నకిరేకల్, ఏప్రిల్ 13 : తెలంగాణ రాష్ట్రంలో కృత్రిమ కరువు సృష్టించింది కాంగ్రెస్సేనని, ఆ పార్టీ అధికారంలోకి వచ్చాక 2014కు ముందున్న పరిస్థితులు పునరావృతమవుతున్నాయని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. నకిరేకల్ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అధ్యక్షతన శనివారం బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గస్థాయి ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చరిత్రలో ఎక్కడా లేని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వంద రోజుల్లోనే అసలు రూపం బయటపెట్టుకుందన్నారు. ఇచ్చిన హామీలన్నీ నీటి మూటలేనని, ప్రజలను మోసం చేసే ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ 420 హామీలిచ్చిందని విమర్శించారు. ఏ ఒక్క హామీని నెరవేర్చే ఉద్దేశం కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని ప్రజలు గుర్తించారన్నారు.
కరువు, మంచినీటి సమస్యను బయటకు రానీయకుండా, కరెంటు ఇవ్వలేని చేతకానితనాన్ని బయటపడనివ్వకుండా ఉండేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం రోజుకో డ్రామాను తెరపైకి తీసుకొస్తుందని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో అన్ని రంగాలకు 24 గంటల కరెంటు ఇస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం కరెంటు ఇవ్వలేక మోటార్లు కాలపెట్టే పరిస్థితి తీసుకొచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓట్లేస్తే మళ్లీ చీకటి రోజులు తెస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ను నమ్మి మోసపోయామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం మెడలు వంచాలంటే, ప్రభుత్వంపై పోరాటం చేయాలంటే బీఆర్ఎస్, కేసీఆర్తోనే సాధ్యమవుతుందన్నారు.
తెలంగాణకు కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష అని ప్రజలు తొందరల్లోనే గుర్తించారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు అసహనంతో ఉన్నారని, నల్లగొండ జిల్లాలోని రెండు పార్లమెంట్ స్థానాల్లో గులాబీ జెండా ఎగురడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో యాదాద్రి జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్, ఉన్నత విద్యామండలి మాజీ చైర్మన్ ఒంటెద్దు నర్సింహారెడ్డి, పార్టీ రాష్ట్ర నాయకులు దూదిమెట్ల బాలరాజు, చెరుకు సుధాకర్, చింతల సోమన్న, రేగట్టె మల్లికార్జున్రెడ్డి, జడ్పీటీసీలు మాద ధనలక్ష్మి, తరాల బలరాం, మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్, ఆయా మండలాల అధ్యక్షులు పాల్గొన్నారు.
35 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్న. నా మీద ఆవగింజంత తప్పు కూడా లేదు. భువనగిరి ఎంపీగా నన్ను గెలిపిస్తే ప్రజా సమస్యలపై పార్లమెంట్లో గళమెత్తుతా. బీఆర్ఎస్ నుంచి వెళ్లిన వాళ్లే బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులుగా ఉన్నారు. గెలిచిన నెల రోజుల్లోనే కుర్చీల పంచాయితీ మొదలైంది. మళ్లీ గెలిపిస్తే పంచాయితీలు తప్ప ప్రజా సమస్యలు పట్టించుకోరు. కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో ఎవరికీ తెలియదు. అధికార పార్టీకి భయపడాల్సిన అవసరం లేదు. బీఆర్ఎస్ శ్రేణులంతా ప్రజల్లో ఉండి గెలుపు కోసం కృషి చేయాలి. అన్ని జాతులు, కులాలు, మతాలను సెక్యులర్గా చూసే గొప్ప వ్యక్తి కేసీఆర్. నన్ను ఎంపీగా గెలిపిస్తే తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తా.
