నల్లగొండ, అక్టోబర్ 18 : రానున్న రోజుల్లో నల్లగొండను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసే బాధ్యత తనదే అని.. అందుకు నియోజకవర్గ ప్రజలు మరోసారి అవకాశం ఇవ్వాలని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి కోరారు. బుధవారం పట్టణంలోని 18, 19, 40 వార్డుల్లో ఆయన ఇంటింటి ప్రచారం చేపట్టారు. ప్రతి ఇంటికి వెళ్లి కారు గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. నల్లగొండలోని వార్డులతో పాటు పట్టణంలోని ప్రధాన కూడళ్లలో రూ.1,450 కోట్లతో అభివృద్ధి పనులు చేస్తున్నట్లు తెలిపారు. ఇదే మాదిరి అభివృద్ధి కొనసాగాలంటే మరోసారి తనకు ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వాలని కోరారు. గత ఎన్నికల్లో మార్పుకోసం బీఆర్ఎస్ ను గెలిపించారని, ప్రజలు ఇచ్చిన అవకాశంతోనే నల్లగొండను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.
“మీ సేవకుడిగా ఎల్లప్పుడూ మీ సంక్షేమమే కోరుకుంటానని.. అందుకు మీ నుంచి సహకారం అందించాలని” కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా సీఎం కేసీఆర్ అన్ని వర్గాలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని, అవి పూర్తి స్థాయిలో అమలు కావాలంటే రాష్ట్రంలో తిరిగి సీఎం కేసీఆర్ పాలనే రావాలని పేర్కొన్నారు. బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో పేర్కొన్న విధంగా మూడోసారి అధికారంలోకి రాగానే మార్చి నుంచే ఆసరా పింఛన్లు పెంచడంతో పాటు రేషన్ కార్డు కలిగిన వారికి ఉచిత బీమా అమలు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ ఆలకుంట్ల నాగరత్నం రాజు, కటికం సత్తయ్య గౌడ్, మాలె శరణ్యారెడ్డి, కొండూరు సత్యనారాయణ, నాంపల్లి శ్రీనివాస్, జనార్దన్రావు, వీరాచారి, నాయకులు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.
ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే ఇంటింటికి వెళ్లగా ప్రజలు, ముఖ్యంగా మహిళలు ఆయనకు అపూర్వ స్వాగతం పలికారు. సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ పథకాల కరపత్రాలు చూపుతూ ఓట్లు అభ్యర్థించగా ఆయా పథకాలతో లబ్ధి చేకూరే వారంతా తాము మీకు మద్దతుగా ఉంటామని హామీ ఇచ్చారు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ప్రచారం చేపట్టినా కాలనీల ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. వార్డుల్లో ప్రచారం చేస్తున్న సమయంలో మహిళలు హారతులతో స్వాగతం పలుకుతూ తిలకం దిద్ది తమ ఓటు బీఆర్ఎస్కే అంటూ స్పష్టం చేశారు.