడు మళ్లీ అదేసీన్ రిపీట్ అవుతదని గుర్తుచేశారు.
సీనియర్ నాయకుడు చకిలం అనీల్కుమార్ మాట్లాడుతూ కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుని కాపాడే నాయకుడు భూపాల్రెడ్డి అని కొనియాడారు. ఒక ఎమ్మెల్యే తలుచుకుంటే నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయోచ్చో చేసి చూపించారన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కంచర్ల కృష్ణారెడ్డి, నల్లగొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, ఎంపీటీసీలు, సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.