ఆలేరులో బీఆర్ఎస్ అభ్యర్థి గొంగిడి సునీతామహేందర్రెడ్డి శుక్రవారం నామినేషన్ వేశారు. తాసీల్దార్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి వీరారెడ్డికి తమ నామినేషన్ పత్రాలను అందించారు. ర్యాలీలు లేకుండా పలువురు ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సాదాసీదాగా వచ్చి నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం మీడియాతో సునీతామహేందర్రెడ్డి మాట్లాడుతూ యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహ స్వామి, ఆలేరు ప్రజల దీవెనలతో మూడోసారి ఎమ్మెల్యేగా గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేసిందని, సీఎం కేసీఆర్ పాలనే ప్రజలకు శ్రీరామ రక్ష అని తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కల్లూరి రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
యాదగిరిగుట్ట, నవంబర్ 10 : కాంగ్రెస్, బీజేపీ పార్టీ నాయకులవి చిల్లర మాటలేనని ప్రభుత్వ విప్, బీఆర్ఎస్ ఎన్నికల అభ్యర్థి గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. జెండా, ఎజెండాలేని నాయకులు చెప్పే కల్లబొల్లి మాటలను ప్రజలు నమ్మి మోసపోవద్దని సూచించారు. పొరపాటున కాంగ్రెస్కు ఓట్లు వేస్తే ఈ ప్రాంతం కటిక చీకటిల్లోకి వెళ్లడం ఖాయమన్నారు. శుక్రవారం యాదగిరిగుట్ట మండలంలోని కాచారం, ధర్మారెడ్డిగూడెం, కంటంగూడెం, చిన్నగౌరాయిపల్లి, సాదువెల్లి, గౌరాయిపల్లి గ్రామాల్లో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ అభివృద్ధి కొనసాగాలంటే మరోసారి బీఆర్ఎస్కే ఓటేయాలని కోరారు. ప్రతి గ్రామానికి ప్రత్యేక నిధులకు కేటాయించి అభివృద్ధి చేశామని గుర్తు చేశారు. ధరణి, రైతు బంధు దండుగ, 3 గంటలకే చాలంటుందని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అభివృద్ధి నిలిచిపోతుందన్నారు. ఆరు గ్యారంటీల పేరుతో గ్రామాల్లో తిరుగుతున్న కాంగ్రెస్ నాయకులను ప్రశ్నించాలని సూచించారు. రైతుల శ్రేయస్సు కోసం రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలను కల్పించడమే కాకుండా రానున్న రోజుల్లో తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి రూ. 5లక్షల బీమాతో పాటు సన్నబియ్యం అందించనున్నట్లు వెల్లడించారు.
రూ.400కు వంట గ్యాస్, ప్రతి మహిళకు సౌభాగ్యలక్ష్మి పథకం కింద రూ.3వేల జీవనభృతి, రూ.15లక్షల కేసీఆర్ ఆరోగ్య రక్ష, రైతు బంధు సాయం రూ.16వేలు వంటి నూతన మ్యానిఫెస్టోలోని హామీలను సీఎం కేసీఆర్ నెరవేరుస్తారని ధీమా వ్యక్తం చేశారు. కారు గుర్తుకు ఓటు చేసి భారీ మెజార్టీతో గెలిపిస్తే మరింత అభివృద్ధిని చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కర్రె వెంకటయ్య, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గడ్డమీది రవీందర్గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ ఇమ్మడి రామిరెడ్డి, బీఆర్ఎస్ ఎన్నికల ఇన్చార్జీ వంటేరు సురేశ్రెడ్డి, బీఆర్ఎస్ బీసీ విభాగం మండలాధ్యక్షుడు కవిడే మహేందర్, సర్పంచులు కొండ అరుణ, కలకుంట్ల సరిత, అనూరాధ, మీస సత్యలక్ష్మి, బీఆర్ఎస్ నాయకులు లక్ష్మణ్, శ్రీనివాస్, రాజు, శ్రీకాంత్ పాల్గొన్నారు.