నల్లగొండ, ఫిబ్రవరి 12 : కాంగ్రెస్ లోపాయికారి ఒప్పందంలో భాగంగానే కృష్ణా ప్రాజెక్టులు కేఆర్ఎంబీ కంట్రోల్లోకి వెళ్లాయని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. కృష్ణా నదిపై ప్రాజెక్టుల సాగునీటి హకులను కాపాడుకునేందుకు మంగళవారం నల్లగొండలోని మర్రిగూడ బైపాస్లో బీఆర్ఎస్ తలపెట్టిన చలో నల్లగొండ భారీ బహిరంగ సభ స్థలాన్ని ఆయన సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సభకు ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాల నుంచి ప్రజలు, రైతులు పెద్ద సంఖ్యలో హాజరవుతారన్నారన్నారు. పదేండ్లు కృష్ణా ప్రాజెక్టులు కేంద్రం ఆధీనంలోకి పోకుండా కాపాడితే, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే వారికి ధారాదత్తం చేసిందని తెలిపారు.
రాష్ట్రంలో మహిళలు మంచి నీటి కోసం రోడ్డు ఎక్కొద్దని, ఫ్లోరోసిస్ను రూపుమాపాలనే ఉద్దేశంతో మిషన్ భగీరథ పథకం పెట్టామని, దాని వల్ల ప్రజలకు తాగు నీటి కష్టాలు తప్పడంతోపాటు ఒక్క ఫ్లోరోసిస్ కేసు కూడా నమోదు కాలేదని చెప్పారు. కేఆర్ఎంబీ సమావేశానికి వెళ్లేటప్పుడు సీఎం లేదా మంత్రి వర్గంతో సమీక్ష ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. కేసీఆర్ సభ కోసం కృష్ణా పరీవాహక ప్రాంత రైతులు, ప్రజలు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారని తెలిపారు. సభకు లక్షలాదిగా తరలిరావడం కోసం స్వచ్ఛందంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారని చెప్పారు.
కేఆర్ఎంబీ కంట్రోల్లోకి వెళ్లినా కాంగ్రెస్ సీఎం, మంత్రులు సాగర్ ప్రాజెక్టుకు ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. సీఎంగా కేసీఆర్ ఉన్నప్పుడు సాగర్ ప్రాజెక్టును ఆక్రమించడానికి ఏపీ వస్తే తామే తరిమామని గుర్తు చేశారు. కృష్ణా జలాల వివాదం అనేది తెలంగాణ ప్రజల జీవన్మరణ సమస్య అని అన్నారు. కృష్ణా జలాల హకులను కేఆర్ఎంబీకి అప్పజెప్పడాన్ని నాడు ఏపీ ప్రభుత్వం ఒప్పుకొన్నా, బీఆర్ఎస్ సరార్ ఒప్పుకోలేదని తెలిపారు. కాంగ్రెస్ నేతలు ఏపీ నాయకులకు ఏజెంట్లుగా మారి తెలంగాణకు ద్రోహం చేస్తున్నారని విమర్శించారు.
కృష్ణా జలాల హకు విషయంలో కేంద్రంపై పోరాడాల్సింది పోయి కాంగ్రెస్ నేతలు తమపై ఎదురుదాడి చేయడం దురదృష్టకరమని ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా జలాల హకులపై బీఆర్ఎస్ పోరాటంతోనే కేఆర్ఎంబీకి అప్పగించలేదని కాంగ్రెస్ తీర్మానం చేసిందని, కాంగ్రెస్ తీరుపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైందని చెప్పారు. తెలంగాణ ప్రజలు మరోసారి నీటి కోసం పోరాటం చేయాల్సిన పరిస్థితి తలెత్తిందని, నేడు నల్లగొండలో నిర్వహించే సభకు పార్టీలకు అతీతంగా పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
మాజీ ఎమ్మెల్యేలు రవీంద్రకుమార్, భూపాల్రెడ్డి
కృష్టా ప్రాజెక్టులను కాపాడు కోవాలంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగట్టాల్సిన అవసరం ఉందని, నల్లగొండలో నిర్వహించే సభకు రైతులంతా పార్టీలకతీతంగా కదిలిరావాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్, నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. నల్లగొండలో కోమటిరెడ్డి టీమ్ నిరసనలు చేసినంత మాత్రాన ఎవరూ పట్టించుకోరని, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా వెళ్తున్నందున వారి నుంచి నిరసన ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రేగట్టె మల్లికార్జున్ రెడ్డి, మందడి సైదిరెడ్డి, బోనగిరి దేవేందర్, అభిమన్యు శ్రీనివాస్, మారగోని గణేశ్, రావుల శ్రీనివాస్ రెడ్డి, చీర పంకజ్ యాదవ్, కొండూరు సత్యనారాయణ, మాలె శరణ్యారెడ్డి, యాట జయప్రదారెడ్డి పాల్గొన్నారు.