కోదాడ, జూన్ 11 : రాష్ట్ర సాధనలో కవులు, కళాకారుల పాత్ర కీలకమైందని, ఉద్యమాన్ని ఉధృతం చేయడంలో వారు తమ కర్తవ్యాన్ని నెరవేర్చారని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు. దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని కోదాడ బాపూజీ గ్రంథాలయంలో ఆదివారం నిర్వహించిన సాహిత్య దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. సీఎం కేసీఆర్ చొరవతో సాహిత్య అకాడమీ పునరుద్ధరణ జరిగిందని, సాహిత్య అకాడమీ ఏర్పాటుచేసి తెలంగాణ యాస, భాషకు కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చారని పేర్కొన్నారు. సమైక్య పాలనలో తెలంగాణ భాష, యాసను అపహాస్యం చేశారని, ప్రస్తుతం సినీ రంగంలో కూడా మన భాషకు సముచిత స్థానం దక్కుతుందని అన్నారు.
రాష్ట్రం ఏర్పడక ముందు, తర్వాత ప్రగతిని, సంక్షేమాన్ని, వ్యవసాయం, పరిశ్రమల అభివృద్ధిని కవులు, కళాకారులు తమ రచనల ద్వారా ప్రజలకు వివరిస్తున్నారని గుర్తుచేశారు. సాహిత్య దినోత్సవ సందర్భంగా కళాకారులు, కవులను సన్మానించుకోవడం శుభపరిణామమన్నారు. విశ్రాంత అధ్యాపకులు మంత్రిప్రగడ భరతారావు, శ్రీరామకవచం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సాహితీ రంగానికి ముఖ్యమంత్రి కేసీఆర్ సముచిత స్థానం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కవులు, కళాకారులను శాలువాలు, మెమెంటోలతో సత్కరించారు. గ్రంథాలయ చైర్మన్ రహీం అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సుబ్బారావు, సత్యబాబు, వెంపటి మధు, ఈదుల కృష్ణయ్య, చందు నాగేశ్వర్రావు, కట్టబోయిన శ్రీనివాస్యాదవ్, గుండెల సూర్యనారాయణ, సట్టు నాగేశ్వర్రావు, బీఆర్ఎస్ నాయకులు, కవులు, కళాకారులు, సాహితీ వేత్తలు, అధికారులు పాల్గొన్నారు.