చందంపేట/ డిండి, ఏప్రిల్ 29 : కాంగ్రెస్ పార్టీ మాయ మాటలతో ప్రజలను మోసం చేస్తుందని, వారి మాటలు నమ్మి మోసపోవద్దని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా డిండి, చందంపేట, నేరేడుగొమ్ము మండల కేంద్రాల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్తో కలిసి సోమవారం రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా జగదీశ్రెడ్డి మాట్లాడుతూ ప్రజల పక్షాన, రైతుల కోసం పోరాడేది బీఆర్ఎస్ పార్టీయేనన్నారు. ఓట్ల కోసం మాయ మాటలు చెబుతున్న కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చి వంద రోజులు దాటినా ఆరు గ్యారెంటీలను పూర్తి స్థాయిలో అమలు చేయలేదని విమర్శించారు.
కరెంటు కోతలతో ప్రజలు, రైతులు ఇబ్బందులు పడుతున్నారని, పంటలు ఎండిపోయిన రైతులను ఆదుకోకుండా ప్రభుత్వం చోద్యం చూస్తుందని అన్నారు. రైతు రుణమాఫీని ఇంకెన్నాళ్లు దాటేస్తూ వస్తారని, ప్రజలను ఇంకెంత కాలం మోసం చేస్తారని ప్రశ్నించారు. ఎకరానికి రూ.15వేల రైతు బంధు, వడ్లకు రూ.500 బోనస్ ఏమయ్యాయన్నారు. బీఆర్ఎస్ హయాంలో అభివృద్ధి చెందిన రాష్ట్రం.. ఇప్పుడు కరువుతో విలవిల్లాడుతుందన్నారు. ఎండిన పంటలకు ఎకరానికి రూ.25వేల పరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు.
పదేండ్ల కేసీఆర్ పాలనలో ఏం జరిగింది.. నాలుగు నెలల కాంగ్రెస్ పాలన ఎలా ఉందో చూడాలని ప్రజలకు సూచించారు. బీఆర్ఎస్ పాలనలో రైతులకు సాగునీరు, పెట్టుబడి కోసం ఎకరానికి రూ.10వేలు, రైతు బీమా, 24గంటల ఉచిత విద్యుత్ అందించామన్నారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ మంచి నీరు ఇచ్చామని, తండాలను గ్రామ పంచాయతీలుగా చేశామని తెలిపారు. నిరుద్యోగ యువతకు రూ.4వేల భృతి, కాలేజీ యువతులకు స్కూటీలు, వృద్ధులకు రూ.4వేల పెన్షన్ ఇస్తామన్న సీఎం రేవంత్రెడ్డి.. వాటిని అమలు చేసే తెలివి లేక కేసీఆర్పై తిట్ల పురాణం మొదలు పెట్టిండని విమర్శించారు. తిట్లు, ఒట్ల పురాణంతో ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారని పేర్కొన్నారు.
ఈ క్రమంలో పాలిచ్చే బర్రెను కాదు.. పొడిచే దున్నపోతును తెచ్చుకున్నామని రాష్ట్ర ప్రజలు బాధ పడుతున్నారని తెలిపారు. బీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల కృష్టారెడ్డిని గెలిపిస్తే దున్నపోతు మెడలు వంచి పని చేయించేందుకు కేసీఆర్కు ముల్లు కర్ర ఇచ్చినట్లువుతుందన్నారు. కాంగ్రెస్ మోసాలను ఇంటింటికీ తిరిగి వివరించాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి మాట్లాడుతూ తనను ఎంపీగా గెలిపిస్తే దేవరకొండ నియోజకవర్గానికి రైల్వే లైను, గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేసేందుకు కృషి చేస్తానని చెప్పారు. స్వామినాథన్ కమిషన్ సిఫారసుల ప్రకారం వరికి గిట్టుబాటు ధర రూ.3500, పత్తికి రూ.13వేలు అమలు జరిగేందుకు పార్లమెంటులో పోరాడుతానన్నారు. అనంతరం వెంకట్ ద్రావిడ్ ఆధ్వర్యంలో బీఎస్పీ నుంచి పలువురు జగదీశ్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
కార్యక్రమాల్లో పార్టీ పార్లమెంటు ఎన్నికల దేవరకొండ నియోజకవర్గ సమన్వయకర్త రేగట్టె మల్లికార్జున్రెడ్డి, డిండి ఎంపీపీ సునీతాజనార్దన్రావు, పార్టీ నాయకులు సుధీర్రెడ్డి, టీవీఎన్ రెడ్డి, వడ్త్య రమేశ్నాయక్, వెంకటేశ్వర్రావు, శ్రీనివాసరావు, వెంకట్రెడ్డి, ముత్యంరావు వల్లపురెడ్డి, గోవిందుయాదవ్, శంకర్నాయక్, లోక్యానాయక్, రాజవర్ధన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, రాములుగౌడ్, గోవర్ధన్, నెహ్రూనాయక్, వెంకటయ్య, లక్ష్మయ్య, శివ, శ్రీశైలం, మురళి పాల్గొన్నారు.