సూర్యాపేట, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ) : ‘కాంగ్రెస్ పార్టీ పుట్టుక నుంచి మోసం చేయడమే నైజంగా అలవర్చుకుంది. గత ఎన్నికల ముందు అన్ని వర్గాలను మభ్యపెట్టి, మోసపూరిత మాటలతో అనేక హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చింది. నేడు హామీల అమలుకు బడ్జెట్లో కనీస కేటాయింపులు కూడా లేవు. ఇంతటి మోస పూరిత బడ్జెట్ చరిత్రలో లేదు. లంకెబిందెలున్నాయనుకొని వచ్చి అలీబాబా 40 దొంగల్లా వచ్చి పడ్డారు. వారు ఇచ్చిన హామీల సంగతి దేవుడెరుగు కనీసం గత సీఎం కేసీఆర్ ఇచ్చిన పథకాలను కూడా అమలు చేసే పరిస్థితి కనిపించడం లేదు’ అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు.
సూర్యాపేటలో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎక్కడ కూడా వారిచ్చిన హామీలపై చిత్తశుద్ధి లేదన్నారు. వాస్తవానికి కొత్తగా వచ్చిన ప్రభుత్వానికి సమయం ఇవ్వాలని మా నాయకుడు కేసీఆర్ చెప్పడంతో ఆగామని, శాసన సభ సమావేశాల్లో గవర్నర్తో అన్నీ అబద్ధాలు చెప్పించారని, తాము కూడా చెప్పాల్సిన పద్ధతుల్లో ప్రజలకు వివరించామని చెప్పారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు ప్రధానంగా రైతు భరోసా డబ్బులు ఇవ్వాలని అడిగితే ఒక మంత్రి చెప్పుతో కొట్టాలని అనడంపై సభలో నిలదీశామని తెలిపారు. నిరుద్యోగ యువకులను భుజాలపై వేసుకొని, వారివి, వారి కుటుంబాల ఓట్లు వేయించుకున్న కాంగ్రెస్, బడ్జెట్లో నిరుద్యోగ భృతి ప్రస్థావన తీసుకురాలేదని, కొలువుల ప్రకటన లేదని, ఇంతకు మించిన ద్రోహం మరొకటి లేదని చెప్పారు.
గృహ జ్యోతి పథకంతో 200 యూనిట్లు అందరికీ ఉచితం అని హామీ ఇచ్చి నేడు మోసం చేసే ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించిందని మండిపడ్డారు. ఎంత మంది గృహ వినియోగదారులు ఉన్నారనేది కొత్తగా తెలుసుకోవాల్సిన అవసరం లేదని, విద్యుత్ శాఖకు నెలనెలా 200 యూనిట్లకు తీసేసి బిల్లు చెయ్యమంటే ఒక్కటే నిమిషంలో చేస్తారని చెప్పారు. ఈ పథకం కోసం రూ.2,300 కోట్లు మాత్రమే కేటాయించారని, కానీ ఇవి 50యూనిట్లు ఉచితం ఇచ్చేందుకు కూడా సరిపోవని తెలిపారు. అధికారంలోకి వచ్చాక డిసెంబర్ 9న రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ మరిచిపోయిందని, బడ్జెట్లో దాని ఊసేలేదన్నారు.
రైతు బంధు పేరు మార్చుతామన్నారని, రూ.10 వేలనుంచి 15వేల పెట్టుబడి అన్నారని, కానీ ఆ ప్రస్తావనే లేదని తెలిపారు. అన్ని పంటలకు రూ.500 బోనస్ అన్నారని, దాని ఊసే లేదని, మహిళలకు నెలనెలా రూ.2,500 బడ్జెట్లో కేటాయించలేదని అన్నారు. ఆటో కార్మికులను ఆదుకునేందుకు ఏటా 12వేలు ఇస్తామని చెప్పి బడ్జెట్లో పొందుపర్చలేదని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వంద కాదు వేల రోజుల్లో కూడా పూర్తికావని, తెలంగాణ ప్రజలకు వీళ్ల అసలు రూపం తెలిసిందని అన్నారు. జనం జాగ్రత్తగా ఉండాలి, ఓటేయించుకున్న వారిని నిలదీయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మాజీ ప్రభుత్వ విప్ బోడకుంట్ల వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్యేలు జీవన్రెడ్డి, కంచర్ల భూపాల్రెడ్డి, గాదరి కిశోర్కుమార్, బాలమల్లు, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో వెనుకబడిన ప్రాంతాలను విస్మరించినట్లుగా ఉంది. ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీల అమలుపై ఉన్న చిత్తశుద్ధి మిగిలిన సమస్యలపై కనిపించలేదు. రుణమాఫీ, రైతుబంధు, రైతు భరోసా ఎప్పటి వరకు ఏ రకంగా అమలు చేస్తారో నిర్థిష్టంగా పేరొనలేదు. గతంలో మహిళా పొదుపు సంఘాలకు మ్యాచిం గ్ గ్రాంట్తోపాటు పావలా వడ్డీ రుణాలు ఎప్పటి వరకు ఇస్తారో కూడా తెలుపలేదు. ముఖ్యంగా సాగునీటి రంగంలో పెండింగ్లో ఉన్న శ్రీశైలం సొరంగం మార్గాన్ని పూర్తి చేసేందుకు ఎకువ నిధులు కేటాయించి ఖర్చు చేయాలి. నియోజకవర్గానికి 3,500 గృహ నిర్మాణాలు చేపడితే ఇండ్లు లేని నిరుపేదల వరకు ఎప్పటి వరకు పూర్తవుతాయి. మొత్తంగా బడ్జెట్ను పరిశీలిస్తే రాబడికి పోబడికి తేడా ఉంది. ఖర్చులకు తగ్గట్లుగా ఆదాయం ఏరకంగా సమకూర్చుకుంటారో చెప్పలేదు.
-ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, సీపీఎం నల్లగొండ జిల్లా కార్యదర్శి