మునగాల, నవంబర్ 19 : రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం కొనసాగాలంటే బీఆర్ఎస్నే గెలిపించాలని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఆయన మండలంలోని నర్సింహులగూడెం, రేపాల, సీతానగరం, విజయరాఘవాపురం, జగన్నాథపురం, కృష్ణానగర్, బరాఖత్గూడెం గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పాలకులు ఈ ప్రాంతాన్ని విస్మరిస్తే తాను భుజాన ఎత్తుకొని అభివృద్ధి దిశగా తీసుకెళ్లానన్నారు. ఒక్క పంటకు నీళ్లు లేని ఈ ప్రాంతంలో కాళేశ్వరం నీరు అందించామన్నారు. కాంగ్రెస్ నాయకులు చేసిన అభివృద్ధి ఏమిటో చూపించాలని డిమాండ్ చేశారు.
రూ.2,100కోట్లతో చేసిన అభివృద్ధి పనులు మీ కళ్ల ముందు ఉన్నాయని తెలిపారు. గత ప్రభుత్వాల కాలంలో ప్రతి గ్రామానికి 15నుంచి రూ.20లక్షల సంక్షేమ పథకాలు అందితే ప్రస్తుతం కోట్లాది రూపాయలు అందుతున్నాయని తెలిపారు. కొందరు ప్రభుత్వంలో లబ్ధిపొంది ప్రస్తుతం పార్టీని వీడి సంక్షేమ పథకాలను విమర్శిస్తున్నారన్నారు. గులాబీ జెండానే నిరుపేదలకు అండగా నిలిచిందన్నారు. మండలంలో ప్రతి గ్రామానికి సురక్షితమైన తాగునీరు అందించిన ఘనత సీఎం కేసీఆర్దేనన్నారు. కోదాడలో ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి బీఆర్ఎస్తోనే జరిగిందన్నారు.
తాను నిత్యం ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యలు పరిష్కరించిన విషయం ప్రజలకు తెలుసన్నారు. కాంగ్రెస్ నాయకులకు ఇన్ని రోజులు గుర్తుకు రాని ప్రజలు ఎన్నికలు రాగానే గుర్తుకొచ్చారా అని ప్రశ్నించారు. పని చేసే ప్రభుత్వానికి ప్రజలు అండగా ఉండాలని కోరారు. వచ్చే ఎన్నికలో తనను ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి చేస్తానని హామీనిచ్చారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు అజయ్కుమార్, పచ్చిపాల వేణుయాదవ్, ఓయూ నేత కందుల మధు, పార్టీ మండలాధ్యక్షుడు తొగరు రమేశ్ పాల్గొన్నారు.
సీఎం కేసీఆరే
సీఎం కేసీఆరే తెలంగాణకు శ్రీరామ రక్ష అని నియోజకవర్గ మాజీ ఇన్చార్జి కన్మంతరెడ్డి శశిధర్రెడ్డి అన్నారు. కాంగ్రెస్ వాళ్లను నమ్మితే మళ్లీ పాత రోజుల మాదిరి నీళ్లు, కరెంట్ కోసం గోస పడాల్సి వస్తుందన్నారు. ప్రతి ఇంటికి మంచినీరు ఇచ్చిన ఘనుడు కేసీఆర్, కోదాడ ఎమ్మెల్యే మల్లన్న గొప్పగా అభివృద్ధి చేశారన్నారు. ప్రజల కోసం అహర్నిశలు శ్రమించే నాయకుడు బొల్లం మల్లన్న అని కొనియాడారు. అభివృద్ధి చేసే నాయకుడిని ప్రజలు గుర్తించాలని కోరారు.