ఎన్నికల్లో ఆటుపోట్లు ఉంటయ్.. అయినా నిరుత్సాహపడకుండా కష్టపడుదాం. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేశ్ను గెలిపించి పార్లమెంట్కు పంపిద్దాం. చంద్రబాబు కనుసైగల్లో నడిచే వ్యక్తి రేవంత్రెడ్డి. ఆనాడు చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాగార్జునసాగర్ ఎండిపోయింది. ఈనాడు శిష్యుడు రేవంత్రెడ్డి సీఎంగా ఉన్నడు.. ఏ పల్లెకు పోయినా నీళ్లు లేక, పంటలు పండక కరువు విలయతాండవం చేస్తుంది. ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మే పరిస్థితుల్లో లేరు. మళ్లీ బీఆర్ఎస్ వైపు చూస్తున్నరు. నకిరేకల్ సెంటర్లో చిరుమర్తి లింగయ్య నిర్మించిన సర్కిల్ను కూల్చేశారు.
100 పడకల ఆస్పత్రిని కూడా కూల్చేస్తారా? బీఆర్ఎస్ కార్యకర్తలపై దౌర్జన్యం చేస్తూ పోలీసులతో కొట్టిస్తున్నారు. వంద రోజుల్లో నెరవేరుస్తామన్న హామీలు నెరవేర్చలేదు. ఎంపీ ఎన్నికల తరువాత స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయని చెబుతున్నారు. ఇక హామీలను నెరవేర్చేదెన్నడు. ప్రజలకు మాయమాటలు చెప్పి అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు వేయించుకున్నారు. కానీ.. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్కు తగిన బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలందరం కలిసి క్యామ మల్లేశ్ను అత్యధిక మెజార్టీతో గెలిపించుకుందాం.
– చిరుమర్తి లింగయ్య, నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే
జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాక రైతులు రైస్ మిల్లుల వద్ద లైన్లలో నిలబడి వడ్లు అమ్ముకుంటున్నారు. మూడు నెలల్లో రేవంత్రెడ్డి పాలనను, కేసీఆర్ పాలనను పోల్చుకుంటున్నారు. ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్న కోపాన్ని ఓట్ల ద్వారా చూపిస్తారు. అప్పట్లో ఏ సమస్య వచ్చినా కేసీఆర్ వెంటనే స్పందించి నిర్ణయం తీసుకుని సమస్య పరిష్కరించేవారు. ఇప్పుడు సమస్య వస్తే మంత్రివర్గంలో ఉన్నవాళ్లు ఎవరు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితి. ఆరోజు కేసీఆర్ రైతుబంధు ఇస్తామని రూ.7వేల కోట్లు సిద్ధం చేస్తే ఈసీకి ఫిర్యాదు చేసి రానీయకుండా రేవంత్రెడ్డి చేసిండు. ఆ డబ్బులను కాంట్రాక్టర్లకు కట్టబెట్టిండు. పార్లమెంట్ ఎన్నికల్లో సమష్టిగా కృషి చేసి బీఆర్ఎస్ అభ్యర్థి క్యామ మల్లేశ్ను గెలిపించుకుందాం.
– బండ నరేందర్రెడ్డి, నల్లగొండ జడ్పీ చైర్మన్
కాంగ్రెస్ పార్టీ ఇచ్చే హామీలన్నీ ఆచరణకు సాధ్యంకానివి. 125 రోజుల్లోనే తెలంగాణ ప్రజలకు చుక్కలు చూపించిన మూర్ఖుడు రేవంత్రెడ్డి. ఇందులో 25 రోజులు ఢిల్లీకి పోయిండు. ఎంపీలు, ఎమ్మెల్యేల పంచాయితీలు, భూముల పంచాయితీలు, కుర్చీని ఎవడన్న లాగుతాడేమోనన్న పంచాయితీలు తప్ప తెలంగాణ పరిపాలనకు టైం లేదు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి పిచ్చిపిచ్చిగా మాట్లాడడం సబబు కాదు. ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ లాంటి మేధావి బీఆర్ఎస్లో చేరారు. భువనగిరి ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేశ్ నీతి, నిజాయితీ గల కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. ఆయనకు 35 ఏండ్లు రాజకీయాల్లో అపారమైన అనుభవం ఉంది. ఆయన్ను గెలిపిస్తే బడుగు, బలహీన వర్గాలకు సమన్యాయం చేస్తాడు. బీఆర్ఎస్ శ్రేణులంతా కలిసి క్యామ మల్లేశ్ గెలుపు కోసం కృషి చేయాలి.
– బడుగుల లింగయ్యయాదవ్, బీఆర్ఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు